Nepal Floods: నేపాల్ త్రిశూలి నది వరదల్లో అంతా కొట్టుకుపోయింది. వందల మంది చనిపోయారు. కానీ 40 ఏళ్ల నాటి గ్రీన్ హౌస్ సురక్షితంగా నిలిచింది. 6 మంది ప్రాణాలు కాపాడిన ఈ ఇల్లు ఎలా వరదలను తట్టుకోగలిగింది?
రాళ్లు, రాక్షస వరద వచ్చినా చెక్కుచెదరని ఇల్లు! సీక్రెట్ బయటపెట్టిన యజమాని
ఆగస్టు 26న నేపాల్లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి.
అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
24
పెరిగిన వరద ఉధృతి
వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి.
ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.
34
40 ఏళ్ల నాటి నాణ్యత, పునాది బలం
ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అని ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఇల్లు సురక్షితంగా నిలవడం ఒక అద్భుతమని ఆయన చెప్పారు. ఇల్లు ఎలా నిలబడింది అనే ప్రశ్నకు ప్రకాష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"ఇది దాదాపు 40 సంవత్సరాల నాటి పాత ఇల్లు. ఆ సమయంలో వాడిన సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి నాణ్యత చాలా బాగుండేది. ఈ భవనం నదికి చాలా దగ్గరగా ఉండటం వల్ల, నిర్మాణం సమయంలో పునాదిని చాలా జాగ్రత్తగా, బలంగా నిర్మించారు" అని ప్రకాష్ తెలిపారు. ఇంజనీరింగ్ పరమైన విశ్లేషణలు అధికారికంగా రాకపోయినా, ఇంటి నిర్మాణం, పునాది బలం, వరద ప్రవాహానికి అనుకూలంగా ఉన్న డిజైన్ దీనికి కారణమని భావిస్తున్నారు.
నువాకోట్ నుండి రసువా వెళ్లే రహదారిపై ఉన్న ఈ ఇల్లు చుట్టుపక్కల విధ్వంసం మధ్య ఏకైక ఆధారంగా నిలిచింది. ఇల్లు దెబ్బతిన్నా, ఆస్తి నష్టం తీవ్రంగా ఉన్నా ప్రకాష్ కుటుంబం అధైర్యపడలేదు. ఎంతటి నష్టం వచ్చినా మళ్లీ అదే స్థలం నుంచి తమ జీవితాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకాష్ ధైర్యంగా చెప్పారు. "అవును, మేము మళ్లీ అక్కడి నుంచే కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.