India vs Australia : బ్రిస్బేన్లోని గబ్బాలో వర్షం కారణంగా ఐదో టీ20 మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
బ్రిస్బేన్లో మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టింది. భారత్, ఆస్ట్రేలియా ఐదో మ్యాచ్ రద్దు అయింది. దీంతో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలిచింది. గబ్బా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ కేవలం 4.5 ఓవర్లు మాత్రమే సాగింది. ఆ సమయంలో భారత్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున ఓపెనర్లు అభిషేక్ శర్మ (23 నాటౌట్), శుభ్మన్ గిల్ (29 నాటౌట్) దూకుడుగా ఆరంభించారు. ఐదవ ఓవర్లో మెరుపులు, తర్వాత భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో అధికారికంగా మ్యాచ్ ను రద్దు చేశారు.
26
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
ఈ మ్యాచ్లో కేవలం 11 బంతుల్లో 23 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయన 528 బంతుల్లోనే టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ 573 బంతుల్లో ఆ రికార్డు సృష్టించారు.
అభిషేక్ శర్మ భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (27 ఇన్నింగ్స్) తర్వాత తక్కువ ఇన్నింగ్స్లలో (28) 1000 టీ20 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
36
సిరీస్లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన
అభిషేక్ శర్మ సిరీస్ మొత్తం 163 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఆయన స్ట్రైక్ రేట్ 160 కాగా, సగటు 40.75. మొత్తం 18 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
మెల్బోర్న్లోని రెండో టీ20లో భారత్ ఓడినా, అభిషేక్ 37 బంతుల్లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ కొట్టాడు. సిరీస్లో గిల్ 132 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు, టిమ్ డేవిడ్ 89 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు.
గబ్బాలో జరిగిన చివరి టీ20లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ బ్యాడ్ వెదర్ కారణంగా వారికి నిరాశ ఎదురైంది. వర్షం ప్రారంభమయ్యే వరకు గిల్ మంచి టచ్ లో కనిపించాడు. బెన్ డ్వార్ష్యూస్ బౌలింగ్లో వరుస బౌండరీలు కొట్టాడు. అభిషేక్కి ప్రారంభంలో టైమింగ్ సమస్యలు ఎదురైనా, తర్వాత వేగం అందుకున్న సమయంలో వర్షం మళ్లీ మొదలైంది.
56
13 ఏళ్ల జైత్ర యాత్ర కొనసాగుతోంది
భారత్ 2012 నుండి ఆస్ట్రేలియాలో ఏ ద్వైపాక్షిక టీ20 సిరీస్ను కోల్పోలేదు. ఈసారి కూడా ఆ రికార్డు కొనసాగించింది. 2016లో 3-0, 2020లో 2-1 విజయాల తర్వాత, ఇప్పుడు 2025లో కూడా 2-1తో విజేతగా నిలిచింది.
ఇది భారత్కు వరుసగా ఏడో ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం. గతంలో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై విజయాలు సాధించింది. 2023లో వెస్టిండీస్పై ఓటమి తర్వాత భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.
66
తర్వాతి సిరీస్ దక్షిణాఫ్రికాతో..
భారత జట్టు తన తర్వాతి సిరీస్ లో సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. ఈ టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుండి 19 వరకు జరగనుంది. కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్లలో ఐదు మ్యాచ్లు జరుగుతాయి. యంగ్ ప్లేయర్లతో కూడిన భారత జట్టు సూర్యకుమార్ నాయకత్వంలో ప్రోటిస్ పై కూడా ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది.