
ఆకాశంలో అరుదైన అద్భుతం జగరబోతోంది. ఖగోళ ప్రేమికులకు, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. సాధారణంగా ఏడాదికి ఒకటి లేదా రెండు అరుదైన ఖగోళ సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, ఒకే రోజు ఏకంగా నాలుగు వేర్వేరు ఖగోళ వింతలు జరగడం చాలా అరుదు. ఆగస్టు 12న సరిగ్గా 24 గంటల వ్యవధిలో నాలుగు అంతరిక్ష సంఘటనలు ఒకేసారి జరగనున్నాయి.
ఈ రోజున ఆకాశంలో సిక్స్ ప్లానెట్ పరేడ్, సంపూర్ణ సూర్యగ్రహణం, న్యూ మూన్ ఫేజ్, పెర్సీడ్ ఉల్కాపాతం ఒకదాని తర్వాత ఒకటి దర్శనమివ్వనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, స్కై వాచర్లు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. మన సౌరకుటుంబంలోని గురుడు (Jupiter), బుధుడు (Mercury), అంగారకుడు (Mars), శని (Saturn), యురేనస్ (Uranus), నెప్ట్యూన్ (Neptune) అనే ఆరు గ్రహాలు ఆకాశంలో తూర్పు నుండి పడమర వరకు ఒకే వరుసలో వరుసకట్టి కనిపిస్తాయి.
దీనినే ఖగోళ శాస్త్రంలో 'ప్లానెట్ పరేడ్' అని పిలుస్తారు. 'ఆస్ట్రోనామర్స్ వితౌట్ బోర్డర్స్' కమ్యూనికేషన్స్ మేనేజర్ ఆండ్రూ ఫజేకాస్ తెలిపిన వివరాల ప్రకారం, ప్లానెట్ పరేడ్ అనేది అధికారిక సైంటిఫిక్ టర్మ్ కాదు. గ్రహాలన్నీ ఆకాశంలో ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించడాన్ని సాధారణంగా ఈ పేరుతో పిలుస్తారు. ఇందులో కుజుడు, శని, గురుడు, బుధుడు గ్రహాలను మనం సాధారణ కంటితోనే చూడవచ్చు. కానీ యురేనస్, నెప్ట్యూన్ వంటి దూరంలో ఉన్న గ్రహాలను చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ తప్పనిసరి.
ప్లానెట్ పరేడ్ ముగిసిన కాసేపటికే మరో భారీ అంతరిక్ష సంఘటన జరగనుంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య సరిగ్గా అడ్డంగా రావడం వల్ల సూర్యకాంతి భూమిపై పడకుండా పూర్తిగా మారిపోతుంది. దీంతో గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో పగటిపూటే రాత్రి లాగా చీకటి కమ్ముకుంటుంది.
ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలకు పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే, ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. భారతీయ కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12న రాత్రి 9:45 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటలకు ముగుస్తుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి వేళ కావడం వల్ల సూర్యుడు ఎప్పటిలాగే ఉంటాడు. కాబట్టి భారతీయులు దీనిని ప్రత్యక్షంగా చూడలేరు.
సూర్యగ్రహణం జరగడానికి ప్రధాన కారణం చంద్రుడు తన 'న్యూ మూన్' దశకు చేరుకోవడమే. ఈ సమయంలో చంద్రుడి వెనుక భాగంపై మాత్రమే సూర్యకాంతి పడుతుంది. భూమి వైపు ఉన్న భాగం పూర్తిగా చీకటిగా ఉంటుంది. దీనివల్ల ఆకాశంలో చంద్రుని వెలుగు అస్సలు ఉండదు. రాత్రి వేళ ఆకాశం పూర్తి పిచ్-బ్లాక్ గా మారుతుంది. అయితే, ఈ కాంతి లేకపోవడమే ఆ తర్వాత జరగబోయే నాలుగో ఖగోళ వింతకు ఎంతో అనుకూలంగా మారనుంది.
అమావాస్య కావడం వల్ల ఏర్పడిన గాఢాంధకారం పెర్సీడ్ ఉల్కాపాతానికి అద్భుతమైన బ్యాక్డ్రాప్ను అందిస్తుంది. ప్రతి ఏటా వచ్చే ఈ ఉల్కాపాతం ఆగస్టు 12న తన పీక్ స్టేజ్ చేరుకుంటుంది. వెన్నెల కాంతి అడ్డంకి లేకపోవడం వల్ల గంటకు దాదాపు 100 వరకు ఉల్కలు ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తూ మెరుస్తాయి.
క్యాంపెయిన్ స్విఫ్ట్-టటిల్ వదిలివెళ్లిన శిథిలాల వల్ల ఈ ఉల్కాపాతం ఏర్పడుతుంది. బిబిసి స్కై ఎట్ నైట్ మ్యాగజైన్ ప్రకారం, ఆగస్టు 12, 13, 14 తేదీల్లో సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. విశేషమేమిటంటే, పెర్సీడ్ ఉల్కాపాతం పీక్ స్టేజ్, న్యూ మూన్ రాత్రి ఒకేసారి రావడం మళ్లీ 19 సంవత్సరాల తర్వాత, అంటే 2045లోనే జరుగుతుంది.
ఆగస్టు 12న రాబోతున్న ఈ ఖగోళ వింతల గురించి సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. గ్రహణం వల్ల భూమిపై కొద్దిసెకన్ల పాటు గురుత్వాకర్షణ శక్తి నశిస్తుందని, జీరో గ్రావిటీ ఏర్పడుతుందని వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది కేవలం చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల జరిగే సహజమైన ప్రక్రియ మాత్రమే తప్ప, గ్రావిటీలో ఎలాంటి మార్పూ ఉండదని సైంటిస్టులు స్పష్టం చేశారు.
మొత్తానికి ఆగస్టు 12 అనేది ఆస్ట్రోనామీ లవర్స్కు ఒక మరపురాని రోజు కానుంది. ఉదయం గ్రహాల పరేడ్, పగలు సూర్యగ్రహణం, రాత్రి పెర్సీడ్ ఉల్కాపాతంతో ఆకాశం ఒక రేంజ్లో సందడిగా మారబోతోంది.