Nepal Floods : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉప్పొంగిన ఆకస్మిక వరదలు అత్యంత విషాదాన్ని మిగిల్చాయి. విపత్తు దాటికి వేలాది మంది కొట్టుకుపోగా, బాధితుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో కలచివేసే ఘటనాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
వంట చేస్తూ వరదలో కొట్టుకుపోయిన నాన్న.. 11 ఏళ్ల బాలుడి కన్నీటి వెతుకులాట
నేపాల్లో సంభవించిన భయంకరమైన జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో బీహార్లోని మోతిహారీకి చెందిన 11 ఏళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. శనివారం రోజు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఖడ్డా ప్రాంతానికి చేరుకున్న ఈ చిన్నారి, నేపాల్లో జరిగిన ఆ భయంకర సంఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నాడు. తండ్రి జాడ కోసం గండక్ నది తీరంలో వెతుకుతున్న ఆ బాలుడి ఆవేదన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించింది.
25
బడికి వెళ్లే టైమ్లో వచ్చిపడ్డ ప్రళయం
ఆ బాలుడు తెలిపిన వివరాల ప్రకారం, అతని తండ్రి నేపాల్లోని రసువా జిల్లాలో స్క్రాప్ షాప్ నడుపుతుండేవాడు. ఆ రోజు ఉదయం బాలుడు స్కూల్కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. తండ్రి వంట చేస్తున్నాడు. ఇంతలోనే ఊహించని విధంగా ఒక్కసారిగా పైనుంచి ఉధృతంగా వరద నీరు దూసుకొచ్చింది. ఆ నీటి ప్రవాహంలో తండ్రి కొట్టుకుపోయారు. బాలుడు తన ముగ్గురు సోదరులతో కలిసి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకుని బీహార్లోని తమ స్వగ్రామానికి చేరుకున్నాడు.
35
గండక్ నది ఒడ్డున కొడుకు ఆవేదన
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే తండ్రి కోసం వెతకడం ప్రారంభించారు. బీహార్లోని నదీ తీర ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో, తన బాబాయ్తో కలిసి శనివారం కుషీనగర్లోని ఛితౌని బంధ్, మదన్పూర్ సుక్రౌలీ, భైన్సా ప్రాంతాలకు చేరుకున్నాడు. గండక్ నది ఒడ్డున తన తండ్రి ఆచూకీ దొరుకుతుందనే ఆశతో ఆ చిన్నారి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు.
నేపాల్ వరదల ప్రభావంతో గండక్ నదిలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో కుషీనగర్లోని ఖడ్డా ప్రాంతంలో వరద, నదీ తీర కోత ప్రమాదం ఎక్కువైంది. నది ప్రవాహం ఛితౌని ఆకట్ట వద్ద ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు, నేపాల్ నుంచి కొట్టుకువచ్చిన 6 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రిలోని డిప్ ఫ్రీజర్లో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తించడానికి నేపాల్ సరిహద్దు జిల్లాల అధికారులతో ఎడిఎమ్ వైభవ్ మిశ్రా సమన్వయం చేసుకుంటున్నారు. గుర్తింపు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.
55
నేపాల్లో మళ్లీ రెడ్ అలర్ట్: 3000 మంది గల్లంతు
నేపాల్లో వరద ముప్పు మళ్లీ పెరిగింది. భోటేకోషి నదిలో నీటి ఉధృతి పెరగడంతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 26న వచ్చిన వరదల్లో ఇప్పటివరకు 691 మంది మృతి చెందగా, 3000 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 275 మంది భారతీయులు ఉన్నారు. భారత్ ఇప్పటివరకు 108 మందిని సురక్షితంగా రక్షించింది. చైనా నుంచి 598 మంది భారతీయులు నేపాల్ చేరుకోగా, మరో 900 మంది చైనాలో సురక్షితంగా ఉన్నారు.