Gambhir: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమి తర్వాత, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు సౌరవ్ గంగూలీ కీలక సలహా ఇచ్చారు. స్వదేశంలో పిచ్లను తారుమారు చేయడం మానేసి, ప్రపంచ స్థాయి బౌలింగ్ దాడిపై ఆధారపడాలని సూచించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు అనూహ్య పరాజయం చవిచూసిన తర్వాత, దేశీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కోల్కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయి 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ అవమానకరమైన ఓటమి జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై, జట్టు యాజమాన్యం వ్యూహాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు.
25
పిచ్ల తయారీపై గంగూలీ సూచనలు..
గంగూలీ ప్రధానంగా పిచ్ల తయారీ, ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ 'భారత జట్టు యాజమాన్యం స్వదేశంలో ఆధిపత్యం చలాయించడానికి పిచ్లను తారుమారు చేయడం మానేయాలని సూచించారు. బదులుగా, ప్రస్తుత ప్రపంచస్థాయి బౌలింగ్ సామర్ధ్యంపై ఆధారపడాలని గంగూలీ చెప్పారు. భారత జట్టు పిచ్లను వదిలేసి, బ్యాట్స్మెన్లు 350 కంటే ఎక్కువ స్కోర్ చేయడంపై దృష్టి పెట్టాలని గంగూలీ కోరారు.
35
ఐదు రోజుల్లో ఫలితాలను సాధించేందుకు ప్రయత్నం..
శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని జట్టు గతంలో ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల సిరీస్లో మంచి ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. భారత్ జట్టు మంచి పిచ్లపై ఆడటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని, మూడు రోజుల్లో మ్యాచ్లను ముగించే బదులు ఐదు రోజుల్లో ఫలితాలను సాధించడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. దీన్ని గంభీర్ వింటున్నాడని ఆశిస్తున్నానంటూ గంగూలీ వ్యాఖ్యానించారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ చుట్టూ ఉన్న వివాదం తర్వాత గంగూలీ స్పందిస్తూ "జట్టు కోరుకున్న పిచ్ ఇదేనా?" అని ప్రశ్నించారు.
భారత టెస్ట్ జట్టులో మహమ్మద్ షమీని చేర్చుకోవాలని గంగూలీ మరోసారి బలంగా కోరారు. బుమ్రా, సిరాజ్, షమీలపై మనం విశ్వాసం ఉంచాలి.. ఈ టెస్ట్ జట్టులో షమీకి స్థానం దక్కుతుందని తాను భావించానని గంగూలీ అన్నారు. షమీ, స్పిన్నర్లు కలిసి టెస్ట్ మ్యాచ్ లను గెలిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
55
షమీకి మళ్లీ ఛాన్స్ ఇవ్వండి.!
షమీ దేశీయ క్రికెట్లో చురుగ్గా ఉన్నప్పటికీ, ఫిట్నెస్ సమస్యలు అతన్ని జట్టులోకి తీసుకోకుండా అడ్డుకున్నాయని పేర్కొన్నారు. 64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ, చివరగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టెస్ట్ ఆడాడు. కాగా, గంగూలీ చేసిన ఈ సలహాలు భారత క్రికెట్ భవిష్యత్ వ్యూహాలపై, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.