
Tamil Nadu Budget Highlights : తమిళనాడులో ఇటీవల అధికారాన్ని చేపట్టిన TVK (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి విజయ్ ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారని అర్థమవుతోంది. అసెంబ్లీలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి మరియ విల్సన్ ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కీలక పథకాల ప్రస్తావన ఉంది... వీటికి భారీగా నిధులు కేటాయించారు. మరి విజయ్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఏ పథకాలను అమలుచేయనుందో ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా వచ్చేనెల (సెప్టెంబర్) 15న చిన్నారులకు బంగారాన్ని అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వమే మేనమామ పాత్ర పోషిస్తూ పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం అందిస్తుందని ఆర్థిక మంత్రి మరియ విల్సన్ తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.560 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకే ఈ పథకం అని ఆయన అన్నారు.
తమిళనాడులో నివసిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు 1 గ్రాము బంగారు ఉంగరం ఇస్తారు. జూన్ 22, 2026 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారని ఆర్థిక మంత్రి తెలిపారు.
తమిళనాడు బడ్జెట్ లో విద్యాశాఖకు కూడా భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 'సూపర్ క్లీన్ - సూపర్ క్యాంపస్' పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా పాఠశాల ప్రాంగణాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతారు. మొదటి దశ అమలు కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు కేటాయించింది.
ఇక విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. హెల్మెట్, వాటర్ బాటిల్తో కూడిన సైకిళ్లను విద్యార్థులకు అందించనున్నారు.. ఈ పథకం కోసం రూ.277 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య నాణ్యతను పెంచేందుకు పాఠ్యప్రణాళిక సంస్కరణల కోసం రూ.25 కోట్లు, పబ్లిక్ లైబ్రరీలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
తమిళనాడు బడ్జెట్లో మహిళల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రెండు కీలక పథకాలను ప్రకటించింది. ఉచితంగా పాలు ఇచ్చే ఆవులు, మేకలు అందించే ఈ పథకాల కోసం మొత్తం రూ.167 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ తెలిపారు.
గ్రామీణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పాడి ఆవుల పంపిణీ పథకానికి రూ.57 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన 10,000 మంది మహిళలకు ఉచితంగా పాడి ఆవులను అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు, మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక మేకల పంపిణీ కోసం కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.110 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు 100 శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి 5 మేకలను ఉచితంగా అందిస్తారు. ఇది వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారం, మంచి క్వాలిటీ పట్టుచీర ఇచ్చే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హామీగా ఇచ్చిన ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు, విధివిధానాలను బడ్జెట్లో చేర్చారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించడం, మహిళలకు సామాజిక భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశమని ఆర్థికమంత్రి తెలిపారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వధువులు ఈ పథకానికి ప్రధాన లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది. అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను అధికారిక జీవోలో స్పష్టం చేయనున్నారు.
ఇంటి కరెంట్ ఖర్చులను తగ్గించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ లో ఓ కీలక ప్రకటన చేసింది. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన కుటుంబాలకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ అందించనున్నట్లు తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఈ ఆర్థిక సహాయం ఉంటుందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
ఈ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తొలి దశలో రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఇంట్లోనే సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడం వల్ల నెలవారీ కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని, ముఖ్యంగా వేసవిలో పెరిగే కరెంట్ వాడకాన్ని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం కింద ఇంట్లో వాడిన కరెంట్ పోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అమ్మే 'నెట్ మీటరింగ్' సౌకర్యం కూడా కల్పిస్తారు. దీనివల్ల కరెంట్ బిల్లులో రాయితీతో పాటు కొంతమందికి అదనపు ఆదాయం కూడా వస్తుంది. దీంతో బొగ్గు వాడకం తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.