
టొవినో థామస్.. ఇప్పుడు ఈ పేరు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా వినిపిస్తోంది. `పళ్లిచట్టంబి` చిత్రంతో ఆయన త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ నటించింది. డిజో దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ హైదరాబాద్లో సందడి చేసింది. అందులో భాగంగా ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో తాను నటించడం లేదని ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా బుధవారం హీరో టొవినో థామస్ మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తెలుగులో సినిమాలు చేయకపోవడం గురించి ఆయన చెబుతూ, మలయాళంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తానని తెలిపారు. కానీ ఇక్కడ ఒక్క సినిమాకి చాలా రోజులు పడుతుందని తెలిపారు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. ఇతర హీరోలు అలా అడ్జస్ట్ చేసుకొని చేస్తారు. కానీ తన వల్ల కాదని, అంత ప్రెజర్ తాను తీసుకోలేనని తెలిపారు. తాను ఒక మూవీ చేసినప్పుడు మరో సినిమా చేయలేనని, పది రోజు ఇక్కడ, పది రోజులు అక్కడ అనేలా ఉండలేనని తెలిపారు. అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం మలయాళంలో కంఫర్ట్ గానే ఉన్నానని చెప్పారు. మలయాళ సినిమాల ద్వారానే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యానని, అదే కంటిన్యూ చేస్తానని చెప్పారు.
ఇక తాను నటించిన `పళ్లి చట్టింబి` సినిమా గురించి చెబుతూ, `దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ నాకు చాలా కాలంగా తెలుసు. సినిమా చేయాలనుకున్నాం. అయితే అప్పటికి నాకు ఉన్న సినిమాల కారణంగా వెంటనే ఆయనతో సినిమా చేయలేకపోయాను. డిజో `పళ్లిచట్టంబి` కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నేను కమిట్ మూవీస్ ఫినిష్ చేశాను. డిజో కూడా జనగణమన సినిమాతో పాటు మరో మూవీ రూపొందించాడు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించాం. కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మారారు. మేము వేరే ప్రొడ్యూసర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాం. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్ ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను.
షూటింగ్ గ్యాప్ లో వెకేషన్స్ కు వెళ్తుంటా. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మా ఫ్యామిలీతో వెకేషన్స్ లో సమయం గడపడం నాకు ఇష్టం. హెక్టిక్ షెడ్యూల్స్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కొంత విరామం తీసుకుంటేనే ఇండస్ట్రీ ఎలా ఉంది గమనించగలుగుతాం. నేను ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీ బయటివారిలా అన్నీ గమనించాలని అనుకుంటా. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్ కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాను. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నిర్మాతలు నౌఫల్, బ్రిజేష్ తో గతంలో వర్క్ చేశాను. వాళ్లు నా మూవీస్ ను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దర్శకుడు డిజో ఈ సినిమా కోసం ఏది అడిగినా అది కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. తెలుగు నుంచి ప్రొడ్యూసర్స్ చైతన్య, చాణక్య, చరణ్ వచ్చి మా మూవీ చేయడం హ్యాపీగా అనిపించింది. జేక్స్ బిజోయ్ తన మ్యూజిక్ తో మా మూవీలోని ఇంటెన్సిటీని, ఎఫెక్ట్ ను మరింతగా పెంచారు.
`పళ్లిచట్టంబి` సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్ గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. అంతేకానీ ఆ పరిస్థితుల నేపథ్యాన్ని మా అభిప్రాయ కోణంలో చూపించలేదు. మానవత్వం ముఖ్యమనే పాయింట్ ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. పళ్లిచట్టంబిలో మతాల గురించిన ప్రస్తావన, ఏ మతాన్ని తక్కువ చేయడం కానీ చూపించలేదు. కథానుసారం చర్చి నేపథ్యంగా సన్నివేశాలుంటాయి. ఆ ప్లేస్ లో మరో ఆలయాన్ని పెట్టుకున్నా, కథలో మార్పేమీ ఉండదు. సోషియో పొలిటికల్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. సినిమాను చూడ్డానికి భాష అవసరం లేదు. మనం ప్రపంచభాషల్లోని అనేక సినిమాలను ఓటీటీ ద్వారా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. నేను తెలుగు తెలియకున్నా చిన్నప్పుడు ఎన్నో తెలుగు మూవీస్ ను చూసి ఎంజాయ్ చేశాను. చిరంజీవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా చూశాను. అలాగే `ఆర్య` మూవీ కూడా చూశాను. వాటిని ఎంజాయ్ చేశాను` అని తెలిపారు.