
లేడీ అమితాబ్ గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. రెగ్యూలర్ కమర్షియల్ హీరోయిన్గా మెప్పించి, స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలవైపు మొగ్గు చూపించింది. అందులో సక్సెస్ అయ్యింది. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపాయి. ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వసూళ్లని రాబట్టాయి. దీంతో లేడీ అమితాబ్ గా ఆమెని ఇండస్ట్రీ మొత్తం పిలిచింది. అభిమానులు కూడా అలానే ఆదరించారు. అయితే తాను లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటున్న సమయంలోనే గట్టి దెబ్బ పడింది. ఆమెకి బ్రహ్మానందం రూపంలో కోలుకోలేని దెబ్బ పడటం గమనార్హం.
హీరోయిన్లకి సూపర్ స్టార్ అనే ఇమేజ్ని తీసుకురావడంతోపాటు స్టార్ హీరోలకు పోటీగా ఇమేజ్ని క్రియేట్ చేసి, వారికి ప్రత్యేకంగా గౌరవాన్ని తీసుకొచ్చిన విజయశాంతి 1994లో వరుస పరాజయాలను చవిచూసింది. ఆ టైమ్లో విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది. `ఆశయం` మూవీ బాగా ఆడటంతో ఆమెకి ధైర్యం వచ్చింది. మేకర్స్ కూడా అలాంటి కథలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మహిళా ప్రధాన చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపింది విజయశాంతి. అందులో భాగంగా `కుంతి పుత్రడు`, `దొరగారికి దొంగపెళ్లాం`, `అత్తా కోడళ్లు`, `మగ రాయుడు`, `లేడీ బాస్` వంటి చిత్రాలు చేసింది. `కుంతి పుత్రుడు`, మోహన్ బాబుతో చేసిన `రౌడీ మొగుడు`, `దొరగారికి దొంగ పెళ్లాం` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఎన్నో ఆశలతో, ఎలాగైనా హిట్ కొట్టాలని `అత్తా కోడళ్లు` మూవీ చేసింది విజయశాంతి. ఇందులో చంద్రమోహన్, బాబు మోహన్, రాజ్ కుమార్, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు శరత్ రూపొందించిన ఈ మూవీ 1994 ఫిబ్రవరి 24న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. విజయశాంతి ఆశలపై నీళ్లు చల్లింది.
ఈ సినిమా విడుదలైన ఒక్క రోజు గ్యాప్తోనే `మనీ మనీ` విడుదలైంది. ఇందులో బ్రహ్మానందం, జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కృష్ణవంశీ కూడా పనిచేశారు. దర్శకత్వ విభాగంలో కీలక భూమిక పోషించారు. కానీ క్రెడిట్ ఇవ్వలేదు. దీన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించడం విశేషం. 1994 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో చెప్పుకోవడానికి జేడీ చక్రవర్తి మెయిన్లీడ్ గా చేసినా బ్రహ్మానందం కామెడీ హైలైట్గా నిలిచింది. ఓ రకంగా ఆయనే హీరో అని చెప్పొచ్చు. బ్రహ్మానందం కామెడీ దెబ్బకి విజయశాంతి `అత్తా కోడళ్లు` చిన్నబోయింది.
నిజానికి విజయశాంతి.. `మనీ మనీ` సినిమాని తక్కువ అంచనా వేసింది. ఇదేం చేస్తుందిలే అని భావించారు. కానీ తన సినిమాకి నెగటివ్ టాక్ రావడం, బ్రహ్మానందం మూవీలో కామెడీ బాగా వర్కౌట్ కావడంతో విజయశాంతికి పరాజయం తప్పలేదు. `మనీ మనీ` మూవీ మంచి హిట్గా నిలిచింది. దీంతో `అత్తా కోడళ్లు`తోనైనా హిట్ కొట్టాలనే విజయశాంతి ఆశలు గల్లంతయ్యాయి. మొత్తానికి ఆమెకి మరో ఫ్లాప్ తప్పలేదు. అంతేకాదు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదనే విషయాన్ని ఇది తెలియజేసింది. విజయశాంతికి హిట్ పడటానికి మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది. `అత్తా కోడళ్లు` తర్వాత `మగరాయుడు`, `లేడీ బాస్`, `స్ట్రీట్ ఫైటర్` చిత్రాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `ఒసేయ్ రాములమ్మ`తో బ్లాక్ బస్టర్ అందుకుంది విజయశాంతి. ఆ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.