
Free Bus Scheme For Mens : ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. అంటే ఈ రాష్ట్రాల మహిళలు ఫ్రీగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారన్నమాట.. ఇదే అవకాశం ఇక పురుషులకు కూడా వచ్చేలా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్చంలో ప్రతిపక్ష అన్నాడిఎంకే పార్టీ ఈ మేరకు హామీ ఇచ్చింది.
తాజాగా అన్నాడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తొలిదశ హామీలను ప్రకటించారు. పురుషులకు ఉచిత బస్సు పథకంతో పాటు మహిళలకు నెలనెెలా 2000 రూపాయలు వంటి ఆసక్తికరమైన హామీలు అందులో ఉన్నాయి.
తమిళనాడులో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… ఈసారి పోరు రసవత్తరంగా ఉంది. ప్రతిసారి తమిళనాడు రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది… కానీ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎప్పటిలాగే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో కొత్తగా ప్రముఖ సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(TVK) పోటీలో ఉంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ సినీనటుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన మాదిరిగానే విజయ్ పార్టీ సత్తా చాటే అవకాశాలున్నాయని… కానీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో AIADMK ఎన్నికల హామీలను ప్రకటించింది… దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అన్నాడిఎంకే ప్రకటించిన ఐదు హామీలివే..
ఇప్పటికే తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది. అయితే తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా సిటీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నాడిఎంకే హామీ ఇచ్చింది. పట్టణాల్లో ఉండే ఉద్యోగులు, కార్మికులను ఆకట్టుకునేందుకు ఈ హామీని ప్రకటించారు.
2. మహిళలకు నెలనెలా రూ.2000 :
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తూనే ఆర్థికంగా అండగా ఉండేందుకు మరో పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నాడిఎంకే హామీ ఇచ్చింది. మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2000 వేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు రూ.2,000 సహాయం అందిస్తారు…. ఈ మొత్తం కుటుంబ యజమానురాలి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
3. 100 రోజుల పని 150 రోజులకు పెంపు :
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం 100 రోజులు పని కల్పిస్తున్నారు. అయితే అన్నాడిఎంకే అధికారంలోకి వస్తే పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఆకట్టుకునేందుకు ఈ హామీ ఇచ్చారు.
4. అమ్మ ద్విచక్ర వాహన పథకం
రూ.25,000 సబ్సిడీతో 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనాలు అందిస్తామని అన్నాడిఎంకే మరో హామీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా చదువుకునే, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలకు లాభం జరగనుంది.
5. అందరికీ ఇల్లు
అమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇల్లు లేని వారికి ప్రభుత్వం కాంక్రీట్ ఇళ్లు కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇంటి స్థలం లేనివారికి ప్రభుత్వ స్థలంలోనే ఇల్లు కట్టించి ఇస్తామని అన్నాడిఎంకే పార్టీ హామీ ఇచ్చింది.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మహిళలను టార్గెట్ గా చేసుకుని హామీలు ఇవ్వడం చూస్తూ వస్తున్నాం. కానీ తమిళనాడులో మాత్రం పురుష ఓటర్లను టార్గెట్ గా చేసుకుని మొదటిసారి ఎన్నికల హామీని ప్రకటించింది అన్నాడిఎంకే. ఈ పార్టీ మొదలుపెట్టింది కాబట్టి ఇతర పార్టీలు కూడా ఇలా పురుషుల ఓట్ల కోసం ప్రత్యేక హామీలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో (తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుతోంది. ఇదే తరహాలో పురుషులకు కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారా..? తమిళనాడు పరిస్థితిని చూస్తుంటే అలాంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ పురుషులకు ఉచిత బస్సు హామీ ఇతర దక్షిణాది రాష్ట్రాలకు పాకే అవకాశం ఉంది.