Uttarakhand Rains : దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నారు. వేసవిలో ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కూడా దంచి కొడుతున్నాయి. భగ్గుమంటున్న సూర్యుడికి సడన్ గా మబ్బులు అడ్డువచ్చి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇలా పలురాష్ట్రాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు మొదలై వరదలకు దారితీస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఇవాళ(గురువారం) ఇదే జరిగింది.
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో భారీ వర్షం మరోసారి విధ్వంసం సృష్టించింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల ఆ ప్రాంతంలో చాలా నష్టం వాటిల్లడమే కాకుండా సాధారణ జనజీవనం కూడా స్తంభించింది. ముఖ్యంగా థరాలి మరియు పరిసర ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురవడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదాలు సంభవించాయి. కార్లు, బైక్లు సహా అనేక వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చాలా రోడ్లను మూసివేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో పెద్దపెద్ద బండరాళ్లు రోడ్లపై ఉన్నాయని... ఇలాంటి సమయంలో ఆ రోడ్లపై ప్రయాణం అసాధ్యమని సహాయక సిబ్బంది చెబుతున్నారు. అందువల్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా రోడ్లను మూసివేసినట్లు చెబుతున్నారు.
శిథిలాలను తొలగించడానికి మరియు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి BRO (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) చురుకుగా పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులు పౌరులను అప్రమత్తం చేస్తున్నారు... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉందికాబట్టి కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరం అయితేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచిస్తున్నారు.