
నందమూరి చైతన్యకృష్ణ.. ఎన్టీఆర్ మనవడిలో ఒకరు. ఒకప్పుడు హీరోగా నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చాలా గ్యాప్తో ఇటీవల `బ్రీత్` అనే చిత్రంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ ఆడలేదు. మళ్లీ మూవీస్కి గ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో నందమూరి చైతన్యకృష్ణ తనకు సంబంధించి జరిగిన ఒక అన్యాయాన్ని బయటపెట్టారు.
మొదటి సినిమా సమయంలో తనకు అన్యాయం చేశారని తెలిపారు. చెప్పింది ఒకటి, చేసింది మరోటి అన్నారు. కథలో మార్పులు చేయడం వల్లే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. హీరో పాత్ర అని చెప్పి, పాత్రని తగ్గించడం వంటి మార్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సంఘటన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందన్నారు. తాను ఎందుకు సినిమాలు చేయలేదనే ప్రశ్నకి ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది.
దాదాపు ఇరవై ఏళ్ల పాటు వెండితెరకు దూరం కావడం, తెరవెనకే ఉండటానికి కారణాలను ఆయన వెల్లడించారు. తాను ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను చూసుకోవడానికే తెరవెనుక ఉండిపోయాడట. ఎన్టీఆర్ 1968లో రామకృష్ణ 70ఎంఎం థియేటర్ ని నిర్మించారు. అది తన కొడుకు జయకృష్ణకి వచ్చింది. ఆ థియేటర్ ని మొదట జయకృష్ణ చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన కొడుకైన చైతన్య కృష్ణ ఆ బాధత్యలు తీసుకున్నారు. వీటితోపాటు ఇతర వ్యాపారాలను తాను నిర్వహించినట్టు చెప్పారు చైతన్యకృష్ణ.
సినిమాలకు దూరంగా ఉండటానికి ఇంకో కారణం చెప్పారు. చైతన్యకృష్ణ నటించిన మొదటి సినిమా `ధమ్`. ఈ సినిమాలో ముగ్గురు విద్యార్థులకు హీరో రేంజ్ పాత్రలు ఉంటాయని, అందులో జగపతిబాబు పాత్రకి సమానంగా తన పాత్ర ఉంటుందని చెప్పారట. కానీ షూటింగ్ చేసే క్రమంలో కథ మొత్తం మారిపోయిందట. పాత్రల ప్రయారిటీ మారిపోయిందట. తనకు చెప్పింది ఒకటి, తెరపై తీసింది మరోటి అని, దాని వల్లే సినిమా పోయిందని తెలిపారు. ఆ సినిమా విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయినట్టు తెలిపారు చైతన్యకృష్ణ. అందుకే సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందట. మళ్లీ వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయినట్టు చెప్పారు. 2013-14 టైమ్లో ఇండస్ట్రీ కొంత క్రైసిస్లో ఉందని, ఆ సమయంలో సినిమాల సక్సెస్ రేటు బాగా పడిపోయిందని, పైరసీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, దీనికితోడు మంచి కథలు రాలేదు, దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే బెటర్ అనుకుని సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారాయి.
2003లో వచ్చిన `ధమ్` చిత్రంలో జగపతిబాబు, సోనియా అగర్వాల్, నేహా మెహతా హీరోహీరోయిన్లుగా నటించారు. నందమూరి చైతన్య కృష్ణ కీలక పాత్రలో మెరిశారు. బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్ వంటి భారీ కాస్టింగ్తో రూపొందింది. రాజు వూపటి దర్శకత్వం వహించారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో సినిమాలకు దూరమైన చైతన్యకృష్ణ సరిగ్గా 20ఏళ్ల తర్వాత 2023లో `బ్రీత్`లో నటించారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.