Raining Fish : ప్రపంచంలో ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. హోండురాస్లోని యోరో పట్టణంలో ప్రతి ఏటా ఆకాశం నుండి చేపల వర్షం కురుస్తుంది. 150 ఏళ్లుగా జరుగుతున్న ఈ వింత వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆకాశం నుంచి పడుతున్న చేపలు.. వర్షం పడితే ఈ ఊరిలో ఫ్రీగా చేపల విందు
ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఊహించని వింతలు కళ్లముందు జరుగుతుంటాయి. అలాంటి ఒక వింతే హోండురాస్ దేశంలోని యోరో అనే చిన్న పట్టణంలో చాలా కాలం నుంచి జరుగుతోంది. సాధారణంగా వాన పడితే ఆకాశం నుండి నీటి చుక్కలు రాలడం సహజం. కానీ, ఈ పట్టణంలో మాత్రం ఆకాశం నుండి చేపలు రాలతాయి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది గత 150 ఏళ్లుగా ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం. దీనిని స్థానికులు స్పానిష్ భాషలో లూవియా డి పెసెస్ అని పిలుస్తారు, అంటే చేపల వర్షం అని అర్థం.
26
ఆకాశం నుంచి కురుస్తున్న చేపల విందు
హోండురాస్లోని యోరో పట్టణంలో ప్రతి సంవత్సరం మే, జూలై నెలల మధ్య ఈ వింత చోటుచేసుకుంటుంది. వర్షాకాలం ప్రారంభంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను వస్తుంది. ఆ తుపాను తగ్గుముఖం పట్టగానే, పట్టణంలోని వీధులు, ఇంటి కప్పులు, ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న చేపలు పడి కనిపిస్తాయి. ఇవి సాధారణంగా బొటనవేలు పరిమాణంలో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చేపల్లో చాలా వరకు సజీవంగానే ఉంటాయి. ఇలాంటి వింత సంఘటన ప్రపంచంలో మరెక్కడా ఇలా ప్రతియేటా జరగడం లేదు. 1800వ సంవత్సరం మధ్య కాలం నుండి దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.
36
దైవ ప్రసాదంగా భావించే స్థానికులు
యోరో పట్టణ ప్రజలకు ఈ చేపల వర్షం అంటే భయం లేదు, అది వారికి ఒక దైవ ప్రసాదం. వర్షం తగ్గిన వెంటనే చిన్న పెద్ద తేడా లేకుండా బుట్టలు పట్టుకుని వీధుల్లోకి వస్తారు. ఆ చేపలను ఏరుకుని ఇళ్లకు తీసుకెళ్లి కూరలు వండుకుంటారు. ఈ చేపలు మంచి రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఈ చేపలను ఎవరూ అమ్మకూడదు. దేవుడు తమ ఆకలి తీర్చడానికి పంపిన వరం కాబట్టి, వీటిని కేవలం వండుకుని తినాలి లేదా ఇతరులతో పంచుకోవాలి. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా దీని కోసం పట్టణంలో 'ఫెస్టివల్ డి లా లూవియా డి పెసెస్' అనే వేడుకను కూడా నిర్వహిస్తారు.
ఈ వింత వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. 1850వ దశకంలో స్పెయిన్ నుండి జోస్ మాన్యుయెల్ సుబిరానా అనే మిషనరీ ఫాదర్ యోరో పట్టణానికి వచ్చారు. అక్కడి ప్రజల పేదరికాన్ని, ఆకలిని చూసి ఆయన చలించిపోయారు. ప్రజల ఆకలి తీర్చమని దేవుడిని మూడు పగళ్లు, మూడు రాత్రులు నిరాహార దీక్షతో ప్రార్థించారు. ఆయన ప్రార్థనలు విన్న ఆ దేవుడు ఆకాశం నుండి చేపల వర్షం కురిపించాడని, అప్పటి నుండి ప్రతి ఏటా ఇది జరుగుతూనే ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు. అందుకే ఈ చేపల వర్షాన్ని వారు పవిత్రంగా భావిస్తారు.
56
శాస్త్రీయ సిద్ధాంతాలు ఏంటి? వాటర్ స్పౌట్స్ ప్రభావం?
ఈ వింతను వివరించడానికి శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం వాటర్ స్పౌట్స్. సముద్రం లేదా నదుల పైన ఏర్పడే బలమైన సుడిగాలులు నీటితో పాటు చేపలను కూడా ఆకాశంలోకి పీల్చుకుంటాయి. ఆ తర్వాత అవి మేఘాల ద్వారా ప్రయాణించి గాలి వేగం తగ్గినప్పుడు భూమిపై పడతాయి. అయితే యోరో పట్టణానికి సమీపంలో అంత పెద్ద నదులు లేకపోవడం ఈ సిద్ధాంతానికి బలం చేకూరడం లేదు.
66
భూగర్భ నదులు.. గుడ్డి చేపల రహస్యం
మరో సిద్ధాంతం ప్రకారం.. ఈ చేపలు అసలు ఆకాశం నుండి పడవు. యోరో పట్టణం కింద భూమి అడుగున అనేక గుహలు, భూగర్భ నదులు ఉన్నాయి. భారీ వర్షాలు పడినప్పుడు ఆ భూగర్భ మార్గాలు నిండిపోయి, లోపల ఉన్న చేపలు ఒత్తిడి వల్ల పైకి తన్నుకు వస్తాయి. దశాబ్దాల క్రితం నేషనల్ జియోగ్రాఫిక్ బృందం చేసిన పరిశోధనలో ఇక్కడ కనిపించే చేపలు కళ్లు లేనివని, ఇవి కేవలం చీకటి గుహల్లో పెరిగే జాతులకు చెందినవని తేలింది. ఇది భూగర్భ సిద్ధాంతానికి బలాన్ని ఇస్తోంది. అయితే గాలిలో నుండి పడుతున్నాయని నమ్మే స్థానికులు దీన్ని ఒప్పుకోరు. ఏది ఏమైనా 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వింత ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే ఉంది.