Coronavirus: ఆస్తమా రోగులపై కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

First Published Nov 24, 2021, 10:02 AM IST

ఇతరులతో పోలిస్తే.. ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని  నిపుణులు తెలిపారు. మరణించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు.
 

చలికాలం వచ్చిందంటే చాలు.. ఆస్తమా రోగులు భయపడిపోతుంటారు. చలికాలంలో.. ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు.. ఈ కరోనా మహమ్మారిని తలుచుకొని మరింత భయపడుతున్నారు. అసలే ఆస్తమా. ఆపై కరోనా మహమ్మారి సోకితే.. ఇంకేమైనా ఉందా అని భయపడుతున్నారు. అయితే..  అలాంటి భయం పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

 ఈ మేరకు స్విన్ బర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. వారి పరిశోధనలో తేలిన దాని ప్రకారం.. ఇతరులతో పోలిస్తే.. ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని  నిపుణులు తెలిపారు. మరణించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు.
 

ఆస్తమా సమస్యల నియంత్రణకు బాధితులు కార్డికో-స్టిరాయిడ్లు వాడుతుంటారు. ఊపిరితిత్తుల్లో అంతర్గత సమస్యలను ఇవి నివారిస్తాయి. ఆస్తమాలేని కోవిడ్ బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్ ను వైద్యులు సూచిస్తున్నారు.
 

ఇది కూడా కార్డికో స్టిరాయిడ్ మాదిరే పని చేయడం విశేషం. ఆస్తమా బాధితులు వాడే మందుల కారణంగానే కోవిడ్ ముప్పు వారికి దూరంగా ఉంటున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఆస్తమా బాధితుల్లోని రోగనిరోధక శక్తి, మహమ్మారిని ఎదుర్కొంనేందుకు సహాయపడుతుందన్నారు. శరీర కణాల్లోనికి కరోనా వైరస్ చేరేందుకు దారితీసే ఏసీఈ2 జన్యువు కూడా వీరిలో చైతన్య రహితంగా ఉంటోంది.
 

దీంతో.. వీరికి వైరస్ సోకడం , ఇన్ఫెక్షన్ గా మారడం తక్కువేనని పరిశోధన కర్త బ్రూస్ థాంప్సన్ వివరించారు. ధూళి, దుమ్ము, పొగ, కాలుష్యం, రసాయనాల ప్రభావం కారణంగా ఆస్తమా బాధితులు ఇబ్బందులు పడుతుంటారు. కోవిడ్ కారణంగా లాక్ డౌన్లు విధించడం, చాలా మంది ఇళ్లకే పరిమితం కావడం వంటి చర్యల కారణంగా ఆస్తమా బాధితుల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తదించారు. 

click me!