India vs West Indies : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 97 పరుగులతో చెలరేగిన సంజూ శాంసన్.. టీమిండియా సెమీఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
కోల్కతాలో జరిగిన డూ ఆర్ డై పోరులో సంజూ శాంసన్ విశ్వరూపం చూపించాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన సంజూ, టీమిండియాను దర్జాగా సెమీఫైనల్కు చేర్చాడు. కింగ్ లాంటి ఇన్నింగ్స్తో విండీస్ను దంచికొట్టి.. భారత్కు గ్రాండ్ విక్టరీ అందించాడు.
ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సంజూ శాంసన్ (97 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్కు చేరుకుంది.
25
వెస్టిండీస్ భారీ స్కోరు: హోల్డర్, పొవెల్ మెరుపులు
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు షాయ్ హోప్ (32), రోస్టన్ చేజ్ (40) మంచి పునాది వేశారు. మధ్యలో షిమ్రాన్ హెట్మెయర్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి విండీస్ను కట్టడి చేశాడు. చివర్లో జేసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్మన్ పొవెల్ (34 నాటౌట్) చెలరేగడంతో వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ సాధించారు.
35
లక్ష్య ఛేదనలో తడబడ్డ ఓపెనర్లు.. ఆదుకున్న శాంసన్
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులో ఉన్న సంజూ శాంసన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతనికి యువ ఆటగాడు తిలక్ వర్మ (27) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను భారత వైపు తిప్పారు.
శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ రన్ ఛేజింగ్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. తిలక్ వర్మ అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (17) కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజూ శాంసన్ ఫోర్లు, సిక్సర్లతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.
55
సెమీస్కు గ్రాండ్ ఎంట్రీ.. అభిమానుల సంబరాలు
చివరి ఓవర్ లో 7 పరుగులు కావాల్సిన దశలో సంజూ శాంసన్ మొదటి బంతికే సిక్స్ కొట్టి స్కోర్లు సమం చేయగా, రెండో బంతికి ఫోర్ కొట్టి భారత్ను గెలిపించాడు. ఈ విజయంతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. భారత జట్టు కలిసికట్టుగా రాణించడం, ముఖ్యంగా సంజూ శాంసన్ క్లాస్ ఇన్నింగ్స్ టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాయి. వెస్టిండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసినప్పటికీ భారత విజయాన్ని అడ్డుకోలేకపోయారు. భారత తన తర్వాతి మ్యాచ్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో ఆడనుంది.