TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే

Published : May 04, 2026, 12:39 PM IST

లేటెస్ట్ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే విజయ్‌ అధికారం కైవసం చేసుకోబోతున్నారు. మరి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌కి సాధ్యం కానిది దళపతికి ఎలా సాధ్యమైందనేది చూస్తే. 

PREV
18
చిరంజీవి, పవన్‌ కి సాధ్యం కాలేదు, విజయ్‌ కి ఎలా సాధ్యం

సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం కామన్‌. తమిళనాడులో ఎంజీఆర్‌, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ సినిమాల నుంచే వచ్చి రాజకీయాల్లో సక్సెస్‌ అయ్యారు. పోటీ చేసిన మొదటి సారే వాళ్లు సీఎం అయ్యారు. రెండు రాష్ట్రాల్లో వాళ్లు తమ ప్రభావాన్ని చూపించారు. విప్లవాత్మక మార్పులు చేశారు. బెస్ట్ సీఎంలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ వారి ప్రభావం కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి సక్సెస్‌ కాలేకపోయారు. ఈ జాబితాలో చిరంజీవి, పవన్‌ ప్రధానంగా ఉంటారు. అలాగే కమల్‌, విజయ్‌కాంత్‌ వంటి వారు కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరి ఇప్పుడు తమిళనాట విజయ్‌ దూసుకుపోతున్నారు. 2026 ఎన్నికల ఫలితాల్లో సీఎం పీఠం దక్కించుకునే దిశగా సాగుతున్నారు. ఆధిక్యంలో ఉన్నారు. ఆయన సీఎం అయినా ఆశ్చర్యం లేదు.

28
చిరంజీవికి గట్టి దెబ్బ

మరి పోటీ చేసిన మొదటిసారే విజయ్‌ అధికారం దక్కించుకునే దిశగా వెళ్తుంటే, ఈ విషయంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ఫెయిల్యూర్‌, విజయ్‌ సక్సెస్‌ కి కారణం ఏంటనేది చూస్తే. మొదటగా చిరంజీవి విషయానికి వస్తే.. మెగాస్టార్‌ 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆగస్ట్ 26న `ప్రజా రాజ్యం పార్టీ`ని స్థాపించారు. ఏప్రిల్‌లో ఎలక్షన్లు జరిగాయి. పార్టీ పెట్టిన ఏడు నెలల్లోనే ఎలక్షన్‌లోకి వెళ్లారు. భారీ ఊపుతో వచ్చినా మూడో స్థానానికి పడిపోయారు. కేవలం 18 సీట్లు మాత్రమే సొంతం చేసుకున్నారు. ఆ టైమ్‌లో కాంగ్రెస్‌ 156 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 92 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ పది సీట్లు గెలుచుకుంది. అధికారం కైవసం చేసుకుంటాననే ధీమాతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి గట్టి దెబ్బ పడింది. ఆయన 18 సీట్లకే పరిమితం కావడం ఆశ్చర్యపరిచింది.

38
రాంగ్‌ టైమ్‌లో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి

దీనికి కారణం.. ఆ సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడం రాంగ్‌ డెసీషన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం గట్టిగా నడుస్తోంది. మరోవైపు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చాలా బలంగా ఉంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో 2009లో టీడీపీ పుంజుకుంది. ఆ సమయంలో వామపక్షాలు కూడా టీడీపీతో కలిసిపోయాయి. దీంతో అది టీడీపీకి ప్లస్ అయ్యింది. రాజకీయంగా ఆ సమయంలో ఎలాంటి లోటు లేదు. రెండు ప్రధాన పార్టీలు బలంగా ఉండటంతో మూడో పార్టీకి ఛాన్స్ లేకుండా పోయింది. అదే సమయంలో చిరంజీవి రావడంతో ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో దారుణమైన పరాజయం తప్పలేదు. అలా పోటీ చేసిన మొదటి సారే చిరంజీవికి చేదు అనుభవం ఎదురయ్యింది. దీనికి తోడు ఆయన ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండలేకపోయారు. కొన్ని నెలలకే కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్ర్య హోదాలో టూరిజం మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

