
చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఇప్పటికే రూ.350కోట్లు దాటినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి, రాఘవేంద్రరావు, వివి వినాయక్, దిల్ రాజు, సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు చిత్ర బృందం, ఇతర గెస్ట్ లు పాల్గొన్నారు. చిరంజీవికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాన్ని వినాయక్ పంచుకున్నారు.
చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ సినిమా ఈవెంట్కి వచ్చారు. ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. చివరగా హిందీలో `ఛత్రపతి` రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆడలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయితే చిరంజీవితో ఆయన `ఠాగూర్`, `ఖైదీ నెం 150` చిత్రాలు రూపొందించారు. ఈ రెండూ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. చిరు కెరీర్లో మైలురాయిలాంటి చిత్రాలుగా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన మెగాస్టార్ హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ సక్సెస్ సెలబ్రేషన్లో పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నారు. టీమ్కి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ ఓ సంఘటనని రివీల్ చేశారు.
తాను ముంబయి జూహులోని మారియట్ హోటల్లో లాబీలో కూర్చుంటే ఒకసారి లతా మంగేష్కర్ వచ్చారట. ఆమె రాకతో లాబీలోని అందరు లేచి నిలబడ్డారట. నమస్కారం చేసి, ఆమె వెళ్లే వరకు నిల్చోనే ఉన్నారట. ఆమె కూడా అందరికి నమస్కారం చేస్తూ లోపలికి వెళ్లిపోయారట. చాలా కాలం తర్వాత అదే మారియట్ హోటల్లో తాను ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చారట. అప్పుడు కూడా సేమ్. లాబీలో ఉన్న వారంతా లేచి నిలబడి, ఆయనకు సమస్కారం చేశారు. ఆయన కూడా నమస్కారం చేసుకుంటూ వెళ్లిపోయారట.
అలాంటి సంఘటనే అన్నయ్య(చిరంజీవి) విషయంలో జరిగిందని తెలిపారు దర్శకుడు వినాయక్. `ఖైదీ నెం 150` మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకుని చెన్నై ఎయిర్ పోర్ట్ కి వినాయక్ వచ్చారట. ముందుగా వచ్చి తాను కూర్చున్నాడట. ఆ తర్వాత ఫ్లైట్ టైమ్కి చిరంజీవి వచ్చారట. మెగాస్టార్ రావడంతోనే అక్కడ లాంజీలో కూర్చున్న వారంతా సైలెంట్గా లేచి నిలబడి నమస్కారం చేశారట. అది చూసిన తనకు ఎంతో ఆనందం వేసిందని తెలిపారు వినాయక్. పక్క రాష్ట్రంలో కూడా ఆయన్ని గౌరవిస్తున్నారంటే, అది ఆయన సంపాదించిన గొప్ప పేరుకి నిదర్శనం అని చెప్పారు. అయితే వినాయక్ మాటలకు ఈవెంట్లో రియాక్ట్ కాలేదు. దీంతో `ఏ క్లాప్స్ కొట్టరా? నచ్చడం లేదా? అంతే మనకు మనం నచ్చం` అంటూ నవ్వుతూ సెటైర్లు పేల్చారు వినాయక్. దీంతో అంతా క్లాప్స్ కొట్టడం విశేషం.
ఇక `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ విషయంలో చాలా మంది తనకు ఫోన్ చేసి టికెట్లు అడిగారని, అయితే అందరు చిరంజీవిగారి సినిమా అన్నారు తప్పితే, ఒక్కరు కూడా చిరంజీవి సినిమా అనలేదు. అది మీరు(చిరంజీవి) సంపాదించుకున్న మర్యాద, హోదా, హ్యాట్సాఫ్ టూ అన్నయ్య` అని తెలిపారు వినాయక్. ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనిల్ కి చెందుతుంది. చిరంజీవి గారికి కథ రాయడం మామూలు విషయం కాదు. 25 రోజుల్లో కథ రాసి అందులోనూ వెంకటేష్ గారిని పెట్టి అద్భుతంగా సినిమాను తీశాడు. వెంకీ గారి కాంబినేషన్ అద్భుతంగా ఉంది. చిరంజీవిగారితో రెండు సినిమాలు తీయడం నాకు ఎంతో ఆనందం. నాకు ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమాలవి. ఆయనతో సినిమా తీయడంలో ఉన్న కిక్కు వేరు. మా అందరికీ అవకాశాలు ఇచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని తెలిపారు వినాయక్.