బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అందుకే అక్రమ రవాణా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు ఎవరూ ఊహించని మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ ప్రయాణికుడు ఏకంగా తన నోట్లో బంగారాన్ని దాచుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆగస్టు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆ ప్రయాణికుడు అక్కడి నుంచి ఘాజియాబాద్ వెళ్లాల్సి ఉంది.
బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్-1లో విమానం ఎక్కేందుకు ముందు భద్రతా తనిఖీలు జరుగుతున్న సమయంలో CISF సిబ్బంది అతడిని గమనించారు. తనిఖీల సమయంలో అతడు సరిగా స్పందించకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఏం అడిగినా సమాధానం చెప్పకోపోవడంతో అతడి నోరును తెరిపించారు. అతడి నోట్లో రెండు క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని బయటకు తీయగా అందులో పసుపు రంగులో ఉన్న లోహం కనిపించింది. రెండు క్యాప్సూల్స్ బరువు కలిపి సుమారు 82 గ్రాములు ఉన్నట్లు తేలిసింది. బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి క్యాప్సూల్స్ లో వేసి తీసుకొచ్చేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.