Motivational story: జీవితానికి లక్ష్యం ఏంటి.. అని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం గెలవడం. అయితే ఎలాగైనా గెలవాలనుకునే వారే ఎక్కువ. కానీ ఈ కథ చదివితే మాత్రం జీవితానికి అసలైన లక్ష్యం ఏంటో మీకే తెలుసుకుంది.
పూర్వం దుర్వాస అనే రాజ్యాన్ని నరేంద్రుడు అనే రాజు పాలించేవాడు. అతడు ఒక రోజు ప్రజల ధైర్యం, పట్టుదల ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే రాజభవనంలో సభ ఏర్పాటు చేసి, రాజ్యంలో ఉన్న యువకుల కోసం ఒక ప్రత్యేక పోటీ నిర్వహించాలని ప్రకటించాడు. “ఎవరు నిజమైన ధైర్యవంతులు? ఎవరు కష్టాన్ని ఎదుర్కొంటారు?” అనే ఆలోచనతో ఈ పోటీ పెట్టాడు. పోటీలో గెలిచిన వారికి గొప్ప బహుమతులు ఇస్తానని రాజు ప్రకటించాడు. దీంతో ఆ వార్త కొద్ది గంటల్లోనే రాజ్యం అంతా వ్యాపించింది. పోటీ గురించి విన్న యువకులు అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధమయ్యారు. రాజభవనం దగ్గర పెద్ద జనసందోహం ఏర్పడింది. అందరూ పోటీ ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూశారు.
25
ఇంతకీ పోటీ ఏంటంటే.?
పోటీ రోజు రాజు అందరినీ మైదానానికి పిలిపించాడు. అక్కడ ఒక భారీ బండరాయి ఉంది. ఆ రాయి భారీ పరిమాణంలో ఉండటంతో చూసిన వారికే భయం వేసింది. అప్పుడు రాజు “ఈ రాయిని ఎవరు కదిలించగలరో వారు ఈ పోటీలో విజేతలు. వారికి పెద్ద బహుమతి ఇస్తాను.” అని ప్రకటించాడు. ఇది విన్న వెంటనే రాజ్యంలో ఉన్న కండలు తిరిగిన యువకులు, బలమైన వ్యక్తులు అందరూ ముందుకు వచ్చారు. వాళ్లందరూ తమ బలంపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే అదే సమయంలో అక్కడికి ఒక బక్క పలచని వ్యక్తి కూడా పోటీలో పాల్గొనడానికి వచ్చాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న వారు నవ్వుకున్నారు. “నీలా బలహీనంగా ఉన్నవాడు ఈ రాయిని ఎలా కదిపుతాడు?” అని హేళన చేశారు.
35
ధైర్యం కోల్పోయిన బలవంతులు
తర్వాత రాజు అందరినీ ఆ బండరాయి దగ్గరకు తీసుకెళ్లాడు. రాయిని దగ్గరగా చూసిన వెంటనే చాలా మంది ఆశ్చర్యపోయారు. అది చాలా పెద్దది, చాలా బరువుగా కనిపించింది. “ఇది కదల్చడం అసాధ్యం” అని కొందరు అనుకున్నారు. కొంతమంది బలవంతులు ప్రయత్నించాలనే ధైర్యం కూడా చేయలేదు. చివరికి చాలా మంది పోటీదారులు ఒకరికొకరు చూసుకుంటూ పోటీ నుంచి తప్పుకున్నారు. “ఇది మన వల్ల కాదు” అని వెనక్కి తగ్గిపోయారు. అయితే అందరూ వెనక్కి తగ్గిన సమయంలో ఆ బక్క పలచని వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు.
ఆ వ్యక్తి బండరాయి దగ్గరకు వెళ్లి దాన్ని కదిలించే ప్రయత్నం ప్రారంభించాడు. మొదట రెండు చేతులతో తోశాడు. తర్వాత మరింత బలంగా ప్రయత్నించాడు. చాలాసేపు ప్రయత్నించినా రాయి మాత్రం ఏమాత్రం కదలలేదు. అతని ఒళ్లంతా చెమటలు పట్టాయి. చేతులు నొప్పి పుట్టాయి. అయినా కూడా అతడు వెనక్కి తగ్గలేదు. చూస్తున్న ప్రజలు మాత్రం “అనవసరంగా శ్రమ పడుతున్నాడు.” “చివరికి గాయాలు చేసుకున్నాడు.” అని అన్నారు. చివరకి పోటీ సమయం ముగిసింది. రాయి మాత్రం అలాగే ఉంది.
55
రాజు కీలక ప్రకటన
పోటీ ముగిసిన తర్వాత రాజు ఆ వ్యక్తిని తన దగ్గరకు పిలిచాడు. అందరి ముందూ నిలబెట్టి “ఈ పోటీలో విజేత ఇతనే!” అని ప్రకటించాడు. అది విన్న పోటీదారులంతా ఆశ్చర్యపోయారు. “రాయిని కదల్చలేని వ్యక్తిని ఎలా విజేతగా ప్రకటిస్తారు?” అని అడిగారు. అప్పుడు రాజు చిరునవ్వుతో.. “రాయిని కదల్చాలంటే ముందుగా ప్రయత్నం చేయాలి కదా! మీలో చాలా మంది రాయిని చూసి భయపడ్డారు. ప్రయత్నించడానికి కూడా ముందుకు రాలేదు. కానీ ఇతడు మాత్రం భయపడకుండా ప్రయత్నించాడు. గెలవకపోయినా ప్రయత్నం చేయడం గొప్ప విషయం.” అని చెప్పి అతడికి మంచి బహుమతి ఇచ్చి అభినందించాడు.
నీతి: ఈ కథలో ఒక గొప్ప సందేశం ఉంది. మనలో చాలా మంది సమస్యను చూసి వెనక్కి తగ్గిపోతారు. ఓడిపోతామేమో అనే భయంతో ప్రయత్నించరు. కానీ నిజానికి గెలుపు లేదా ఓటమి కాదు, ప్రయత్నమే ముఖ్యమైనది. ప్రయత్నించే ధైర్యం ఉన్నవారే జీవితంలో ముందుకు వెళ్తారు. ప్రయత్నం చేసినవాడు ఎప్పుడూ నిజమైన విజేతే.