T20 World Cup 2026 : భారత్తో మ్యాచ్ బాయ్కాట్ వివాదం వేళ ఐసీసీ ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త డిమాండ్స్ ఉంచాయి. 2031 వన్డే ప్రపంచకప్ వరకు హైబ్రిడ్ మోడల్ పొడిగించాలని పట్టుపడుతున్నాయి. అసలు ఐసీసీ మీటింగ్ లో ఏం జరిగింది?
హైబ్రిడ్ మోడల్ లొల్లి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త ప్లాన్ ఇదే
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య జరుగుతున్న చర్చల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబో లో భారత్తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని బెదిరించిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో కలిసి ఇప్పుడు చర్చల సమయంలో ఐసీసీ ముందు ఓ కొత్త డిమాండ్లను ఉంచింది.
ప్రస్తుతం అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ను 2031 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని ఈ రెండు దేశాలు పట్టుబడుతున్నాయి. ఈ పరిణామం 2031లో సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించనున్న భారత్ అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తోంది.
26
2031 ప్రపంచకప్ లక్ష్యంగా కొత్త ఎత్తుగడ
2031 వన్డే ప్రపంచకప్కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం 2027 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గడువును 2031 ఎడిషన్ వరకు పొడిగించాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు కోరుతున్నాయి.
ఈ పొడిగింపు జరిగితే, 2031 ప్రపంచకప్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్లన్నింటినీ కేవలం బంగ్లాదేశ్లోనే ఆడే వెసులుబాటు పొందుతాయి. అంటే, ఈ టోర్నీ కోసం వారు భారత్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యూహాత్మక డిమాండ్ ద్వారా భవిష్యత్తులో కూడా భారత్లో పర్యటించకుండా ఉండేందుకు ఈ రెండు బోర్డులు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.
36
లాహోర్ లో కీలక సమావేశం
ఈ వివాదంపై చర్చించేందుకు ఆదివారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య కీలక సమావేశం జరిగింది. డాన్ పత్రిక కథనం ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ను పాకిస్థాన్ బాయ్కాట్ చేయాలనే నిర్ణయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సమావేశంలో ఐసీసీ తరఫున డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, బీసీబీ హెడ్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశం అనంతరం ఎలాంటి ఉమ్మడి ప్రకటన విడుదల కాలేదు. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాతే ఇరు పక్షాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్కు వెళ్లడానికి నిరాకరించడంతో ఈ హైబ్రిడ్ మోడల్ తెరపైకి వచ్చింది సుదీర్ఘ చర్చల తర్వాత ఐసీసీతో సహా అన్ని పక్షాలు దీనికి అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ ఆతిథ్య దేశం అయినప్పటికీ, భారత్ తన మ్యాచ్లన్నీ యూఏఈ (UAE)లో ఆడింది.
ఈ ఒప్పందంలోని రెండో భాగం ప్రకారం, 2026 టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్కు ప్రయాణించదు. ఫలితంగా, పాకిస్థాన్ ఆడే ప్రతి మ్యాచ్ (ఒకవేళ ఫైనల్ చేరినా సరే) శ్రీలంకలోనే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరగాల్సి ఉంది. ఈ ఒప్పందం ప్రస్తుతానికి 2027 వరకు మాత్రమే అమలులో ఉంది. కానీ ఇప్పుడు దీన్ని 2031 వరకు పొడిగించాలని పాక్, బంగ్లా డిమాండ్ చేస్తున్నాయి.
56
పీసీబీ మునుపటి డిమాండ్లు ఇవే
పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. ఐసీసీ ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇదివరకే మూడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. ఐసీసీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, భారత్తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాక్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ డిమాండ్లు వచ్చాయి.
ఆదివారం జరిగిన సమావేశంలో పీసీబీ ఈ కింది మూడు డిమాండ్లను ప్రస్తావించినట్లు సమాచారం..
1. బంగ్లాదేశ్కు పరిహారం పెంచాలి.
2. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినప్పటికీ, బంగ్లాదేశ్కు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలి.
3. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఒకదానికి ఆతిథ్య హక్కులు కల్పించాలి.
66
భారత్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగేనా?
ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. ఐసీసీతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2031 వరకు హైబ్రిడ్ మోడల్ పొడిగింపు అనే కొత్త డిమాండ్ ఈ సమస్యను మరింత జఠిలం చేసింది. రాబోయే రోజుల్లో పాక్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ వివాదం మలుపు తిరిగే అవకాశం ఉంది.