
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మార్కెట్లోకి ఒక అదిరిపోయే డివైజ్ను తీసుకొచ్చింది. సాధారణ మొబైల్ నెట్వర్క్లు అస్సలు పని చేయని చోట్ల కూడా పనిచేసేలా ఒక సరికొత్త శాటిలైట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కొండలు, కోనలు, అడవులు ఇలా ఎక్కడికి వెళ్లినా.. మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా సరే, ఈ ఫోన్ ద్వారా ఈజీగా మాట్లాడొచ్చు.
ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. "సాధారణ మొబైల్ నెట్వర్క్లు అందుబాటులో లేనప్పుడు, బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ మిమ్మల్ని ఎప్పుడూ కనెక్టివిటీలో ఉంచుతుంది" అని సంస్థ పేర్కొంది. అన్ని పన్నులతో కలిపి ఈ శాటిలైట్ ఫోన్ ధరను రూ. 1,34,166 గా నిర్ణయించారు.
మనం వాడే నార్మల్ స్మార్ట్ఫోన్లు మన ఇంటి పక్కనో లేదా ఊర్లోనో ఉండే మొబైల్ టవర్ల సాయంతో పనిచేస్తాయి. కానీ, ఈ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ కథ వేరు. దీనికి మొబైల్ టవర్లతో అస్సలు సంబంధమే లేదు. ఇది నేరుగా భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల ద్వారా సిగ్నల్స్ అందుకుంటుంది.
గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన ఇన్మార్శాట్ భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ సర్వీస్ను డెవలప్ చేసింది. దీనివల్ల వరదలు, భూకంపాలు, తుపానులు వచ్చి మొబైల్ టవర్లు కూలిపోయినా సరే.. ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, అత్యవసర సమయాల్లో ఎస్ఓఎస్ ఫీచర్ ద్వారా సాయం కోరవచ్చు. ఇది చాలా రగ్గడ్ డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో వస్తుంది.
ఈ శాటిలైట్ ఫోన్ ప్రతిరోజూ మనం వాడే నార్మల్ స్మార్ట్ఫోన్ లాంటిది కాదు. నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారి కోసం దీనిని డిజైన్ చేశారు. సరిహద్దుల్లో ఉండే డిఫెన్స్ సిబ్బంది, సముద్రంలో ప్రయాణించే మెరైన్ ఆపరేషన్స్ టీమ్స్, విపత్తు నిర్వహణ బృందాలు, మైనింగ్ సైట్లలో పనిచేసేవారు, మారుమూల ప్రాంతాల్లో ఫీల్డ్ ఆపరేషన్స్ చేసేవారు, అమరనాథ్ లాంటి మారుమూల పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు, అడ్వెంచర్ ట్రావెలర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ శాటిలైట్ ఫోన్ను మనం నార్మల్ మొబైల్ లాగా షాపుకి వెళ్లి నేరుగా కొనేయడానికి వీల్లేదు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశంలో శాటిలైట్ ఫోన్లపై చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి ముందస్తు లైసెన్స్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా ఈ ఫోన్ను వాడటం చట్టవిరుద్ధం. అనుమతి లేకుండా దీనిని కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి.
ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో దీనిపై జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో ఉగ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లతో మాట్లాడటానికి తురాయా శాటిలైట్ ఫోన్లను వాడారు. ఆ తర్వాతే ఇండియాలో ఈ రూల్స్ మరింత కఠినమయ్యాయి. విదేశీయులు ఎవరైనా ఈ ఫోన్ను ఇండియాకు తెస్తే కస్టమ్స్ వద్ద డిక్లేర్ చేయాలి, లేదంటే జరిమానాతో పాటు అరెస్ట్ కూడా కావచ్చు. అమెరికా, యూకే దేశాలు తమ పౌరులకు ఈ విషయంలో అడ్వైజరీ కూడా జారీ చేశాయి.
ఈ శాటిలైట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది.
పోస్ట్పెయిడ్ ప్లాన్స్:
• గవర్నమెంట్ ప్లాన్ G1: నెలకు రూ. 3,500 (16 నిమిషాలు/ఎస్ఎంఎస్ లు ఉచితం)
• గవర్నమెంట్ ప్లాన్ G2: నెలకు రూ. 5,835 (30 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం)
• కమర్షియల్ ప్లాన్ C1: నెలకు రూ. 11,670 (60 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం)
ప్రీపెయిడ్ ప్లాన్స్:
• ప్రభుత్వ వినియోగదారులకు: నెలవారీ ప్లాన్ G1 రూ. 3,500 (20 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం). వార్షిక ప్లాన్ GA రూ. 38,500 (సంవత్సరానికి 240 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం).
• కమర్షియల్ వినియోగదారులకు: నెలవారీ ప్లాన్ C1 రూ. 5,835 (30 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం). వార్షిక ప్లాన్ CA రూ. 64,185 (సంవత్సరానికి 360 నిమిషాలు/ ఎస్ఎంఎస్ లు ఉచితం).
ప్లాన్లో ఇచ్చిన ఫ్రీ మినిట్స్ లేదా ఎస్ఎంఎస్ లిమిట్ అయిపోయిన తర్వాత చేసే ప్రతి కాల్, మెసేజ్కు అదనంగా ఛార్జ్ పడుతుంది. ప్రభుత్వ కస్టమర్లకు నిమిషానికి లేదా ఎస్ఎంఎస్కు రూ. 18 ఛార్జ్ అవుతుంది. అదే కమర్షియల్ కస్టమర్లకైతే నిమిషానికి లేదా ఎస్ఎంఎస్కు రూ. 25 వసూలు చేస్తారు. ప్రీపెయిడ్ యూజర్లు టాప్ అప్ రీఛార్జ్ చేసుకోవడానికి రూ. 200, రూ. 500, రూ. 1,000, రూ. 5,000, రూ. 10,000 వోచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాల కోసం +91 94651 01323 లేదా 9768866652 నంబర్లకు కాల్ చేయవచ్చు లేదా దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసును సంప్రదించవచ్చు.