
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్లో దీప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దీప అంతలా ఆలోచిస్తున్నావు. రెండో బిడ్డ పుడితే ఎలా పెంచాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది అనసూయ. నువ్వు అంతలా ఆలోచించకు, కార్తీక్ బాబు ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాడని చెప్తుంది అనసూయ.
అంతలో శౌర్య దగ్గరికి వచ్చి అమ్మ నేను చెల్లి డ్రాయింగ్ వేయాలి అనుకున్నాను. కానీ పెద్ద నాన్నమ్మ తమ్ముడు పుడతాడు అంటోంది. నేను ఇప్పుడు ఈ పాపకు ఏ డ్రెస్ వేయాలి అని అడుగుతుంది. అదిగో మీ నాన్నను అడుగు అంటుంది అనసూయ. అదే విషయాన్ని కార్తీక్ తో చెప్తుంది శౌర్య. భార్యాభర్తలు ఇద్దరూ బాధగా ఉంటారు.
కాంచన వచ్చి నీ వయసుకు తగిన మాటలు మాట్లాడు అంటుంది. ఆ తర్వాత గుడి గురించి మాట్లాడితే.. కడుపుతో ఉన్నవాళ్లు పూజ చేయచ్చా అత్తయ్య? నేను గుడికి రాను అంటుంది దీప. నువ్వు చేయద్దు. మేము చేయచ్చు. అయినా గుడికి రావడానికి నీ ఇబ్బంది ఏంటి? నేను మీ ఇద్దరితో మాట్లాడాలి నేనొక నిర్ణయం తీసుకున్నాను అని వెళ్లిపోతుంది కాంచన.
మరోవైపు దాసు కనిపించలేదని కంగారు పడుతుంది జ్యోత్స్న. ఇక్కడికి రాలేదు. వచ్చే దారిలో కనిపించలేదు ఎటు వెళ్లినట్లు అని ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా.. సుమిత్ర కూతురా నీ పని చెప్తా ఉండూ అనుకుంటూ పారిజాతం లోపలికి వస్తుంది. రా జ్యోత్స్న దాసు నాకు కనిపించాడు, నా కొడుకును కిడ్నాప్ చేశారు అని అంటుంది. షాక్ అవుతుంది జ్యోత్స్న.
దాసును కార్తీక్, దీప కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో దాచిపెట్టారు, అక్కడ ఇద్దరు రౌడీలను కాపలాగా పెట్టారని చెప్తుంది. బావ నాన్నను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు. అయినా ఆ విషయం నీకెలా తెలుసు అంటుంది జ్యోత్స్న. కార్తీక్ గాడిపై డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను, ఓ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే దాసు కూడా ఉన్నాడని చెప్తుంది పారిజాతం. నాన్నను కిడ్నాప్ చేయాల్సిన అవసరం బావకేంటి? బావ చేసి ఉండడు అంటుంది జ్యోత్స్న. మరెవరు చేశారు అని జ్యోత్స్న చెంప చెల్లుమనిస్తుంది పారిజాతం.
కొడుకు కనిపించట్లేదని నీకు మతి పోయింది అంటుంది జ్యోత్స్న. అవునే మతిపోయింది, నా కొడుకు కనిపించట్లేదు అని నీ దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డాను, ఏడ్చాను. కానీ నువ్వు నా కొడుకును కిడ్నాప్ చేసి ఏం తెలియనట్లు నాటకాలు ఆడావు అని మళ్లీ చెంప పగలగొడుతుంది పారు.
మరోవైపు ఏదో నిర్ణయం తీసుకున్నాను అన్నావు ఏంటమ్మా అని అడుగుతాడు కార్తీక్. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అంటుంది కాంచన. మొన్నటివరకు దీప బాధపడుతుందంటే అత్త కోసం అన్నావ్. ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది. దీప అస్తమానం ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు గుడికి కూడా రానంటోంది, దీప ప్రవర్తన చూస్తే నాకు భయమేస్తోంది అంటుంది కాంచన.
నీ బిడ్డకు ఏం కాదని నాకు మాటిచ్చావ్. ఆ మాటకు కట్టుబడి ఉంటానని మళ్లీ మాటివ్వు దీప అని అడుగుతుంది కాంచన. నువ్వు అన్ని మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని నాకు మాటివ్వు అమ్మ అని కాంచనను అడుగుతాడు కార్తీక్. షాకై సైలెంట్ అవుతుంది కాంచన.
మరోవైపు నా కొడుకును ఏం చేశావో చెప్పు అని జ్యోత్స్నను ఎడాపెడా వాయిస్తుంది పారిజాతం. గ్రానీ కాసేపు ఆగు. నేను చెప్పేది విను అని బ్రతిమాలుతుంది జ్యోత్స్న. నువ్వు నా మనుమరాలివి అనుకున్నాను. కానీ కాదు.. నువ్వు ఒకవేళ నా మనవరాలివే అయినా, నా కొడుకు జోలికి వస్తే ఊరుకోను అంటుంది పారు.
నేను నాన్నను కిడ్నాప్ చేయడానికి కారణం ఉంది అంటుంది జ్యోత్స్న. నాన్న నిజం చెప్పడానికి వచ్చాడు. అందుకే అలా చేయాల్సి వచ్చిందని కవర్ చేస్తుంది జ్యోత్స్న. మరి ఇప్పుడు దాసు ఎక్కడ ఉన్నాడు అంటుంది పారు. నా అంచనా నిజం అయితే నాన్న బావ దగ్గరికి వెళ్తాడు. బావ పోలీసులతో ఇంటికి వస్తాడు. మనం జైలుకు వెళ్తాం అంటుంది జ్యోత్స్న.
నువ్వెందుకు వెళ్తావు. దాసు నిజం చెప్పినా నువ్వే సుమిత్ర కూతురివే అని చెప్పే రిపోర్ట్స్ ఉన్నాయి కదా.. అప్పుడు నేను, నా కొడుకు తెల్ల ముఖం వేసుకొని చూడాలి. ఎటు చూసిన నష్టం నాకే. నువ్వు సుమిత్ర కూతురివి కాకుంటే రెండోసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ కాకపోయేది. అయ్యాయంటే డాక్టర్తో నువ్వు అబద్ధం చెప్పించి ఉండాలి. కానీ అలా జరగలేదు అంటే, ఆ రిపోర్ట్స్ నిజమే అంటుంది పారు. ఆ రిపోర్ట్స్ నిజమని నేను నమ్మట్లేదు అంటుంది జ్యోత్స్న. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పింది, దీని వెనుక ఎవరు ఉన్నారో నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కార్తీక, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు మామయ్య మాత్రమే అత్తయ్యను క్షమించమని అడిగేవాడు. ఇప్పుడు తండ్రి తరపును కొడుకు కూడా మాట్లాడుతున్నాడని అత్తయ్య అపార్థం చేసుకోదా బావ అని అడుగుతుంది దీప. నేను అడుగుతున్నానని అయినా నాన్న గురించి ఆలోచిస్తుందేమో చూడాలి అంటాడు కార్తీక్. నా తరపున కూడా అత్తతో నువ్వే మాట్లాడాలి అంటుంది దీప. ఏం మాట్లాడాలి అంటాడు కార్తీక్. పుట్టబోయే బిడ్డపై ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి అంటుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.