India vs Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో పాక్పై టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ బిగ్ ఫైట్ లో గెలిచేది ఎవరు?
IND vs PAK: దాయాది వేటకి సూర్య సేన రెడీ.. కొలంబోలో రికార్డులు తిరగరాస్తారా?
ప్రపంచ క్రికెట్లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహాసంగ్రామం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ప్రఖ్యాత ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.
26
IND vs PAK : ప్రేమదాస స్టేడియంలో హై వోల్టేజ్ పోరు
భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ (ICC), ఏసీసీ (ACC) టోర్నమెంట్లలో మాత్రమే తలపడతాయి. దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్లకు ఉండే క్రేజ్ వర్ణనాతీతం. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోటీ, గ్యాలరీలో అభిమానుల కేకలతో స్టేడియం హోరెత్తిపోనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కాగితం మీద అలాగే మైదానంలో కూడా సూర్య సేన పాకిస్థాన్ కంటే ఎంతో బలంగా కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యువ రక్తంతో కూడిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
36
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఆధిపత్యం
టీ20 వరల్డ్ కప్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, పాకిస్థాన్పై భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు 8 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ 8 మ్యాచ్లలో భారత్ ఏకంగా 7 సార్లు విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పాకిస్థాన్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. అది తప్ప, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ భారతే పైచేయి సాధించింది. ఓవరాల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లను చూసినా, 16 మ్యాచ్లలో భారత్ 13 గెలవగా, పాకిస్థాన్ కేవలం 3 మ్యాచ్లలోనే విజయం సాధించింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2009లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి తన తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది. అప్పట్లో యూనిస్ ఖాన్ ఆ జట్టుకు సారథ్యం వహించారు. ఆ తర్వాత 2007, 2022లో కూడా పాకిస్థాన్ ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ గెలవలేకపోయింది. 2007లో భారత్ చేతిలో, 2022లో ఇంగ్లండ్ చేతిలో పాక్ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం పాకిస్థాన్ జట్టు భారత బౌలింగ్, బ్యాటింగ్ దళాన్ని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
56
భారత్ విజయ పరంపర : 2007 నుండి 2024 వరకు
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్గా నిలిచింది. అప్పుడు ఫైనల్లో పాకిస్థాన్ను 5 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్కు మరో ఐసీసీ ట్రోఫీని అందించాలని పట్టుదలతో ఉన్నారు.
66
సూర్యకుమార్ యాదవ్ ముందున్న అరుదైన అవకాశం
ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఈ టోర్నీ ఎంతో కీలకం. ఒకవేళ భారత్ ఈ వరల్డ్ కప్ గెలిస్తే, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ కెప్టెన్ల సరసన సూర్య పేరు కూడా చేరుతుంది. మైదానంలో తనదైన శైలిలో 360 డిగ్రీల బ్యాటింగ్తో అలరించే సూర్య, కెప్టెన్గా కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు. రికార్డుల పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ, మైదానంలో ఒత్తిడిని జయించిన జట్టుకే విజయం వరిస్తుంది. ఆదివారం రాత్రి జరిగే ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి !