Jio PC: మీ పాత కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తోందా.? స్టోరేజ్ సరిపోవడం లేదా? కొత్త సాఫ్ట్వేర్లు రన్ కావడం లేదా? అయితే కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండానే పాత కంప్యూటర్ను ఆధునికంగా మార్చే సరికొత్త సేవను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది
గతంలో జియోహోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే జియోపీసీ సేవలు అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సేవను అన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో సిమ్ లేదా జియో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ కంప్యూటర్ లేదా డెస్క్టాప్ నుంచైనా జియోపీసీని ఉపయోగించుకోవచ్చు. ఇతర టెలికాం లేదా బ్రాడ్బ్యాండ్ సంస్థల ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా ఈ సేవను పొందవచ్చు.
25
పాత కంప్యూటర్కు 16GB RAM, 1TB స్టోరేజ్ పవర్
జియోపీసీ ప్రత్యేకత ఏమిటంటే.. కొత్త హార్డ్వేర్ కొనుగోలు చేయకుండానే క్లౌడ్ ద్వారా అధిక కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడం. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ పొందవచ్చు. ముఖ్యంగా 3 నుంచి 4 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన కంప్యూటర్లు కాలక్రమేణా స్లో అవుతుంటాయి. స్టోరేజ్ నిండిపోవడం, పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి కంప్యూటర్లను మార్చకుండా జియోపీసీ ద్వారా ఆధునిక కంప్యూటింగ్ అనుభవాన్ని పొందవచ్చు. కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయడం లేదా ఖరీదైన హార్డ్వేర్ అప్గ్రేడ్లు చేయడం కంటే ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా జియో చెబుతోంది.
35
కేవలం 5 నిమిషాల్లో యాక్టివేట్ చేసుకోవచ్చు
జియోపీసీ సేవను ప్రారంభించడానికి పెద్దగా టెక్నికల్ పరిజ్ఞానం అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనిలో ప్రధానంగా యూజర్లకు.. కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేదు, కొత్త హార్డ్వేర్ అమర్చాల్సిన పని ఉండదు, డేటాను ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు మార్చే ఇబ్బంది ఉండదు, కంప్యూటర్ను ఎక్కువసేపు ఆఫ్ చేసి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, సుమారు 5 నిమిషాల్లో సేవను ప్రారంభించుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ను అలాగే ఉపయోగిస్తూ క్లౌడ్ పవర్ను పొందవచ్చు.
పాత కంప్యూటర్లకూ ఏఐ పవర్.. విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనం
ప్రస్తుతం విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే అధిక సామర్థ్యం ఉన్న కంప్యూటర్లు అవసరమవుతాయి. జియోపీసీలో ఎక్కువ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ క్లౌడ్లో జరుగుతుంది. దీంతో తక్కువ సామర్థ్యం ఉన్న పాత కంప్యూటర్లు కూడా ఆధునిక ఏఐ అప్లికేషన్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. జియో తెలిపిన వివరాల ప్రకారం.. 8 సంవత్సరాల పాత కంప్యూటర్ కూడా జియోపీసీ ద్వారా ఆధునిక ఏఐ యుగానికి సిద్ధం కావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు పాత లేదా తక్కువ సామర్థ్యం ఉన్న కంప్యూటర్ల కారణంగా కొత్త టెక్నాలజీకి దూరం కాకుండా ఉండేందుకు ఈ సేవ ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థులతో పాటు ఇంటి వినియోగదారులు, ఉద్యోగులు, చిన్న వ్యాపార సంస్థలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
55
జియోపీసీ ప్లాన్లు, ధరలు ఇవే
జియోపీసీ రెండు రకాల ప్లాన్లను అందిస్తోంది. యూజర్లు తమ అవసరాన్ని బట్టి సాధారణ జియోపీసీ లేదా జియోపీసీ అల్ట్రా ప్లాన్ను ఎంచుకోవచ్చు. జియోపీసీ ప్లాన్ 8GB RAM, 500GB స్టోరేజ్. జియోపీసీ అల్ట్రా ప్లాన్ విషయానికొస్తే 16GB RAM, 1TB స్టోరేజ్తో తీసుకొచ్చారు. ధరల విషయానికి వస్తే.. రెండు నెలల వ్యాలిడిటీకి జియో పీసీ రూ. 1000, జియోపీసీ అల్ట్రా రూ. 1200, ఏడాది వ్యాలిడిటీకి జియోపీసీకి రూ. 2000, జియోపీసీ అల్ట్రాకు రూ. 2500, దీర్ఘకాల ప్లాన్కి అయితే జియో పీసీకి రూ. 4 వేలు, జియోపీసీ అల్ట్రాకు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జియోపీసీ పూర్తిగా క్లౌడ్ ఆధారిత సేవ కావడంతో మంచి, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. బ్రాడ్బ్యాండ్ లేదా నమ్మకమైన 4G/5G ఇంటర్నెట్ ఉంటే మెరుగైన అనుభవం పొందవచ్చు.