Jyoti Malhotra: భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు పంపుతున్న పలువురిని నిఘా వర్షాలు అరెస్టు చేశాయి. హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే 33 ఏళ్ల మహిళను భారత సైనిక సమాచారం పాకిస్థాన్కు లీక్ చేసిన కేసులో అరెస్ట్ చేశారు. ఆమె 'Travel With Jo' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నడుపుతోంది.
పోలీసుల ప్రకారం.. జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి పాకిస్థాన్ హైకమిషన్లో పని చేసిన ఏహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ దానిష్ అనే వ్యక్తిని కలిసిన తరువాత పాకిస్థాన్కు రెండు సార్లు ప్రయాణించింది. 2023లో వీసా కోసం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ను సందర్శించిన జ్యోతి అక్కడ దానిష్ను కలుసుకుంది.
అనంతరం పాకిస్థాన్ వెళ్లిన ఆమె అక్కడ అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలుసుకొని పాకిస్తాన్ భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ కావడం, వారిలో షకీర్, రానా షహ్బాజ్లు ఉన్నారు. పాక్ అధికారుల పేర్లను ఆమె ఇతరులు గుర్తించకుండా మారుపేరుతో సేవ్ చేసుకున్నట్టు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అలాగే, జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్ల ద్వారా ఈ వ్యక్తులతో నిరంతరంగా వివరాలు పంచుకుంటున్నారనీ, భారత దేశ భద్రతకు సంబంధించిన గూఢ సమాచారాన్ని పంచుకుందని అధికారులు గుర్తించారు. జ్యోతి భారత సార్వభౌమత్వం, ఏకత్వం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలలో పాల్గొన్నందుకు IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.
మార్చి నెలలో యూట్యూబ్ షార్ట్ వీడియోలో జ్యోతి తన పాకిస్థాన్ ప్రయాణాన్ని వివరించింది. అటారి-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్ చేరుకున్నాననీ, అక్కడ హిందూ పుణ్యక్షేత్రాలు సందర్శించానని తెలిపింది.
అలాగే భారత రూపాయిని పాకిస్తాన్ కరెన్సీగా మార్చుకున్నప్పుడు నష్టపోయానని వెల్లడించింది. ఇటీవల లాహోర్ వీధులు, రంజాన్ ఫుడ్ టూర్, ఆలయాల సందర్శనలపై వీడియోలు కూడా ఆమె పోస్ట్ చేసింది.
పానీపట్లో 24 ఏళ్ల నౌమాన్ ఇలాహిని పాకిస్థాన్కు గూఢ సమాచారం పంపిన కేసులో అరెస్ట్ చేశారు. మే 12న కైథల్లో 25 ఏళ్ల విద్యార్థి దేవేంద్ర సింగ్ ధిల్లోన్ను అరెస్ట్ చేశారు. అతను కార్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్థాన్ వెళ్లి ISI అధికారులతో సమాచారాన్ని పంచుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు. పటియాల ఖల్సా కళాశాలలో రాజకీయ శాస్త్రం చదువుతున్న ధిల్లోన్ పటియాల సైనిక శిబిరానికి సంబంధించిన చిత్రాలను కూడా పాకిస్థాన్కు పంపినట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.