
Narendra Modi : ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సపోర్టర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతోంది... మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలకు దిగింది. ఇలా జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీకోసం నిర్వహించే NEET ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. దీంతో ఇక ఎన్డిఏ సర్కార్ పని అయిపోయింది... ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ తగ్గిందనే ప్రచారం జోరందుకుంది. అయితే కేవలం ఒకేఒక్క వీడియోతో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు మోదీ… ఈ సంక్షోభ సమయంలో ఆయన విడుదలచేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా వరల్డ్ రికార్డులను బద్దలుగొడుతూ ప్రధాని మోదీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది ఈ సెల్ఫీ వీడియో.
NEET (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పేపర్ లీక్ కు పాల్పడి విద్యార్థుల జీవితాలను చెలగాటం ఆడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతోంది. యువత దేశ రాజధాని డిల్లీ వీధుల్లోకి భారీగా చేరుకుని ఆందోళనలు చేపడుతున్నారు... దీంతో జంతర్ మంతర్ ప్రాంతం రణరంగంగా మారింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని... అప్పటివరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సిజెపి నాయకులు చెబుతున్నారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో దేశ యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ జూలై 23న అంటే గత గురువారం అర్థరాత్రి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఏకంగా ప్రపంచ రికార్డునే నెలకొల్పింది.
ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నవిషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏకంగా 102 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ ఫామ్ లో స్వయంగా మోదీయే సెల్పీ వీడియో తీసుకుని వీడియో పోస్ట్ చేశారు... మరి ఫాలోవర్స్ ఆగుతారా... ఆ వీడియోను తెగ షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
ప్రధాని మోదీ పోస్ట్ చేసిన 24 గంటల్లోనే ఆ వీడియో ఏకంగా 303 మిలియన్స్ అంటే 30 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇది వరల్డ్ రికార్డు. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ 2026 పై ప్రముఖ కంటెంట్ క్రియేటర్ "ఐషో స్పీడ్'' పోస్ట్ చేసిన వీడియో 300 మిలియన్ వ్యూస్ సాధించింది. దీనికంటే ఎక్కువగా సోషల్ మీడియా వ్యూస్ సాధించింది ప్రధాని మోదీ వీడియో... ఇలా సోషల్ మీడియా రికార్డ్ బద్దలుగొట్టి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రధాని మోదీ నిరూపించారు.
జెన్-జీ యువతకు దగ్గరయ్యేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని తాజాగా ఆయన వ్యవహారతీరును బట్టి అర్థమవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన యువత భాషలోనే మాట్లాడుతున్నారు... మై ఫ్రెండ్స్ అంటూ సంబోధిస్తూ వీడియో ప్రారంభిస్తున్నారు. ఇలా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ పోస్ట్ చేసిన వీడియోను వైరల్ చేయడంపై ప్రధాని రియాక్ట్ అయ్యారు. యువతకు ధన్యవాదాలు తెలిపారు.
''థ్యాంక్యూ ప్రెండ్స్... ఇటీవల నాకు మీతో కలిసేందుకు అవకాశం దొరికింది. నేను పోస్ట్ చేసిన వీడయోపై మీరు స్పందించిన తీరు అద్భుతం. చాలామంది నిర్మాణాత్మక సూచనలు ఇచ్చారు... ఇందుకు గాను ప్రతిఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నా. మీ ప్రేమ ఎప్పటికీ నిలిచివుంటుంది, మన బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ.. థ్యాంక్యూ ఫ్రెండ్స్'' అంటూ ప్రధాని వీడియో విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇకపై ఎలాంటి అవకతవకలు జరక్కుండా జాగ్రత్తపడుతోంది కేంద్ర ప్రభుత్వం… ఇందులో భాగంగానే ఇటీవల కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల విశ్వసనీయతను కాపాడటంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కొత్త ప్రతిపాదనల ప్రకారం పేపర్ లీక్ కేసులను సాధారణ కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగనివ్వకుండా ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుల్లో విచారించనున్నారు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తు, విచారణ పూర్తిచేసి మూడు నెలల్లోనే తీర్పు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక న్యాయస్థానాలకు చట్టబద్ధ హోదా కల్పించనున్నారు. దీంతో దోషులకు త్వరగా శిక్షలు పడటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం–2024 ప్రకారం వ్యక్తిగతంగా పేపర్ లీక్కు పాల్పడితే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. వ్యవస్థీకృత నేరాల్లో 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ చట్ట సవరణలతో సంఘటిత పేపర్ లీక్ ముఠాలు, మాఫియాలపై చర్యలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతిపాదనల ప్రకారం ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.