
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో శ్రీధర్ కి మజ్జిగ తెచ్చి ఇస్తుంది కావేరి. పక్కనే కూర్చొని ఉంటుంది స్వప్న. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. కాశీ విషయం తప్ప.. నువ్వు ఏం మాట్లాడిన వింటాను నాన్న అంటుంది స్వప్న. నేను నా కూతురితో మాట్లాడాలి అనుకుంటున్నాను. నీ మెడలో ఆ తాళి అడ్డుగా ఉంది తీసెయ్ అంటాడు శ్రీధర్.
షాక్ అవుతారు కావేరి, స్వప్న. ఏంటండి మీరు మాట్లాడేది అంటుంది కావేరి. తప్పు ఏముంది? నేను వద్దు అన్నప్పుడు తను కాశీని కావాలి అనుకుంది. ఇప్పుడు వద్దు అనుకుంటోంది. భర్తే వద్దు అనుకున్నప్పుడు వాడు కట్టిన తాళి మాత్రం ఎందుకు? అని అడుగుతాడు శ్రీధర్.
పెద్దమ్మ మిమ్మల్ని క్షమిస్తుందా నాన్న అని అడుగుతుంది స్వప్న. లేదు అంటాడు శ్రీధర్. అప్పుడు తాళి తీసేయమని పెద్దమ్మతో కూడా చెప్పాల్సింది. అప్పుడు నీకు నా బాధ అర్థమయ్యేది అని అక్కడినుంచి వెళ్లిపోతుంది స్వప్న. అక్క నువ్వు కలిసినప్పుడే కూతురు, అల్లుడు కూడా కలుస్తారు అంటుంది కావేరి.
కాంచన, నేను కలవడం జరగదు అంటాడు శ్రీధర్. నేను నీ జీవితంలో నుంచి వెళ్లిపోతే జరుగుతుంది అంటుంది కావేరి. అదేంటి కావేరి అంత మాట అన్నావు. కాంచన నాకు కావాలి. అలా అని నేను నిన్ను వద్దు అనుకోవట్లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. మనం ముందు మన కూతురికి తన భర్త విలువను తెలియజేయాలి అని చెప్తాడు శ్రీధర్.
మరోవైపు బాధగా కూర్చొని ఉంటారు కార్తీక్, దీప. అత్త ఏం చెప్పిందో విన్నావు కదా బావ అంటుంది దీప. అంటే బిడ్డను వద్దు అనుకుంటున్నావా అని అడుగుతాడు కార్తీక్. ఏడుస్తుంది దీప. మా అమ్మ ఇక్కడి పరిస్థితి తెలియక చెప్పింది. అది మన బిడ్డకే అంటే తను ఒప్పుకోదు అంటాడు కార్తీక్. మరి ఏం చెద్దాం బావ అంటుంది దీప. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటాడు కార్తీక్.
ఓ వైపు తల్లి, మరోవైపు బిడ్డ.. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అని ఏడుస్తుంది దీప. బిడ్డను చంపడానికి పర్మిషన్ అడుగుతున్నావా దీప అంటాడు కార్తీక్. నేను అలా కనిపిస్తున్నానా అని ఏడుస్తుంది దీప. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే ఎలా అని అడుగుతుంది దీప. రెండు ప్రాణాలు రెండు కళ్లు. నేను ఏ కంటిని పొడుచుకోలేను అని బాధపడతాడు కార్తీక్.
మరోవైపు జ్యోత్స్నకు అన్నం తినిపిస్తూ ఉంటుంది పారిజాతం. నా మీద అనుమానం పూర్తిగా పోయినట్లేనా అని అడుగుతుంది జ్యోత్స్న. నా కొడుకు కనిపించేంత వరకు నేను ఎవ్వరిని నమ్మను అంటుంది జ్యోత్స్న. అయితే ప్లేట్ ఇటు ఇవ్వు. నేనే తింటాను అంటుంది జ్యోత్స్న. మీ నాన్న విశ్వరూపం చూశాక కూడా నువ్వు అన్నం తినగలవా అంటుంది పారు. డాడీని ఎప్పుడూ అలా చూడలేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు కాదు.. నేను ఇంతవరకు తనను అలా చూడలేదు. ఇక అసలు నిజం తెలిస్తే దశరథ కోపం ఎలా ఉంటుందో అని అంటుంది పారిజాతం. అంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు.
