
రెండు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఎవరిని బిహార్ బాద్షాగా చూపుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.
బీహార్ అసెంబ్లీకి మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో నవంబర్ 6న 18 జిల్లాల్లో 121 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ విడతలో 64.46 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత నవంబర్ 11న 20 జిల్లాల్లో 122 స్థానాలకు జరగగా మధ్యాహ్నం 3 గంటల వరకే 60.40 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం నాటికి ఈ శాతం 67.14కి చేరిందని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈసారి కిషన్గంజ్ జిల్లా అత్యధికంగా 76.26% పోలింగ్ నమోదు కాగా, కతిహార్లో 75.23%, పూర్ణియాలో 73.79%, సుపౌల్లో 70.69%, పూర్వి చంపారన్లో 69.02% పోలింగ్ నమోదైంది. నవాడా జిల్లాలో మాత్రం అత్యల్పంగా 53.17% పోలింగ్ నమోదైంది.
అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ విభాగం), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్), సీపీఐ, సీపీఎం, వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీలు ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తన జన సురాజ్ పార్టీతో బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెండో విడత ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 2020 ఎన్నికల్లో తేలికపాటి మెజారిటీతో ఎన్డీఏ గెలుపొందగా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని పలు సంస్థల సర్వేలు సూచిస్తున్నాయి.
మరోసారి బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొంటున్నాయి.