Published : Mar 01, 2026, 06:49 AM ISTUpdated : Mar 01, 2026, 07:49 AM IST
Iran Israel War: అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పరిస్థితిపై విభిన్న సమాచారం వెలువడుతోంది. కొందరు నేతలు ఆయన మృతి చెందినట్లు చెబుతుండగా, ఇరాన్ మాత్రం ఆయన సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది.
టెహ్రాన్లోని ఖమేనీ అధికారిక నివాస సముదాయం లక్ష్యంగా తెల్లవారుజామున భారీ వైమానిక దాడులు జరిగాయి. భూగర్భ బంకర్లతో కూడిన ఆ ప్రాంగణం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడి సమయంలో సుమారు 30 బాంబులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. శాటిలైట్ చిత్రాలు కూడా ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగినట్లు సూచిస్తున్నాయి. ఖమేనీ దాడి సమయంలో భూగర్భ సురక్షిత కేంద్రంలో ఉన్నారని, అయితే ఆయన వేరే ప్రాంతానికి తరలించి ఉండవచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.
25
ఖమేనీ మరణించినట్లు ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలో ఖమేనీ మరణించారని ఆయన ప్రకటించారు. ఖమేనీ చరిత్రలో అత్యంత క్రూర నాయకుల్లో ఒకరని పేర్కొన్న ట్రంప్, ఇరాన్ ప్రజలకు ఇది కీలక మలుపు కావచ్చన్నారు. దేశాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి తీసుకునే అవకాశమిదేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఇరాన్పై వైమానిక దాడులు ఇంకా కొనసాగవచ్చని హెచ్చరించారు.
35
ఖమేనీపై దాడి జరిగిందని ఇజ్రాయెల్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఖమేనీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అందిన సంకేతాల ప్రకారం ఆయన బతికి ఉండకపోవచ్చని తెలిపారు. ఖమేనీ నివాస ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని వెల్లడించారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకొని బంకర్లపై దాడులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు ఇరాన్ అధికార వర్గాలు ఖమేనీ మృతి వార్తలను ఖండిస్తున్నాయి. దేశ రక్షణ వ్యవస్థను ఆయన పర్యవేక్షిస్తున్నారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ విదేశాంగ వర్గాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. ఖమేనీ సురక్షితంగా ఉన్నారని కొందరు అధికారులు పేర్కొనగా, అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం దేశ భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. అయితే కాసేపటికే ఖమేనీ మరణించినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
55
ఇరాన్ మీడియా సైతం..
1989 నుంచి ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతున్న ఖమేనీ సుదీర్ఘ కాలం దేశ రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేశారు. ఇటీవల ఆర్థిక సమస్యలు, నిరసనలు, ప్రాంతీయ ఘర్షణల కారణంగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలపై క్షిపణి దాడులు జరగడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
కాగా ఖమేనీ మరణించారన్న విషయాన్ని ఇరాన్ మీడియా సైతం ధృవీకరించింది. తొలుత దీనిని ఇరాన్ ఖండించినా.. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ మీడియా కన్ఫార్మ్ చేసింది.