ఏంటండి పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది పారిజాతం. అందుకే పిలవకుండా వచ్చాను అంటాడు శివన్నారాయణ. ఇంట్లో పెద్దదానివి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటాడు శివన్నారాయణ. అంటే నేను చూసుకోవట్లేదు అంటారా? అంటుంది పారు. జ్యోత్స్న శాంపిల్స్ ఇచ్చినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా అని అడుగుతాడు శివన్నారాయణ. అవును అంటుంది పారు.
మరి రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయి. నువ్వు సరిగ్గా చూసుంటే రెండోసారి శాంపిల్స్ ఇచ్చే పరిస్థితి రాకపోయేది అంటాడు శివన్నారాయణ. ఓ ఇప్పుడు మీరు వెళ్లారు కాబట్టి రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తాయా? ఇప్పుడు కూడా మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు అని నోరుజారుతుంది పారు. గ్రానీ అని పక్కనుంచి అరుస్తుంది జ్యోత్స్న. ఎందుకు మ్యాచ్ కావు. ఆ మాట ఎందుకు అన్నావు అని గుచ్చి గుచ్చి అడుగుతాడు శివన్నారాయణ. కవర్ చేస్తుంది పారు. సరే నువ్వు అన్నం తినమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.
వామ్మో.. నేను ఇలా మాట్లాడేశాను ఏంటి అనుకుంటుంది పారు. నిజం తెలిస్తే మన పరిస్థితి ఏంటి? నిజం తెలియకూడదంటే ఒకటి రిపోర్ట్స్ రాకుండా ఆపాలి. రెండు సుమిత్రనే లేకుండా చేయాలి. ఈ రెండు మనం చేయలేము. నీ దగ్గర ఇంకా వేరే ఐడియా ఏమైనా ఉందా అని అడుగుతుంది పారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అంటుంది జ్యోత్స్న.
మరోవైపు కాంచనను టిఫిన్ చేయమంటంది అనసూయ. దీప తిన్నదా అక్కా అని అడుగుతుంది కాంచన. లేదు చెల్లెమ్మ. ఆకలిగా లేదంటా. ఆ ఇంటికి వెళ్లాక తింటాను అని చెప్పింది అంటుంది అనసూయ. ఏంటి రోజు రోజుకు ఇలా తయారవుతోంది. నేను అడుగుతాను ఉండు అని కార్తీక్ ని పిలుస్తుంది కాంచన.
ఏంటి కార్తీక్ ఇది. దీప ఏం చేస్తోంది. ఏం అనుకుంటోంది. కడుపులో బిడ్డ గురించి అయినా పట్టించుకోవాలి కదా అంటుంది కాంచన. నేను చూసుకుంటానులే అమ్మ అంటాడు కార్తీక్. ఏం చూసుకుంటావురా అంటుంది కాంచన. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా అమ్మా.. కొన్ని బాధలు కూడా అలాగే ఉంటాయి. ముద్ద ముద్దకు గొంతుకు అడ్డం పడతాయి అంటాడు కార్తీక్.
ఇంతలో దీప అక్కడకు వస్తుంది. దీప ముఖం చూస్తే నీకు ఏమనిపిస్తుంది అక్క అని అనసూయను అడుగుతుంది కాంచన. మనకు కావాల్సినవాళ్లు త్వరలో చనిపోతారు అంటే ఎలా బాధపడతామో అలా ఉంది అంటుంది అనసూయ. ఇప్పుడు చెప్పు దీప నీ బాధ ఏంటి? నిన్న నైట్ సరిగ్గా తినలేదు. ఇప్పుడు టిఫిన్ చేయలేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు. కడుపులో బిడ్డ గురించైనా పట్టించుకోవాలి కదా.. నీకు బిడ్డ ఆకలి తెలియట్లేదా? కూర్చొని తిను అని ప్లేటు చేతికి ఇస్తుంది కాంచన. కూర్చొని తింటుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.