
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆయన హీరోయిన్ రష్మిక మందన్నాని పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా శుక్రవారం నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా ప్రైవేట్గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకుంటారని సమాచారం. దీంతో విజయ్, రష్మిక మందన్నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. గతంలో ఎవరికీ జరగనంత చర్చ వీరి ఎంగేజ్మెంట్ విషయంలో జరుగుతుండటం విశేషం. ఇది విజయ్, రష్మికలకు ఉన్న క్రేజ్ని ప్రతిబింబిస్తోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో భాగంగా విజయ్ చిన్నప్పటి విషయం క్రేజీగా మారింది. ఆయన యాక్సిడెంటల్గా నటుడిగా మారారు.
విజయ్ దేవరకొండ మొదటగా రవిబాబు రూపొందించిన `నువ్విలా` చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. విజయ్ సాయిగా సిల్వర్ స్క్రీన్కి ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే ఇందులో ఆయనది పెద్దగా గుర్తింపు లేని పాత్ర. ఆ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` మూవీలో నెగటివ్ రోల్ చేశారు. ఈ మూవీతో కొంత గుర్తింపు దక్కింది. కానీ సినిమా అవకాశాలు రాలేదు. మూడేళ్ల వరకు సినిమాలు లేవు. మళ్లీ స్ట్రగుల్ తప్పలేదు. ఈ క్రమంలో ఎన్నో ఆడిషన్స్ కి వెళ్లారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనూ ఆయన ఆడిషన్కి వెళ్లారు. కానీ ఎంపిక కాలేదు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ రూపొందించిన `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. నాని హీరోగా రూపొందిన చిత్రమిది. ఇందులో విజయ్ ది హీరో ఫ్రెండ్ పాత్ర. ఈ సినిమాలో నాని కంటే విజయ్ పాత్రనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన యాక్టింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులోనూ విజయ్ దైవభక్తి కలిగిన కుర్రాడిగా కనిపించడం విశేషం.
`ఎవడే సుబ్రమణ్యం`తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్కి తరుణ్ భాస్కర్ రూపంలో హీరోగా ఛాన్స్ దక్కింది. ఆయన రూపొందించిన `పెళ్లిచూపులు` మూవీ విజయ్ జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ వెంట వెంటనే `అర్జున్ రెడ్డి`, `గీతా గోవిందం` వంటి బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టి టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్గా ఎదిగారు. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అమ్మాయిల్లో క్రేజ్ని చూసి అంతా షాక్ అయ్యారు. చిరంజీవి, అల్లు అర్జున్ కూడా విజయ్ని అభినందించారు. ఇండస్ట్రీ చూపు మొత్తం విజయ్ వైపు తిరిగింది. వరుసగా దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. దీంతో విజయ్ వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పారు. కానీ అక్కడే మిస్టేక్ చేశారు. సక్సెస్ క్రేజ్లో వచ్చిన చాలా సినిమాలకు ఓకే చేయడంతో ఆయన చాలా దెబ్బతినాల్సి వచ్చింది. వరుసగా ఐదు ఫ్లాప్ మూవీస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మధ్యలో `ఖుషి` ఫర్వాలేదనిపించింది. మళ్ళీ `ఫ్యామిలీ స్టార్` రూపంలో దెబ్బపడింది. ఇటీవల `కింగ్డమ్`తో డీసెంట్ హిట్ని అందుకున్నారు విజయ్.
ఇప్పుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీంతోపాటు రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. విజయ్ వెండితెరకు పరిచయం అయ్యింది `నువ్విలా`తో కాదు. దానికంటే ముందే ఆయన మరో సినిమాలో నటించారు. కాకపోతే అది పూర్తి ఫీచర్ ఫిల్మ్ కాదు. టెలీఫిల్మ్ అని చెప్పొచ్చు. అప్పట్లో దాన్ని సీరియల్ మాదిరిగా టెలికాస్ట్ చేశారు. అదేంటంటే `షిర్డిసాయి పర్తిసాయి దివ్య కథ`. ఇందులో బాలనటుడిగా విజయ్ మెరిశారు. అంతేకాదు రెండుమూడు సీన్లలో హైలైట్ కూడా అయ్యాడు. ఓ సీన్లో షావుకారు జానకీని ప్రశ్నిస్తాడు కూడా. ఆ సీన్ అందరిని ఆకట్టుకుంటోంది.
చిన్పప్పుడు విజయ్ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హైయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ సమయంలో షిర్డిసాయిపై `షిర్డిసాయి పర్తిసాయి దివ్య కథ` అనే సీరియల్(టెలీఫిల్మ్ )ని రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ బాలనటుడిగా నటించడం విశేషం. పుట్టపర్తి స్వామివారి భక్తురాలైన నటి అంజలీ దేవి తన అంజలీ దేవి టెలిఫిల్మ్స్ పై ఈ సీరియల్ని రూపొందించారు. ఇందులో నటీనటులను పుట్టపర్తి స్వామివారు స్వయంగా ఎంపిక చేశారట. అలా తన స్కూల్లో బొద్దుగా, బాగా మాట్లాడగలిగే పిల్లలను ఎంపిక చేశారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఇందులో షావుకారు జానకీ ముఖ్య పాత్ర పోషించారు. ఆమెతోపాటు అంజలీదేవి, లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సీరియల్లో షిర్డిసాయి గురించి కథ చెప్పే క్రమంలో షావుకారు జానకీని విజయ్ ఓ ప్రశ్న అడుగుతాడు. `అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామివారు ఇక్కడ ఏంచేసేవారు టీచర్` అని అడగడంతో ఆమె అసలేం జరిగిందనేది వివరిస్తుంది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇలా దైవ భక్తితో కూడిన ఫిల్మ్ తో కెరీర్ ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నసినిమాలు, రౌడీ ఇమేజ్ పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.