
రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా రాణించారు. 1990లో చిరంజీవికి పోటీ ఇచ్చారు. ఓ దశలో మెగాస్టార్ని కూడా దాటిపోయారు. వరుస హిట్లతో టాలీవుడ్ని షేక్ చేశారు.
యాక్షన్ సినిమాలతో ఆయన మంచి విజయాలు అందుకున్నారు. యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. యాక్షన్, సెంటిమెంట్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచారు.
అయితే రాజశేఖర్ మల్టీస్టారర్లు చేసింది తక్కువ. కానీ కొన్ని ఆఫర్లని రిజెక్ట్ చేశారు. బాలయ్యతో చేయాల్సిన మూవీని రిజెక్ట్ చేశారు.
రాజశేఖర్ తన కెరీర్ ఇండస్ట్రీ హిట్లని మిస్ చేసుకున్నారు. కాల్షీట్లు లేకపోవడం, సరైన జడ్జ్ మెంట్ లేకపోవడమో గానీ మంచి సినిమాలను రిజెక్ట్ చేశారు. `జెంటిల్మెన్`, `ఠాగూర్` వంటి చిత్రాలను రాజశేఖర్ వదులుకున్నారు.
అలానే బాలయ్యతో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నారు. బాలయ్య కోరి ఆఫర్ ఇస్తే నో చెప్పేశారు ఈ టాలీవుడ్ యాంగ్రీ యంగ్మేన్. ఏ సినిమా విషయంలో ఇది జరిగిందో చూస్తే.
బాలకృష్ణ ఇప్పుడు వరుసగా విజయాలు అందుకుంటూ మంచి జోష్లో ఉన్నారు. కానీ `అఖండ`కి ముందు ఆయన వరుసగా పరాజయాలు ఫేస్ చేశారు.
ఆ సమయంలో వచ్చిన చిత్రమే `జై సింహ`. కేఎస్ రవికుమార్ దీనికి దర్శకుడు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఇందులో ఓ ముఖ్య పాత్రకోసం హీరో రాజశేఖర్ ని రికమండ్ చేశారు బాలయ్య.
స్వయంగా ఆయనే ఈ ఆఫర్ చేశారట. మీకు కావాలంటే మంచి ఎలివేషన్లు, ఫైట్స్ కూడా పెడదాం, ఆ విషయంలో సమస్య ఏం లేదు, మీకు కావాల్సిన విధంగా మార్పులు చేద్దామని అన్నారట బాలయ్య.
కానీ రాజశేఖర్ రిజెక్ట్ చేశారట. మనం కలిసి చేయాల్సిన మూవీ ఇది కాదు, ఇంకా వేరే చేద్దామని చెప్పి నో చెప్పారట రాజశేఖర్. అలా బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా మిస్ అయ్యింది.
బాలకృష్ణ ఈ ఆఫర్ చేయడానికి కారణం.. రాజశేఖర్ హీరోగా వచ్చిన `గరుడవేగ` సినిమా సమయంలో ట్రైలర్ విడుదల కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు, ప్రమోషన్స్ పరంగా హెల్ప్ అయ్యారు.
ఆ సమయంలోనే మనం కలిసి సినిమా చేద్దామని రాజశేఖర్ అన్నారట. అందుకు బాలయ్య కూడా ఓకే చెప్పారట. దాన్ని దృష్టిలో పెట్టుకుని `జై సింహ` సినిమా చేసేటప్పుడు రాజశేఖర్కి ఈ ఆఫర్ చేశారట.
కానీ కథ పరంగానో, పాత్ర పరంగానే రాజశేఖర్కి నచ్చలేదు. మొత్తానికి తిరస్కరించారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `జై సింహ` చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. హరి ప్రియ బాలయ్యకి భార్య పాత్రలో నటించింది.
ప్రకాష్రాజ్, ఆషుతోష్రాణా, బ్రహ్మానందం, మురళీ మోహన్, కేఎస్ రవికుమార్, నటాషా దోషి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించారు. 2018లో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలయ్యింది. చిత్ర బృందం హిట్గా చెప్పుకున్నా, దీనికి డబ్బులు రాలేదు.
బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన `అఖండ 2`లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.
ఇక రాజశేఖర్ హీరోగా సినిమాలు లేవు. ఆయన నటించిన చిత్రాలు ఆడకపోవడంతో క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ మూవీలో ఆయనకు తండ్రి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.