48
ప్రభావం చూపించకపోయిన పవన్‌ కళ్యాణ్‌

అన్న చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్న రాజకీయంగా విఫలమైన నేపథ్యంలో తానేంటో చూపిస్తానని, తాను గెలిచి నిరూపిస్తానని చెప్పి ఆయన 2014లో జనసేన పార్టీని స్థాపించారు. మార్చి 14న ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. ప్రకటించిన రెండు నెలలకే ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్‌కి రాజకీయంగా గట్టి దెబ్బపడింది. ఆయన ఏపీకే పరిమితం కావాల్సి వచ్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. పైగా తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ పార్టీకి 2014లో అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ప్రతిపక్షంలో కాంగ్రెస్‌ నిలిచింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ తెలంగాణలో తన ప్రభావం చూపించుకోగలిగింది. దీంతో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన గానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి.

58
చంద్రబాబు, జగన్‌ ముందు నిలబడలేకపోయిన పవన్‌

ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఏపీకే పరిమితమయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అదే తమ సొంత రాష్ట్రంగా వాళ్లు ప్రొజెక్ట్ చేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రం అభివృద్ధి చాలా కీలకం. అనుభవమున్న రాజకీయ నాయకుడు కావాలి. అప్పటికే రెండు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు సీఎం అయితే బెటర్‌గా పాలించగలరని జనం నమ్మారు. 2014లో ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఆ సమయంలో టీడీపీకి పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్ చేశారు. బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. పవన్‌, బీజేపీ సపోర్ట్ తో చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక ఏపీలో బలంగా ఉన్న మరో పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పైగా తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించడంతో ఆ సింపతి జగన్‌కి వర్కౌట్‌ అయ్యింది. ఆయన ఓదార్పు యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కలుసుకున్నారు. దీంతో జగన్‌కి మాస్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. గ్రౌండ్‌ లెవల్‌లో ఆయన జనాల్లోకి వెళ్లిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపించారు. ఆ సమయంలో టీడీపీ 175 సీట్లకి గానూ 117 సీట్లు గెలిచిన అధికారం సొంతం చేసుకుంది. జగన్‌ 70 సీట్లు గెలిచి ప్రతిపక్షంలో నిలిచారు.

68
డిజాస్టర్‌గా నిలిచిన జనసేన

పవన్‌ కళ్యాణ్‌ సొంతంగా తమ జనసేన పార్టీ తరఫున మొదటి సారి పోటీ చేసింది 2019లోనే. ఆ సమయంలో అటు చంద్రబాబు బలంగానే ఉన్నారు, జగన్‌ మరింత స్ట్రాంగ్‌ అయ్యారు. ఏకంగా అధికారాన్ని సొంతం చేసుకున్నారు. 175కి గానూ జగన్‌కి 151 సీట్లు వస్తే, సోలోగా పోటీ చేసిన చంద్రబాబుకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేన కేవలం 1 సీట్ మాత్రమే గెలుచుకుంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్‌.. రెండు చోట్లా ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. కారణం ఆ సమయంలో వైఎస్‌ జగన్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఆయన రాకని జనం కోరుకున్నారు. ప్రతిపక్షంలో చంద్రబాబుకి మంచి కమాండ్‌ ఉంది. రాజకీయంగా ఏపీలో పెద్దగా లోటు లేదు. పైగా పవన్‌ కళ్యాణ్‌ ఎంత వరకు రాజకీయాల్లో నిలబడతాడనే నమ్మకం జనాల్లో లేదు. ఆయన ఓ వైపు సినిమాలు చేస్తున్నారు, మరోవైపు అడపాదడపా రాజకీయాల్లో తిరుగుతున్నారు. పూర్తిగా రాజకీయాలకు కట్టుబడి ఉండటం లేదు. దీంతో పవన్‌ పై ప్రజల్లో నమ్మకం లేదు. దాని వల్లే ఆయన ఓడిపోవాల్సి వచ్చింది.

