సివిల్ సర్వీసెస్ లో మొదటి నుంచి ఉత్తర భారతదేశ రాష్ట్రాల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు సివిల్స్ సాధనలో అగ్రగామిగా నిలిచాయి. 1950 నుండి సేకరించిన గణాంకాల ప్రకారం... అత్యధికంగా 2,000 మంది ఐపీఎస్ అధికారులను అందించి ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దది కావడం మాత్రమే కాకుండా సివిల్స్ వైపు అక్కడి యువత చూపే ఆసక్తే దీనికి ప్రధాన కారణం. ఇక 1,450 మంది ఐపీఎస్ అధికారులతో బిహార్ రెండవ స్థానంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది.
ముందంజలో రాజస్థాన్, తమిళనాడు
ఈ జాబితాలో 1,000 మంది ఐపీఎస్ అధికారులను దేశానికి అందించడం ద్వారా రాజస్థాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్ యువతలో రక్షణ, పోలీస్ రంగాల పట్ల ఉన్న ఆసక్తి దీనికి నిదర్శనం.
ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. సివిల్ సర్విసెస్ లో తమిళనాడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తమిళనాడు నుంచి ఇప్పటివరకు 930 మంది ఐపీఎస్ అధికారులు ఎంపికై, దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం విశేషం.