ఏమిటీ..! సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు కాదు ఏకంగా వారంపాటు ఊపిరి తీసుకోకుండా బతికే జీవులు కూడా ఈ భూమిపై ఉన్నాయా..! ఇలాంటి ఓ జీవి మన ఇళ్లలోనూ కనిపిస్తుంది. అదేంటో తెలుసా?
ఒక్కపూట అహారం లేకుంటేనే మనిషి అల్లాడిపోతాడు... రెండుమూడు రోజులు తినకుంటే పేషెంట్ లా మారిపోతాడు. అదే ఓ పది ఇరవైరోజులు ఫుడ్ లేకుంటే ప్రాణాలే పోతాయి. మనిషే కాదు చాలా జంతువులు అహారం లేకుండా ఎక్కువరోజులు జీవించలేవు. కానీ భూమిపై ఓ జీవి మాత్రం సంవత్సరం పాటు అహారం లేకుండా జీవించగలదట... ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారం రోజులపాటు అసలు శ్వాస తీసుకోకున్నా బ్రతుకుతుందట. ఇంతకూ ఆ జీవి ఏది? దాని జీవనవిధానం ఎందుకంత ప్రత్యేకంగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం.
25
తేళ్లు అహారం కాదు అసలు గాలికూడా పీల్చకుండా బ్రతుకుతాయా..!
తేలు... ఇది సహజంగా ఇళ్లలో, పొలాలవద్ద, బండరాళ్లకింద కనిపించే చిన్న జీవి. ఇది విషపూరితమైనదే అయినప్పటికీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాదు. అయితే సాధారణంగా చీమల నుండి పాముల వరకు ఏ జీవి, దేన్ని ఎక్కువగా తింటుందో మనకు తెలుసు... కానీ తేళ్లు ఏం తింటాయి? అంటే సమాధానం ఉండదు. అయితే తేళ్లు అహారం కోసమే జీవించే జీవులు కావు... ఇవి ఫుడ్ లేకుండా ఏకంగా ఒక సంవత్సరం పాటు జీవిస్తాయి.
తేళ్ళలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఇవి ఊపిరి పీల్చుకోకుండా ఆరు రోజుల వరకు బతకగలవట. భూమి మీద అత్యంత కఠినమైన వాతవారణ పరిస్థితులను కూడా తట్టుకుని బ్రతుకుతాయి ఈ తేళ్లు. నీటిలో మునిగినా లేదా ప్రమాదకరమైన వాయువులు విడుదలైన సమయంలో తేళ్లు శ్వాస రంధ్రాలను (స్పైరాకిల్స్) మూసివేస్తాయి... పరిస్థితులు చక్కబడే వరకు ఇలా ఊపిరి తీసుకోకుండా ఉండగలవు. ఇలా నిమిషాలు, గంటలు, రోజులు కాదు... గరిష్ఠంగా ఆరేడు రోజులపాటు గాలి పీల్చుకోకుండా జీవిస్తుంటాయి తేళ్లు.
35
ఊపిరి తీసుకోకుండా తేళ్ళు ఎలా బతుకుతాయి?
మనుషులు, ఇతర జంతువుల మాదిరిగా తేళ్లలో ఊపిరితిత్తులు ఉండవు... బదులుగా 'బుక్ లంగ్స్' (Book Lungs) అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఇవి తేలు శరీరంలో పొరలు పొరలుగా ఉంటాయి. ఈ ప్రత్యేక నిర్మాణం వల్ల తేళ్లు తమ శ్వాసక్రియ వేగాన్ని బాగా తగ్గించుకుంటాయి. దీంతో ఆక్సిజన్ వాడకం తగ్గి, ఎక్కువసేపు ఊపిరి లేకుండా బతకగలుగుతాయి.
తేళ్ల జీవక్రియ (Metabolism) చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్లే అవి ఎక్కువ రోజుల పాటు ఆహారం తీసుకోకున్నా జీవించగలవు. తమ శక్తిని ఆదా చేసుకోవడానికి, ఈ జీవులు తమ కదలికలను కూడా తగ్గించుకుంటాయి.
తేళ్లలో మరో వింత లక్షణం ఉంది. ఇవి అతినీలలోహిత కాంతిలో (UV Lights) నీలం లేదా ఆకుపచ్చ రంగులో మెరుస్తాయి. తేళ్ల శరీర నిర్మాణమే ఈ మెరుపుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
55
తేళ్లది 40 కోట్ల సంవత్సరాల చరిత్ర
తేళ్లు చాలా పురాతన జీవులు…. శిలాజాల ఆధారంగా ఇవి భూమిపై 400 మిలియన్ (40 కోట్ల) సంవత్సరాల నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాజీవ శాస్త్రవేత్తలు (Paleontologists) సిలూరియన్ కాలం నాటి శిలాజాలలో తేళ్ల ఆనవాళ్లను కనుగొన్నారు. ఇవి అత్యంత పురాతన అరాక్నిడ్ వంశానికి చెందినవి.