కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు నటరాజ్ మాస్టర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు నటరాజ్ మాస్టర్ కు ఓట్లు వేసినా వేయకున్నా ఆయన పంథాలోనే హౌస్ లో నడుచుకున్నారు. ఎలిమినేట్ అయ్యాక నటరాజ్ మాస్టర్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన అనుభవాలు, ఎలిమినేట్ కావడం, తన రెమ్యునరేషన్ తదితర వివరాలని నటరాజ్ మాస్టర్ పంచుకున్నారు. నేను హౌస్ లో నాలా ఉన్నా. జెన్యూన్ గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నా. కానీ గొర్రె కసాయివాడిని నమ్మినట్లు కొందరు నాటకాలు ఆడవారికే సపోర్ట్ చేశారు. అందువల్లే తాను ఎలిమినేట్ అయినట్లు నటరాజ్ విచారం వ్యక్తం చేశాడు.
హౌస్ లో చాలా మంది సభ్యులు తమ ఒరిజినల్ క్యారెక్టర్ హైడ్ చేస్తూ నాటకాలు ఆడుతున్నారు. జనాలని పూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్స్ కి మాత్రమే తానూ జంతువుల పేర్లు పెట్టినట్లు నటరాజ్ తెలిపారు. లహరి విషయంలో రవి ప్రవర్తించిన తీరు తప్పని నటరాజ్ అన్నారు. లహరి తన వెనుకాల పడుతోంది అంటూ రవి.. ప్రియాకు చెప్పడం గుంటనక్క వేషాలు లాంటి ప్రవర్తన అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
బరువు తగ్గే టాస్క్ కోసం చాలా కష్టపడ్డాను. నాలుగున్నర గంటలపాటు వర్షంలో డాన్స్ చేశాను. కానీ ఆ ఫుటేజ్ చూపించకపోవడం దురదృష్టకరం. గతంలో కూడా తనకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చినట్లు నటరాజ్ తెలిపాడు. కానీ ఈసారి అన్ని కుదరడంతో హౌస్ లోకి ఎంటర్ అయినట్లు నటరాజ్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా నటరాజ్ జోస్యం చెప్పేశాడు. హౌస్ నుంచి ఈ వారం విశ్వ ఎలిమినేట్ అవుతాడని చెప్పాడు. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు గాను తనకు మూడు లక్షలకు పైగా పారితోషకం అందినట్లు నటరాజ్ రివీల్ చేశాడు. ఇది మంచి పారితోషికం అనే చెప్పాలి.