Viral Video: దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. సీబీఎస్సీ 12వ తరగతి క్వశ్చన్ పేపర్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూడగా...
12వ తరగతి గణిత పరీక్ష ప్రశ్నాపత్రంలో ముద్రించిన QR కోడ్ను కొందరు విద్యార్థులు స్కాన్ చేశారు. సాధారణంగా ఈ కోడ్ను స్కాన్ చేస్తే సదరు ప్రశ్నాపత్రానికి సంబంధించిన వివరాలు వస్తాయి. అయితే సీబీఎస్ క్వశ్చన్ పేపర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే అది యూట్యూబ్లో వీడియో ఓపెన్ అయ్యింది. ఈ వీడియో ప్రముఖ గాయకుడు రిక్ అస్ట్లీ పాడిన నెవర్ గోన గీవెన్ యూ అప్ పాటకు సంబంధించింది. దాదాపు 10 సెకన్ల వీడియో కనిపించడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు.
25
‘రిక్రోలింగ్’ అనే ఇంటర్నెట్ ప్రాంక్
ఈ వీడియోకు వెళ్లే లింక్ను చూసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇది “రిక్రోలింగ్” అనే ఇంటర్నెట్ ప్రాంక్ కావచ్చని అనుమానించారు. రిక్రోలింగ్ అంటే ఒక లింక్పై క్లిక్ చేస్తే లేదా QR కోడ్ స్కాన్ చేస్తే అనూహ్యంగా అదే పాట వీడియోకు తీసుకెళ్లే సరదా ట్రిక్. సాధారణంగా ఇది సోషల్ మీడియా లేదా వెబ్సైట్లలో కనిపిస్తుంది. అయితే పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇలా జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
35
విద్యార్థుల్లో సందేహాలు
ఈ సంఘటన తర్వాత కొన్ని పాఠశాలల విద్యార్థులు ప్రశ్నాపత్రం నిజమేనా అనే సందేహం వ్యక్తం చేశారు. నోయిడాకు చెందిన ఓ విద్యార్థిని ఈ విషయమై మాట్లాడుతూ.. “పేపర్ అంత కష్టంగా లేదు. కానీ దేశవ్యాప్తంగా జరిగే పరీక్షలో ఇలాంటి లింక్ ఉండటం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇది విద్యార్థులపై చేసిన సరదా ప్రాంక్లా అనిపించింది” అని చెప్పాడు.
ఉపాధ్యాయుల ప్రకారం ప్రశ్నాపత్రాల్లో QR కోడ్లను సాధారణంగా భద్రత కోసం ముద్రిస్తారు. ఈ కోడ్ల ద్వారా ప్రశ్నాపత్రం నిజమైనదేనా లేదా అనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అలాగే ఎక్కడైనా భద్రతా లోపం అనుమానం వచ్చినప్పుడు ఈ కోడ్ ద్వారా వివరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వీడియో లింక్కు వెళ్లిన సంఘటన ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని చెబుతున్నారు.
55
స్పందించిన సీబీఎస్ఈ అధికారులు
ఈ ఘటనపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రశ్నాపత్రం పూర్తిగా నిజమైనదేనని స్పష్టం చేశారు. పరీక్షల నియంత్రణాధికారి సాన్యం భరద్వాజ్ మాట్లాడుతూ.. కొన్ని సెట్లలో ఉన్న QR కోడ్ స్కాన్ చేసినప్పుడు యూట్యూబ్ వీడియోకు వెళ్లిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ప్రశ్నాపత్రాల భద్రతకు ఎలాంటి భంగం కలగలేదని, పేపర్ పూర్తిగా అసలైనదేనని బోర్డు వెల్లడించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది.