
రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. `గ్లోబ్ ట్రోటర్`గా దీన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. టైటిల్ ఇంకా కన్ఫమ్ కాలేదు. `వారణాసి` అనే టైటిల్ వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు రాజమౌళి. అందులో భాగంగా శుక్రవారం పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఆయన కుంభ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నడవలేని స్థితిలో పృథ్వీరాజ్ ఉన్నారు. అత్యాధునిక వీల్ చైర్లో కూర్చున్నారు. చూడబోతుంటే దానికి ఉన్న హ్యాండ్స్ కి శత్రువులకు మట్టుపెట్టగలిగే శక్తి ఉందని అర్థమవుతుంది.
ఈ ఫస్ట్ లుక్లో వెనకాల కొందరు సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద పిల్లర్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇది ఇండియా వైడ్గా వైరల్ గా మారింది. దీనిపై కొందరు పెదవి విరుస్తున్నారు. రాజమౌళి మార్క్ మిస్ అయ్యిందంటున్నారు. అదే సమయంలో అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఈ పృథ్వీరాజ్ లుక్ సరికొత్త చర్చకు తెరలేపిందని చెప్పొచ్చు.
అయితే రాజమౌళి సినిమాలకు సంబంధించిన ఏ పోస్టర్స్ వచ్చినా, వీడియోలు వచ్చినా `కాపీ` అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఆ మూవీ నుంచి లేపారని, ఈ మూవీ నుంచి లేపారని చెబుతూ ట్రోల్ చేస్తుంటారు కొందరు. తాజాగా `గ్లోబ్ట్రోటర్` నుంచి వచ్చిన `కుంభ` ఫస్ట్ లుక్పై కూడా విమర్శలు వస్తున్నాయి. కాపీ అంటూ స్టార్ట్ చేశారు. ఈ లేటెస్ట్ లుక్ విక్రమ్ కుమార్, సూర్య కాంబినేషన్లో వచ్చిన `24` మూవీని తలపిస్తుందని, దాన్నుంచే కాపీ కొట్టారని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్గా చేసిన సూర్య ఇలాంటి వీల్చైర్లోనే ఉంటారు. మరోవైపు బాలీవుడ్లో `క్రిష్ 3`లో విలన్ వివేక్ ఒబేరాయ్ కూడా ఇలాంటి వీల్ చైర్లోనే కనిపిస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉందంటున్నారు. మరికొందరు `ఊపిరి` అని, `స్పైడర్ మ్యాన్` అని, `ఆక్టోపస్` చిత్రాల్లోని పోస్టర్లని కాపీ కొట్టినట్టుగా ఉందని రచ్చ రచ్చ చేస్తున్నారు.
అయితే ఈసారి ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తున్నారు మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్. ఇంకా అది, ఇది చెప్పండి, మీకు ఏ పనీ పాట లేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. కౌంటర్ ఎటాక్కి దిగుతున్నారు. నెక్ట్స్ మహేష్ బాబు ది హార్స్ రైడింగ్ ఫోటో రిలీజ్ చేస్తే, హార్స్ రైడ్ చేసిన హీరోల పోస్టర్లని వేయండి అంటూ ఘాటుగా, సెటైరికల్గా స్పందిస్తున్నారు. అదే సమయంలో గ్లోబల్ ఫిల్మ్ రెడీ అవుతుందని అభినందిస్తున్నారు. రాబోయే మహేష్ బాబు లుక్ వేరే లెవల్లో ఉండబోతుందని అంటున్నారు. పోస్టర్తోనే మూవీపై అంచనాలను పెంచేశారని చెబుతున్నారు. మొత్తంగా ట్రోలర్స్ గట్టిగానే సమాధానం చెబుతున్నారు మహేష్, రాజమౌళి ఫ్యాన్స్. మొత్తానికి ఇన్నాళ్లు తనపై వ్యతిరేకతని పాజిటివ్గా మార్చుకున్నారు జక్కన్న. ఆయన మామూలోడు కాదని చెప్పొచ్చు.
ఇక మహేష్బాబు హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేసిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది. నెక్ట్స్ ఈ మూవీ నుంచి ప్రియాంక పోస్టర్ రాబోతుంది. ఆ తర్వాత మహేష్ పోస్టర్ని, వారి పాత్రలను ప్రకటిస్తారు. ఈ నెల15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఈవెంట్ చేస్తున్నారు. అందులో టైటిల్, టీజర్ని విడుదల చేయబోతున్నారని సమాచారం. అదే సమయంలో తాను ఎలాంటి మూవీ తీయబోతున్నానో రాజమౌళి వెల్లడించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ తోపాటు సాధారణ ఆడియెన్స్ కూడా దీనికోసం ఆతృతగా ఉన్నారు.