Paper Leak Protest: మరో పేపర్ లీక్ రచ్చ.. రాంచీలో జంతర్ మంతర్ సీన్.. రగులుతున్న ఝార్ఖండ్

Published : Aug 03, 2026, 02:07 PM IST

Paper Leak Protest: జేఎస్‌ఎస్‌సీ, జేపీఎస్సీ పరీక్షల అవకతవకలపై ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి నేత దేవేంద్రనాథ్ ఆమరణ దీక్షకు దిగారు. రాంచీలో జంతర్ మంతర్ సీన్ కనిపిస్తోంది.

PREV
15
రాంచీలో వర్షంలోనూ విద్యార్థుల పోరాటం.. సీబీఐ ఎంక్వైరీ తేలేదాకా తగ్గేదే లే

దేశంలో పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలంటే చాలు.. వివాదాలు, పేపర్ లీక్‌లు రచ్చలేపుతున్నాయి. రీసెంట్‌గా నీట్ పరీక్ష వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీని ఏ రేంజ్‌లో ఊపేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అలాంటి సీనే ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో రిపీట్ అవుతోంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (JSSC-CGL) పరీక్షల్లో భారీగా అవకతవకలు, పేపర్ లీక్‌లు జరిగాయంటూ వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. గత ఐదు రోజులుగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం కేంద్రంగా సాగుతున్న ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

25
ఆమరణ దీక్షకు దిగిన విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో

ప్రభుత్వం, కమిషన్ వైఖరికి నిరసనగా ఆందోళనను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. "గత నెల 2వ తేదీన 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. సరిగ్గా నెల రోజులుగా మేం పోరాడుతున్నాం. జూలై 5న ఆందోళన మొదలుపెట్టి, జూలై 7న గవర్నర్‌ను కలిశాం. జూలై 8న దిష్టిబొమ్మలు దగ్ధం చేశాం. జూలై 20న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిసి ఆధారాలు ఇచ్చాం. అయినా సరే ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ లేదు. నిరుద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. అందుకే ఈ రోజు నుంచి ఆహారాన్ని ముట్టనని శపథం చేస్తున్నా" అని మహతో అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, సదరు పరీక్షలు నిర్వహించిన టీడీపీఎల్ (TDPL) ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

35
విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఏంటి?

రాంచీ వీధుల్లో పోరాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వం ముందు కొన్ని ప్రధాన డిమాండ్లను ఉంచారు:

• పరీక్ష రద్దు: ఏప్రిల్ 19న జరిగిన 14వ జేపీఎస్సీ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేయాలి.

• సిబిఐ, ఈడీ విచారణ: గడిచిన 7 ఏళ్లలో జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ నిర్వహించిన అన్ని నియామక పరీక్షల అవకతవకలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

• టీడీపీఎల్ ఏజెన్సీపై చర్యలు: బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీఎల్ ఏజెన్సీ ద్వారా జరిగిన పరీక్షలను సమీక్షించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

• ఓఎంఆర్ షీట్ సంస్కరణలు: అక్రమాలను నిరోధించేందుకు ఓఎంఆర్ షీట్లలో ఐదో ఆప్షన్‌గా "Not Attempted" అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టాలి.

• సీఎం రాజీనామా: అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ కుమార్ బౌరితో పాటు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

45
జంతర్ మంతర్ తరహాలో దేశవ్యాప్త సపోర్టు

జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జులై 29 నుంచి ప్రారంభమైన ఈ నిరసన కాస్తా రాంచీ వ్యాప్తంగా వ్యాపించింది. ఝార్ఖండ్‌లోని అన్ని 24 జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రాంచీకి తరలివస్తున్నారు. వీరికి పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఆన్‌లైన్ ద్వారా విరాళాలు, తిండి, బెడ్‌షీట్లు, దిండ్లు పంపుతున్నారు. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలను ఈ సీన్ గుర్తు చేస్తోంది.

ఆదివారం రాత్రి విద్యార్థులు రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు భారీ "మషాల్ మార్చ్ (దివిటీల ఊరేగింపు) నిర్వహించారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఝార్ఖండ్ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులకు 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఎక్స్ లో పూర్తి సపోర్టు ప్రకటించారు.

55
రాత్రింబవళ్లు వర్షంలోనే పోరాటం.. ఆవేదనలో విద్యార్థులు

రాంచీ పోలీస్ యంత్రాంగం నిరసన ప్రాంగణంలో టెంట్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంలో సైతం తడుస్తూ రోడ్లపైనే రాత్రంతా జాగారం చేస్తున్నారు. "మాది చాలా పేద రైతు కుటుంబం. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుంటే, ఓఎంఆర్ షీట్లు లీక్ అయిపోతున్నాయి. ప్రతిభ ఉన్నోడికి కాకుండా పైసలు ఉన్నోడికి ఉద్యోగాలు వస్తున్నాయి" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఓఎంఆర్ షీట్ వైరల్ అయిన తర్వాతే జేపీఎస్సీ చైర్మన్ ఎల్.ఖియాంగ్తే రాజీనామా చేశారని, కేవలం నామమాత్రపు సీఐడీ విచారణతో సరిపెడితే మళ్లీ ఇవే అక్రమాలు రిపీట్ అవుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories