
ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తోన్న శ్రీవిష్ణు ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో వచ్చారు. ఆయన ప్రస్తుతం `మృత్యుంజయ్` అనే చిత్రంలో నటించారు. రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(మార్చి 6న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణుకి మరో హిట్ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
జై(శ్రీవిష్ణు) ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంటాడు. చనిపోయిన వారే టార్గెట్గా ఆయన యాడ్స్ తెస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. క్రైమ్ రిపోర్టర్గా చేయాలనేది అతని ఆశయం. కానీ ఎడిటర్ అందుకు ఒప్పుకోరు. కానీ తన జాబ్లో కష్టపడుతూనే ఉంటాడు. చనిపోయిన వారి యాడ్స్ తెచ్చే క్రమంలో వారం గ్యాప్లో ఒకేలా ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. అందులో చిన్నారి అంజలి(ఊహా రెడ్డి) తండ్రి కూడా ఉంటాడు. ఆ చిన్నారిని చూసినప్పుడు చిన్నప్పటి తన జీవితంలో జరిగిందే గుర్తుకు వస్తుంది. తన పేరెంట్స్ ఎలా చనిపోయారో తనకు తెలియదు. ఇప్పుడు అంజలి విషయంలో అదే జరుగుతుంది. ఆ పాప ఏడవదు. ఏడవకపోతే అది భారంగా మారి, భవిష్యత్లో ఇబ్బంది అవుతుందని, ఆ కేసుని తాను సాల్వ్ చేయాలనుకుంటాడు జై. పోలీసు అధికారి సీత(రెబా మోనికా జాన్) ఈ కేసుని విచారించినా ఆధారాలు దొరక్కపోవడంతో వదిలేస్తుంది. ఇదొక యాక్సిడెంట్గానే పరిగణిస్తుంది. కానీ ఒకేలా రెండు మరణాలు చోటు చేసుకోవడంతో జైకి అనుమానం వస్తుంది. దీంతో తానే స్వతహాగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు? మరి ఈ క్రమంలో తాను తెలుసుకున్న నిజాలేంటి? అంజలి తండ్రి మరణానికి కారణం ఎవరు? జై విచారణలో తెలుసుకున్న సంచలన నిజాలేంటి? అనేది మిగిలిన కథ.
డెత్ మిస్టరీకి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది. శ్రీవిష్ణు ఇటీవల కాలంలో వరుసగా వినోదాత్మక చిత్రాలు చేశారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ని కూడా వేసుకున్నాడు. కానీ ఇప్పుడు తన రూట్ మార్చి సీరియస్ కంటెంట్తో `మృత్యుంజయ్` చిత్రాన్ని చేశారు. కంటెంట్ని నమ్ముకొని చేసిన ప్రయత్నమిది. శ్రీవిష్ణు సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ ఉంది. దాన్ని మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నారు. ఇది ఆద్యంతం ఎంగేజింగ్గా సాగుతుంది. ప్రారంభంలో సరదాగా రన్ అవుతుంది. శ్రీవిష్ణు మాయ మాటలు చెప్పి, గెటప్పులు మార్చి మరణించిన వారి వద్ద నుంచి యాడ్స్ తేవడం క్రేజీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఆ తర్వాత అంజలి అనే చిన్నారి తండ్రి మరణంతో సీరియస్గా టర్న్ తీసుకుంటుంది. ఈ కేసులోకి పోలీసులు రావడం, హీరో ఇన్వాల్వ్ కావడం, ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయడం వేగంగా సాగిపోతుంది. అయితే విచారణకు సంబంధించిన సన్నివేశాలు కాస్త స్లోగా సాగుతాయి. ఏదో మిస్టరీ రన్ అవ్వడం, హీరో హంతకుడి కోసం వెతకడం ఫస్టాఫ్ వరకు సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో కథ మరింత సీరియస్గా, సస్పెన్స్ థ్రిల్లర్ సైడ్ టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్ అంతా ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు ఆసక్తికరంగా సాగుతుంది. అదే సమయంలో హంతకుడు ఎవరికీ దొరక్కుండా తిరగడం, హీరోని చంపేయాలని టార్గెట్ చేయడం, వరుసగా మిస్ కావడం ఉత్కంఠకి గురి చేస్తాయి. ఓ దశలో ఈ మూవీ `జులాయి`ని తలపిస్తుంది. నేరస్థుడిగా హీరో ఆలోచించడం, హీరోలా నేరస్థుడు ఆలోచించడం ఇది సైకలాజికల్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. అదే సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందనే ఉత్కంఠని క్రియేట్ చేస్తుంది. హీరో, విలన్ ఎత్తులకు పైఎత్తులు ఆద్యంతం కట్టిపడేస్తాయి. ఇక క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది. పోలీసుల వల్ల కానిది, హీరో కేసుని సాల్వ్ చేసే తీరు వాహ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది.
అయితే సినిమా ఫస్టాఫ్లో కొంత స్లోగా ఉంటుంది. అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. ఊహించినట్టుగానే ఉంటాయి. సెకండాఫ్ ఆద్యంతం ఎంగేజింగ్గా రన్ అవుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా మారిపోతుంది. నేరస్థుడు ఎవరనేది కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు కట్టిపడేస్తాయి. అయితే కొన్ని సీన్లు లాజిక్లకు అందని విధంగా ఉంటాయి. మరికొన్ని సీన్లు క్రియేటివ్ బ్రిలియన్స్ ని చూపిస్తాయి. కానీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక పాయింట్ చుట్టూ కథనాన్ని తిప్పడం, సీరియస్గా కథని రన్ చేస్తూనే ఎంగేజ్ చేసిన తీరు, ట్విస్ట్ లు ఇస్తూ, సినిమాని నడిపించిన తీరు బాగుంది. దీనికితోడు శ్రీవిష్ణు నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా యాడ్ అయ్యాయి. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఓవరాల్గా ఆద్యంతం ఎంగేజ్ చేసే ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ మూవీ నిలుస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అవుతుంది. కాకపోతే శ్రీవిష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్ని మాత్రం మిస్ అవుతారని చెప్పొచ్చు.
జై పాత్రలో శ్రీవిష్ణు చాలా బాగా నటించాడు. ఇన్నాళ్లు కామెడీ చేసిన ఆయన ఇందులో సెటిల్డ్ గా చేశాడు. ఆకట్టుకున్నాడు. తనలోని మరో వేరియేషన్ చూపించాడు. మెప్పించాడు. నటుడిగా ఆయన్ని మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుంది. పోలీస్ ఆఫీసర్గా రెబా మోనికా జాన్ ఇందులో గ్లామరస్గా కాకుండా సీరియస్ రోల్లో నటించింది. చాలా బాగా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీన్ లో మాత్రం అదరగొట్టింది. జై ఫ్రెండ్గా సుదర్శన్ బాగా మెప్పించాడు. రచ్చ రవి కూడా ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సైతం మెప్పించాడు. అయ్యప్ప శర్మ పాత్రలో కొత్తదనం కనిపిస్తుంది. చిన్నారి అంజలిగా ఊహారెడ్డి అదరగొట్టింది. ఈ అమ్మాయి చుట్టూనే కథ తిరుగుతుంది.
సినిమాకి కాలభైరవ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. థ్రిల్లర్ ఎలిమెంట్లని హైలైట్ చేసేలా, యాక్షన్ సినిమాలను తలపించేలా బీజీఎం ఉండటం విశేషం. విద్యాసాగర్ చింతా విజువల్స్ బాగున్నాయి. కొత్తగా అనిపిస్తాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా నీట్గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. హుస్సేన్ షా కిరణ్ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా అంతే బాగుంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ని ఆయన అంతే బాగా, టైటిల్ స్క్రీన్ప్లేతో రాసుకున్నారు. ఫస్టాఫ్లో సాగదీసినా, సెకండాఫ్ని గ్రిప్పింగ్గా రన్ చేశారు. విభిన్నమైన మలుపులతో నడిపించిన తీరు బాగుంది. కథ నుంచి ఎక్కడా డైవర్ట్ కాకుండా నడిపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.
ఆద్యంతం ఎంగేజ్ చేసే సీట్ ఎడ్జ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్. శ్రీవిష్ణులోని మరో కోణాన్ని ఆవిష్కరించిన మూవీ.