
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా చేయాలి. అది కూడా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను. ఇంట్లో పెద్దలే కాదు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు కూడా మార్నింగ్ ఎట్టి పరిస్థితిలో తినకుండా ఉండకూడదని చెప్తుంటారు. ఎందుకంటే మనం ఉదయం తినే ఆహారమే మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తప్పుడు ఆహారాలను తింటుంటారు. ఇవి టేస్టీగా ఉండొచ్చు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేస్తాయి. అందుకే ఉదయాన్నే పరిగడుపున ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీ & కాఫీ
టీ, కాఫీలను ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది ఉదయం లేవగానే పరిగడుపున టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ వీటిని పరిగడుపున ఎట్టి పరిస్థితిలో తాగకూడదు. ఎందుకంటే వీటివల్ల కడుపులో యాసిడ్ సమస్య పెరుగుతుంది. దీంతో కడుపునకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఉదయం పరిగడుపున టీ, కాఫీలను తాగకూడదని డాక్టర్లు చెప్తారు. అంతేకాదు వీటిని తాగితే శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ కూడా పెరుగుతుంది. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.
కోల్డ్ డ్రింక్స్:
చాలా మంది కోల్డ్ డ్రింక్స్ ను చాలా ఇష్టంగా తాగుతుంటారు. కానీ వీటిని ఉదయం పరిగడుపున అస్సలు తాగకూడదు. ఒకవేళ మీకు వీటిని ఉదయాన్నే తాగే అలవాటుంటే వెంటనే మానేయండి.ఎందుకంటే వీటివల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. మీరు బలహీనపడతారు.
స్పైసీ ఫుడ్
ఉదయాన్నే కారంగా ఉండే ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే వీటివల్ల కడుపు నొప్పి వస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అంటే ఎసిడిటీ, అజీర్ణం, వంటి జీర్ణ సమస్యలు బాగా వస్తాయి. ఇంతేకాకుండా పరిగడుపున వేయించి ఆహారాలను కూడా తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు.
పెరుగు:
పెరుగు హెల్తీ పుడ్డే. కానీ పరిగడుపున మాత్రం తినకూడదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్, కాల్షియం మన పళ్లను, ఎముకలను, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ దీన్ని మాత్రం పరిగడుపున తినకూడదు. ఎందుకంటే పెరుగును ఖాళీ కడుపుతో తింటే కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది.
సిట్రస్ పండ్లు:
ఎట్టి పరిస్థితిలో ఉదయాన్నే నిమ్మకాయ, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను మాత్రం తినకండి. ఎందుకంటే వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిగడున తింటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చక్కెర ఆహారాలు:
ఉదయం ఎట్టి పరిస్థితిలో తినకూడని ఆహారాల్లో స్వీట్ ఫుడ్ కూడా ఉంది. చక్కెరతో చేసిన ఆహారాలు టేస్టీగా ఉన్నా.. వీటిని ఉదయం పరిగడుపున తింటే మీరు రోజంతా అలసిపోయినట్టుగా ఉంటారు. నీరసంగా ఉంటారు. అంతేకాకుండా దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే రోజంతా బాగా ఆకలిగా ఉంటుంది.
పచ్చి కూరగాయలు:
ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది ఉదయం పరిగడుపున పచ్చి కూరగాయలను తింటుంటారు. కానీ ఇవి మన జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. అంటే పచ్చి కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి.