
మహిళలు తమ ఫిగర్, అందం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ శరీరాకృతిని కాపాడుకోవడానికి ఎంతో మంది రెగ్యులర్ గా యోగా నుంచి అధిక తీవ్రత వ్యాయామం వరకు ప్రతీదీ చేస్తుంటారు. అయినప్పటికీ.. రొమ్ముల పరిమాణం చిన్నగా ఉన్న ఆడవారు చాలా మందే ఉన్నారు. 8 నుంచి 13 సంవత్సరాల వయస్సు నుంచి రొమ్ములు పెరగడం మొదలవుతుంది. ఈ పెరుగుదలలో అవాంతరాల వల్ల రెండు రొమ్ముల పరిమాణం ఒకే విధంగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. శారీరక ఎదుగుదల సమయంలో సరైన ఆహారం లేదా సరైన వాతావరణం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్యను ఫేస్ చేయొచ్చు.
రెండు వక్షోజాలలో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?
ఇది అనారోగ్య సమస్య అసలే కాదని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరీక్షల్లో రొమ్ములో గడ్డ లేకపోవడం, వాపు, నొప్పి వంటి సమస్యలు లేకపోతే మీకు ఎలాంటి శారీరక సమస్య లేనట్టు. నిజానికి పెరుగుతున్న వయస్సులో ఒక రొమ్ము మరొకదాని కంటే వేగంగా అభివృద్ధి చెందినప్పుడు రెండింటి పరిమాణంలో కొద్దిగా తేడా ఉంటుంది. ఈ తేడాలు పూర్తిగా సాధారణమైనవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు తల్లిపాలు ఇచ్చినప్పుడు.. పిల్లలు ఒకే రొమ్ము నుంచి ఎక్కువగా పాలు తాగుతారు. దీనివల్ల కూడా రెండు వక్షోజాల మధ్య తేడా ఉంటుంది. ఇది సమస్య కాదు. ఒక సహజమైన ప్రక్రియ. రెండు వక్షోజాల పరిమాణంలో తేడాకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హార్మోన్ల మార్పులు
యుక్త వయస్సులో శరీరంలో హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ మార్పులు రొమ్ముల పరిమాణంలో తేడాకు కారణమవుతాయి. నిజానికి చాలాసార్లు ఒక రొమ్ము మరొకదాని కంటే ముందు పెరగడం స్టార్ట్ అయినప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు మెనోపాజ్, ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల రొమ్ము పరిమాణంలో ఈ మార్పు ఉంటుంది. గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి.
తల్లి పాలివ్వడం
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి రొమ్ముల్లోకి పాలు రావడం మొదలవుతుంది. అయితే పిల్లలు ఒకే రొమ్ము నుంచి పాలను ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల కూడా రెండు వక్షోజాల పరిమాణంలో తేడా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ రెండు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండాలంటే పిల్లలకు రెండు వైపుల నుంచి సమానంగా పాలివ్వాలి.
రొమ్ముపై గడ్డ లేదా క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ వల్ల రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి. దీనివల్ల కూడా రెండు రొమ్ముల పరిమాణంలో తేడా ఉంటుంది. అయితే రొమ్ముల్లో గడ్డలు క్యాన్సర్ వల్లే వస్తుందని కాదు. ఫైబ్రోసిస్టిక్ రొమ్ము కారణంగా తిత్తి కూడా కనిపిస్తుంది. అయితే దీనివల్ల రొమ్ముకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
రుతుచక్రం
పీరియడ్స్ సమయంలో రొమ్ము కణజాలంలో ఎన్నో మార్పులు వస్తాయి. పీరియడ్స్ వల్ల రొమ్ములలో నీరు నిలుస్తుంది. అలాగే రక్త ప్రవాహం మధ్య వ్యత్యాసం ఉంటుంది. వీటివల్ల ఈ సమయంలో రొమ్ము పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అండోత్సర్గము సమయంలో వక్షోజాలు బరువుగా కనిపించినప్పటికీ.. రుతుస్రావం సమయంలో వాటి పరిమాణం మునుపటి కంటే తక్కువగా కనిపిస్తుంది.