CWG 2026: గ్లాస్గోలో భారత్ పంచ్ బాక్స్.. ఒకే రోజు 8 గోల్డ్ మెడల్స్‌తో చరిత్ర సృష్టించిన ఇండియా

Published : Aug 02, 2026, 10:25 AM IST

Commonwealth Games Glasgow: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
14
గ్లాస్గోలో మనోళ్ల గోల్డెన్ పంచ్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో ఇండియా.. ఏ క్రీడలో ఎన్ని పతకాలు వచ్చాయంటే?

గ్లాస్గో లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 తుది దశకు చేరుకుంది. ఆగస్టు 1న శనివారం నాటి పోటీలు భారత క్రీడారంగంలో ఒక సవర్ణాధ్యాయంగా నిలిచిపోయాయి. ఈ ఒక్క రోజే భారత అథ్లెట్లు ఏకంగా 8 స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. ఇందులో 7 గోల్డ్ మెడల్స్ ఒక్క బాక్సింగ్ విభాగంలోనే రావడం విశేషం. మరొక గోల్డ్ మెడల్‌ను పారా షాట్ పుట్ క్రీడలో సోమణ్ రాణా సాధించారు.

ఆగస్టు 2తో ఈ టోర్నమెంట్ పూర్తవుతుండగా, రేపు క్లోజింగ్ సెరెమనీ జరగనుంది. చివరి రోజుకు ముందు నాటికే భారత్ ఖాతాలో మొత్తం 39 పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది.

24
బాక్సింగ్‌లో సరికొత్త చరిత్ర

గ్లాస్గో లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో భారత రింగ్ వీరులు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే భారత్‌కు ఇది అత్యుత్తమ బాక్సింగ్ ప్రదర్శన. భారత్ బాక్సింగ్‌లో 7 స్వర్ణాలు, 3 రజతాలతో మొత్తం 10 పతకాలు సాధించి మెడల్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన 7 పతకాల (3 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్) రికార్డును ఈసారి మన బాక్సర్లు తిరగరాశారు.

శనివారం జరిగిన పురుషుల 90+ కేజీల ఫైనల్లో నరేందర్ బెర్వాల్ ఇంగ్లాండ్‌కు చెందిన దమార్ థామస్ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయి రజత పతకం సాధించడంతో భారత్ బాక్సింగ్ ప్రచారం పూర్తయింది. అంతకుముందు పురుషుల 80 కేజీల ఫైనల్లో అంకుష్ పంఘాల్ 4-1 తేడాతో ఇంగ్లాండ్ అభ్యర్థి డిమేజి షిట్టుపై విజయం సాధించి ఏడో స్వర్ణాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ నమీబియాకు చెందిన ట్రైగేన్ మార్నింగ్ నదేవెలోపై 3-2తో ఉత్కంఠ విజయం సాధించాడు.

మహిళల విభాగంలో అరుంధతి చౌదరి (70 కేజీలు) 5-0తో ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌పై ఘనవిజయం సాధించింది. ప్రీతి పవార్ (54 కేజీలు) కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోను 5-0తో ఓడించింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జైస్మిన్ లంబోరియా (57 కేజీలు) 5-0తో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైకేలా వాల్ష్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. సాక్షి చౌదరి (51 కేజీలు) 5-0తో ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌పై, ప్రియా ఘంఘాస్ (60 కేజీలు) 4-1తో కెనడాకు చెందిన మేరీ బాతుల్ అల అహ్మదీయాపై విజయం సాధించి పసిడి పతకాలను ముద్దాడారు.

ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా సూ గ్రీన్ ట్రీ చేతిలో 1-4తో, జాదుమణి సింగ్ (55 కేజీలు) ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో 0-5తో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

34
పారా షాట్ పుట్‌లో సోమణ్ రాణా రికార్డు

భారత సైన్యంలో సేవలు అందిస్తున్న సమయంలో శరీర దిగువ భాగాన్ని కోల్పోయిన బీహార్‌లోని గయాజీకి చెందిన పారా అథ్లెట్ సోమణ్ రాణా పారా షాట్ పుట్ F57 విభాగంలో 13.40 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇదే పోటీలో భారత క్రీడాకారుడు శుభమ్ జుయాల్ 13 మీటర్లకు పైగా విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒకే విభాగంలో ఇద్దరు భారతీయులు మొదటి రెండు స్థానాల్లో నిలవడం కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

44
శనివారం వచ్చిన ఇతర పతకాలు

శనివారం భారత్ ఖాతాలో 8 గోల్డ్ మెడల్స్‌తో పాటు 5 రజతాలు, 3 కాంస్య పతకాలు చేరాయి. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ సిల్వర్ మెడల్స్ సాధించగా, అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, పారా అథ్లెటిక్స్ షాట్ పుట్ F57 లో శుభమ్ జుయాల్ రజత పతకాలు సాధించారు.

కాంస్య పతకాల విషయానికి వస్తే, అథ్లెటిక్స్ పురుషుల 5000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్, జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 122 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. భారత్ అథ్లెటిక్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, బౌల్స్, బాక్సింగ్, జూడో, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వేట్ లిఫ్టింగ్ సహా పారా విభాగాల్లో పోటీపడింది.

Read more Photos on
click me!

Recommended Stories