Weather hyderabad: సోమవారం హైదరాబాద్లో వరణుడు ఎలాంటి బీభత్సం సృష్టించాడో తెలిసిందే. భారీ వర్షానికి మహా నగరం తడిసి ముద్ద అయ్యింది. అయితే మంగళవారం (ఈరోజు) కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంపై కురిసిన కుండపోత వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు రెండు గంటలపాటు నిరంతరంగా కురిసింది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లో 15.15 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ వరద నీటితో మునిగిపోయి నాలాల్లా మారిపోయాయి. వాహనాలు వరదలో చిక్కుకొని రాత్రి 8 గంటలవరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
DID YOU KNOW ?
రెండున్నర గంటల్లోనే
హైదరాబాద్లో సోమవారం కేవలం రెండున్నర గంటల్లో 15సెం.మీ వర్షం కురిసింది. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
25
మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ప్రకారం నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
35
తెలంగాణవ్యాప్తంగా ఎల్లో అలర్ట్
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని, వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
55
ఉపరితల ఆవర్తనం ప్రభావం – వచ్చే రెండు రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగుతుందని, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితి నెలకొనే అవకాశం ఉండటంతో అధికారులు పౌరులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.