WPL Final : డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగులతో చరిత్ర సృష్టించింది. జెమీమా రోడ్రిగ్స్, హెన్రీ మెరుపులతో ఆర్సీబీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత ఆర్సీబీ అద్భుతమైన ఆటతో అదరగొట్టింది.
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ స్కోరు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న కోటంబీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న ఢిల్లీ జట్టు, మునుపెన్నడూ లేని విధంగా బ్యాటింగ్ విధ్వంసం చేస్తూ ఫైనల్ మ్యాచ్లలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
26
టాస్ ఓడినా తగ్గని ఢిల్లీ
ఈ కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ గెలిచిన ఆర్సీబీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. లీగ్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో 200 పరుగుల మార్కును ఒక జట్టు దాటడం ఇదే తొలిసారి. ఆర్సీబీ టైటిల్ గెలవాలంటే ఇప్పుడు 204 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
36
ఓపెనర్ల శుభారంభం
ఢిల్లీ ఇన్నింగ్స్ను వికెట్ కీపర్ బ్యాటర్ లెజ్లీ లీ అద్భుతంగా ప్రారంభించింది. ఆమె కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి జట్టుకు గట్టి పునాది వేసింది. మరోవైపు లారా వాల్వార్డ్ కూడా ధాటిగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. వాల్వార్డ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వేగాన్ని ఇచ్చింది. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత కూడా ఢిల్లీ జోరు ఏమాత్రం తగ్గలేదు.
జట్టు భారీ స్కోరు సాధించడంలో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది. మైదానం నలుమూలలా ఫోర్ల వర్షం కురిపిస్తూ జెమీమా అద్భుత అర్ధసెంచరీని నమోదు చేసింది. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో ఆమె 57 పరుగులు సాధించింది. ఆర్సీబీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. జెమీమా ఇన్నింగ్స్ కారణంగానే ఢిల్లీ జట్టు మధ్య ఓవర్లలో పట్టు కోల్పోకుండా పరుగుల వేటను కొనసాగించింది.
56
చిన్లే హెన్రీ తుఫాన్ ఇన్నింగ్స్
ఇన్నింగ్స్ ఆఖర్లో చిన్లే హెన్రీ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన ఆమె, కేవలం 15 బంతుల్లోనే 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. 233.89 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన హెన్రీ, ఢిల్లీ స్కోరును 200 మార్కు దాటించడంలో కీలకమైంది. ఆర్సీబీ బౌలర్లు ఆమె ముందు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు.
66
ఫైనల్ చరిత్రలో నయా రికార్డ్
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును అందుకోలేదు. కానీ ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రికార్డును తిరగరాసింది. పరుగుల వరద పారించిన ఢిల్లీ బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు భారమంతా ఆర్సీబీ బ్యాటర్లపైనే ఉంది. 204 పరుగుల లక్ష్యం ఫైనల్ ఒత్తిడిలో చాలా పెద్దది.
ఆర్సీబీ ఈ రికార్డు స్కోరును ఛేదించి చరిత్ర మారుస్తుందా లేదా ఢిల్లీ తన మొదటి టైటిల్ను కైవసం చేసుకుంటుందా అనేది ఆసక్తి పెరిగింది. అయితే, ఆర్సీబీ తాము ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా దుమ్మురేపే బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. జార్జియా వోల్, స్మృతి మంధాన హాఫ్ సెంచరీ నాక్ లతో ఆర్సీబీకి మరో టైటిల్ ను అందించే దిశగా ముందుకు నడిపించారు.