78
సీఎం కాలేకపోయిన పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ ఓడిపోవడానికి మరో కారణం కూడా ఉంది. అంతకు ముందే అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టి, ఆ తర్వాత వేరే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. రాజకీయాల్లో కూడా నిలబడలేదు. ఆ ప్రభావం పవన్‌ కళ్యాణ్‌పై పడింది. అన్న లాగే తమ్ముడు కూడా రాజకీయాల్లో పూర్తి కాలం నిలబడలేడనే చర్చ ఎక్కువగా జరిగింది. మరోవైపు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా రాజకీయంగా దెబ్బకొట్టాయి. ఇవన్నీ పవన్‌ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఆ తర్వాత గత ఎన్నిల్లోనూ ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేశారు. చంద్రబాబు అధికారం దక్కించుకోవడానికి సహకరించారు. అదే సమయంలో పోటీ చేసిన అన్నీ సీట్లల్లో జనసేన విజయం సాధించింది. 21 సీట్లకు గానూ 21 గెలుచుకుంది. ఇప్పుడు పవన్‌ డిప్యూటీ సీఎంగా ఏపీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇప్పట్లో పవన్‌కి సీఎం అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

88
విజయ్‌ సక్సెస్ కి కారణమిదే

ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్‌ మాత్రం పోటీ చేసిన మొదటిసారే అధికారం దక్కించుకునే దిశగా వెళ్తున్నారు. హంగ్‌తో అయిన, లేదంటే ఏఐడీఎంకేతో కలిసి అయినా విజయ్‌ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌కి, కమల్‌, విజయ్‌ కాంత్‌లకు సాధ్యం కానిది విజయ్‌ కి ఎలా సాధ్యమయ్యింది అనేది చూస్తే, తమిళనాడులో.. కమల్‌ హాసన్‌, విజయ్‌ కాంత్‌ లు పార్టీలు పెట్టి పోటీ చేసినప్పుడు అక్కడ రాజకీయంగా వ్యాఖ్యూమ్‌ లేదు. అటు కరుణానిధి, జయలలిత రాజకీయంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కమల్‌ పోటీ చేసినప్పుడు డీఎంకే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పైగా కమల్‌కి రాజకీయంగా అంతగా ఫాలోయింగ్‌ లేదు. దీంతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళనాట ఆ రాజకీయ లోడు గట్టిగా ఉంది. అధికారం డీఎంకేపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది. దీనికితోడు ప్రతిపక్ష ఏఐడీఎంకే వీక్‌గా ఉంది. అందులో బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద లోటు. ఇవన్నీ ఇప్పుడు విజయ్‌కి కలిసి వచ్చాయి. రాజకీయంగా విజయ్‌ లాంటి నాయకుడి అవసరం తమిళనాడులో ఉంది. సరైన సమయంలో విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. పైగా రెండేళ్లుగా ఆయన గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూ వచ్చారు. ఏ వర్గాన్ని కొట్టాలో పక్కా ప్లాన్‌తో వచ్చారు. టార్గెట్‌ చేసి మరి ఆయా వర్గాల ప్రజల ఓట్లని సొంతం చేసుకున్నారు. యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేశారు. ఇవన్నీ ఆయనకు ఓట్ల రూపంలో కలిసి వచ్చాయి. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా అధికారం దక్కించుకునే దిశగా వెళ్తున్నారు. ఇదే చిరంజీవి, పవన్‌కి.. విజయ్‌కి ఉన్న తేడా అని చెప్పొచ్చు. విజయ్‌ సక్సెస్‌కి ఇదే కారణమని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories