పాత కరెన్సీ నోట్లపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నోట్ల రద్దు భయం జనంలో మొదలైంది.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. 2005కు ముందు ప్రింట్ అయిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూలై 1 నుంచి చెల్లవని, వాటిని రద్దు చేశారని ఆ పోస్టు సారాంశం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోగోతో ఈ వార్త షేర్ అవ్వడంతో, చాలామంది ఇది నిజమేనని నమ్మి కంగారు పడ్డారు. ముఖ్యంగా వ్యాపారులు ఎక్కడ ఈ నోట్లు చెల్లవోనని కస్టమర్ల నుండి తీసుకోడానికి జంకుతున్నారు.. దీంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది.
25
పాతనోట్ల రద్దుపై పిఐబి క్లారిటీ
సోషల్ మీడియాలో జరుగుతున్న పాతనోట్ల రద్దు ప్రచారంలో ప్రభుత్వరంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త పూర్తిగా అబద్ధమని, దీనికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని తన ఫ్యాక్ట్ చెక్ పోస్టులో తేల్చి చెప్పింది. చిన్న విలువ కలిగిన ఈ నోట్లను రద్దు చేసే ఎలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ తీసుకోలేదని PIB స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు కంగారుపడాల్సిన అవసరం లేదు.
35
పాత నోట్ల రద్దుపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రియాక్ట్
ఇదే విషయంపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా స్పందించింది. తమ పేరుతో పాత నోట్ల రద్దు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఈ బ్యాంక్ ఉన్నతాధికారులు ఖండించారు. తమ బ్యాంకు పేరును ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని… కస్టమర్లు, ప్రజలు ఈ వదంతులను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది. ఏదైనా అనుమానాలుంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి క్లారిటీ తీసుకోవాలని మహారాష్ట్ర బ్యాంక్ సూచిస్తోంది.
ఇక భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా, ప్రజలను గందరగోళానికి గురిచేసేలా పాత నోట్ల రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వివరణ ఇచ్చింది. 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ప్రస్తుతం పూర్తి చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించడంపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.
పాత మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను మార్చుకోవాలని గతంలో సూచించామని… మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్న కొత్త నోట్లను పొందాలని సలహా మాత్రమే ఇచ్చామంటోంది ఆర్బిఐ. ఇదే సోషల్ మీడియాలో పాత నోట్ల రద్దు ప్రచారానికి కారణం కావచ్చు. అయితే పాత నోట్లను రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేము…. అవి చెల్లుబాటులోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
55
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
2016లో రూ.500, రూ.1,000 నోట్లను అకస్మాత్తుగా రద్దు చేసిన ఘటన ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే ఇలాంటి వార్తలు వేగంగా వ్యాపించి భయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి కరెన్సీ నోట్లు, బ్యాంకింగ్ సేవలు లేదా RBIకి సంబంధించిన ఏ సమాచారమైనా, సోషల్ మీడియా పోస్టులను గుడ్డిగా నమ్మొద్దు. RBI, PIB ఫ్యాక్ట్ చెక్ వంటి అధికారిక ప్రకటనలను చూసి నిర్ధారించుకున్న తర్వాతే నమ్మడం సురక్షితం.