Annamalai
Annamalai : అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది (2026) ఆరంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... అంటే ఇంకా తొమ్మిది పది నెలల సమయం ఉంది. ఈలోపు ప్రజలను తప్పవైపు తిప్పుకోవాలని అధికార డిఎంకే... ప్రతిపక్ష అన్నాడీఎంకే, బిజెపి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇటీవలే సినీనటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ కూడా ప్రజల్లోకి వెళుతున్నాడు. ఇలా ఈసారి తమిళనాట త్రిముఖ పోరు ఉండేలా కనిపిస్తోంది.
అయితే ఇప్పటికే తమిళనాడులో అన్నాడిఎంకే, బిజెపి కలిసి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇటీవలే కేంద్ర హోంమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు అమిత్ షా తమిళనాడులో పర్యటించి అన్నాడిఎంకే నాయకులతో చర్చలు జరిపి పొత్తు ఖరారు చేసారు. పిఎంకె, డిఎండికె పార్టీలను కూడా ఏకం చేసి ఎన్నికల బరిలోకి దిగాలని బిజెపి పావులు కదుపుతోంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే తమిళనాడు బలమైన కూటమిని ఏర్పాటుచేసి అధికార పార్టీని ఓడించేలా ప్లాన్ చేస్తోంది బిజెపి.
ఈ పొత్తుల ప్రక్రియలో భాగంగా తమిళనాడు బిజెపి అధ్యక్ష మార్పు తప్పలేదు. ఆ రాష్ట్ర బిజెపిలో మంచి ఊపు తెచ్చిన అన్నామలైని సరిగ్గా ఎన్నికల ముందు తప్పించారు. అన్నాడిఎంకే నుండి బిజెపిలో చేరిన నైనార్ నాగేంద్రన్ కు అద్యక్ష పగ్గాలు అప్పగించారు. దీంతో అన్నామలై వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది... బహిరంగాగానే వారు దాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఏది జరిగినా మన మంచికే... ఇప్పుడు అధ్యక్ష పదవినుండి తొలగింపు వ్యవహారం కూడా అన్నామలై మంచికే జరిగినట్లు ఉంది. ఆయనకు ఇంతకంటే మంచి పదవి వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Annamalai
కేంద్ర మంత్రిగా అన్నామలై?
తమిళనాడు బిజెపి అధ్యక్షుడి మార్పు ప్రకటన వేళ కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అన్నామలై పనితీరును ప్రశంసించిన ఆయన భవిష్యత్ లో మరింత ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బిజెపి అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నామలైని రాజ్యసభకు నామినేట్ చేసి నరేంద్ర మోదీ కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లోపే ఈ ప్రక్రియను పూర్తిచేసే ఆలోచనలో బిజెపి అదిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఆంధ్ర ప్రదేశ్ నుండి అన్నామలైని రాజ్యసభకు పంపేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం ఎన్డిఏ కూటమి అధికారంలో ఉంది... కాబట్టి మిత్రపక్షాలైన టిడిపి, జనసేనను ఒప్పించి అన్నామలైని రాజ్యసభకు పంపాలను బిజెపి చూస్తోందట. ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదనను బిజెపి ఉంచినట్లు సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే రాజ్యసభ నుండి ఎంపీగానే కాదు కేంద్ర మంత్రిగా కూడా అన్నామలైకి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
అన్నామలై కోసం టిడిపి, జనసేన పార్టీలతో బిజెపి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిమధ్య ఒప్పందం కుదిరితే అన్నామలై ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. తదుపరి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో అన్నామలైకి మంత్రివర్గ బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం.
Annamalai
బండి సంజయ్ లాగే అన్నామలైకి అదృష్టం కలిసొస్తుందా?
తెలంగాణలో కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించారు. కానీ ఆయనకు బిజెపి అధినాయకత్వం కేంద్రంలో మంచి స్థానం కల్పించింది... చివరకు ఎంపీగా గెలిపించుకుని కేంద్ర మంత్రిపదవి ఇచ్చింది. సేమ్ ఇలాగే అన్నామలైని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకునే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో బిజెపిని బలోపేతం చేసి పోటీకి సిద్దయవుతున్న సమయంలో అన్నామలైను తప్పిస్తోంది బిజెపి అదిష్టానం. ఆయనను కూడా రాజ్యసభ నుండి ఎంపీగా చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తోందంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే సేమ్ బండి సంజయ్ కు దక్కిన అదృష్టమే అన్నామలైకి దక్కినట్లు అవుతుంది.
Annamalai
ఏఐడిఎంకే వల్లే అన్నామలై పదవి పోయిందా?
అన్నామలై నుండి అధ్యక్ష పగ్గాలు లాక్కోడానికి ఏఐఏడిఎంకే (అన్నా డిఎంకే) కూడా ఓ కారణంగా తెలుస్తోంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అన్నా డిఎంకే కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా అన్నామలై ఉంటే పొత్తు కష్టమని ... ఆయనను తొలగించాలని అన్నాడిఎంకే కోరినట్లు తెలుస్తోంది. అందువల్లే అన్నామలైని తప్పుకోవాలని బిజెపి అదిష్టానం కోరింది... వారి ఆదేశాలతోనే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.