
చాలా మంది హీరోలు, హీరోయిన్లు చిన్నప్పుడు బాలనటులుగా మెప్పించారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన వాళ్లు ఇప్పుడు స్టార్లుగా, సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఓ బాలనటుడు కనిపిస్తున్నారు. నటి శాంతకుమారి వెనకాల ఉన్న ఆ బుడ్డోడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫోటోలో ఉన్న బాలనటుడు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. సూపర్ స్టార్గా రాణిస్తున్నారు. ఈ ఏడాది కెరీర్ బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారు.
ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఆయన ఎవరో కాదు ఇప్పుడు సూపర్ స్టార్గా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్. ఈ దృశ్యం `ప్రేమ్ నగర్` చిత్రంలోనిది. కె ఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో రూపొందిన `ప్రేమ్ నగర్` చిత్రంలో బాలనటుడిగా నటించారు వెంకటేష్. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేయగా, వాణిశ్రీ హీరోయిన్గా నటించింది. అక్కినేనికి తండ్రి పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. ఆయకు భార్య పాత్రలో శాంతకుమారి నటించింది. జమీందార్ ఫ్యామిలీ వీరిది. వీరికి ఇద్దరు పిల్లలు కళ్యాణ్, కేశవ. కళ్యాణ్ పాత్రలో ఏఎన్నార్, కేశవ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించగా, కైకాలకు బాలనటుడిగా చైల్డ్ కేశవగా వెంకీ కనిపిస్తారు.
సురేష్ మూవీస్ పతాకంపై రామానాయుడు నిర్మించిన చిత్రమిది. 1971లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏఎన్నార్ బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా వెంకీ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అంతేకాదు ఆయన బాలనటుడిగా నటించిన ఏకైక మూవీ `ప్రేమ్ నగర్` కావడం విశేషం. ఇందులో కాసేపు నటించి మెప్పించారు. ఆ తర్వాత `కళియుగ పాండవులు` వరకు మళ్లీ సినిమాల వైపు వెళ్లలేదు వెంకీ. స్టడీస్పైనే ఫోకస్ పెట్టారు. ఫారెన్లో చదువుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు.
`కళియుగ పాండవులు` మూవీని సూపర్ స్టార్ కృష్ణతో చేయాలనుకున్నారు నిర్మాత రామానాయుడు. కానీ కృష్ణ డేట్స్ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో అప్పటికప్పుడు విదేశాల్లో ఉన్న వెంకీని పిలిపించి నటనలో శిక్షణలో ఇప్పించి ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే అదరగొట్టారు వెంకీ. మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా విజయాలతో స్టార్గా ఎదిగారు. ఎక్కువగా రీమేక్లు చేసి విజయాలు సాధించారు. అదే సమయంలో ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీస్తో అలరించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరై, ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నారు.
వెంకటేష్ మధ్యలో రాంగ్ ట్రాక్ ఎక్కారు. యాక్షన్ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో మరోసారి ఫ్యామిలీకి పెద్ద పీఠ వేశారు. ఈ సినిమాబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. రూ.300కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. వెంకీ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు వెంకటేష్. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.