
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కోట శ్రీనివాసరావు మరణించారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. దాదాపు 50 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగిన కోటా 750 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పాత్రల విషయంలో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నేళ్ల కెరీర్ లోకోటా నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు వివాదాలు, విషాదాలు కూడా ఫేస్ చేశారు.
నటుడిగా కోట శ్రీనివాసరావు ఏంటో అందరికి తెలుసు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన జీవితంలో జరిగిన అతి పెద్ద విషాదం, ఆయన సినిమా జీవితంపై కూడా ప్రభావం చూపించింది. కోటశ్రీనివాసరావు వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉండగానే.. ఆయన తనయుడు కోటా వెంకటప్రసాద్ మరణించారు. 2010 జూన్ లో కోట తనయుడు ఓ రోడ్ యాక్సిడెంట్ లో కన్నుమూశారు.
కోటకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వెంకట ప్రసాద్ ఆయనకు ఏకైక తనయుడు. కోడుకంటే కోటాకు ప్రాణం, ఒక్క రోజు కూడా తన కుమారుడిని చూడకుండా ఉండలేకపోయేవారు. అటువంటి పరిస్థితిలో కుమారుడి మరణం కోటను తీవ్రంగా కలచివేసింది, ఆరోగ్య పరంగా కూడా క్రుంగదీసింది. అప్పటి నుంచే ఆయన అన్ని రకాలుగా డల్ అయ్యారు. చాలా కాలం డిప్రెషన్ లో ఉండిపోయిన కోట.. మళ్లీ నటించడం మొదలు పెట్టిన తరువాతే కాస్త కోలుకున్నారు.
ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన కోట కెరీర్ లో మాయని మచ్చగా నిలిచిన పాత్ర కూడా ఒకటి ఉంది. ఈ పాత్ర కారణంగా ఆయన తన్నులు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఇండస్ట్రీ దేవుడిలా కొలిచే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన సినిమాలో పెద్దయన పాత్ర చేయడం కోటాపై కోపానికి కారణం అయ్యింది.
ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణకు మధ్య ఏర్పడిన వివాదాలు ఓ సందర్భంలో తారా స్థాయికి చేరాయి. సినిమా వివాదాలు కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయితే, కృష్ణ కాంగ్రెస్ లో చేరారు.
ఈక్రమంలోనే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా, ఆయన్ను విమర్శిస్తు కొన్ని సినిమాలు చేశారు. అందులో మండలాధీశుడు ఒకటి. ఇందులో ఎన్టీఆర్ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు.పెద్దాయన హావభావాలు, డైలాగ్స్ను అనుకరిస్తూ కోట ఈ పాత్రలో అద్భుతంగా నటించారు.
అయితే ఎన్టీఆర్ ను విలన్ గా చూపించిన ఈ పాత్రను కోటశ్రీనివాసరావు చేయడంతో ఆయన ఇబ్బందులు పడక తప్పలేదు. ఇండస్ట్రీలోనే కాదు బయటక కూడా కోట శ్రీనివాసరావు కొన్ని ప్రమాదాలు ఫేస్ చేశారు.
ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా తీసిన సినిమాలో కోట పెద్దాయన పాత్ర పోషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోటాపై కన్నెర్రజేశారు. ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూశారు. ఓసారి తన కూతురిని చూడటానికి విజయవాడ వెళ్తే.. అప్పుడే ఎన్టీఆర్ పర్యటన కోసం విజయవాడ రావడం.. రైల్వే స్టేషన్ లో హడావిడి చూసి భయపడ్డారట కోటా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే ఏమౌతుందో ఏంటో అని తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశారట.
కానీ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు కోటను గుర్తుపట్టి కోటా వచ్చాడు అంటూ గట్టిగా కేకలు వేయడంతో అంతా ఆయనను చుట్టుముట్టి స్టేషన్ వెనక్కి లాక్కెళ్లి కొట్టడం మొదలు పెట్టారట. అక్కడున్నవారు పెద్దలు కల్పించుకోవడంతో ఎలాగోలా తప్పించుకున్నారట కోట శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
మండలాధీశుడు సినిమా చేయడంతో కోటాకు ఆఫర్లు ఇవ్వలేదట టాలీవుడ్ లోని కొంత మంది మేకర్స్. అంతే కాదు అనధికారికంగా కోటపై నిషేదం కూడా కొనసాగిందట. ఈక్రమంలోనే ఓ సారి ఎయిర్ పోర్ట్ లో ఉండగా అక్కడికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలుసుకున్నారు కోటా శ్రీనివాసరావు.
ఎన్టీఆర్ రాగానే వెళ్లి పలకరించి క్షమాపణ అడుగుదాం, వివరణ కూడా ఇద్దాం అనుకున్నారట. ఎయిర్పోర్ట్లోకి ఎన్టీఆర్ రాగానే కోట శ్రీనివాసరావు ఎదురెళ్లి నమస్కారం పెట్టారు. చుట్టు ఉన్నవారు కోపంగా అరవడంతో పెద్దాయన వారిని వారించారట. అప్పటికే ఈ ఎపిసోడ్ గురించి తెలిసి ఉండటంతో రామారావు గారు కొంత సీరియస్గానే ఉన్నారు. కానీ అన్ని పక్కనపెట్టి కోటను నవ్వుతూ పలకరించారట.
మీరు మంచి నటులని విన్నాను.. గాడ్ బ్లస్ యూ ఆరోగ్యం జాగ్రత్త అని కోటను భుజం తట్టి ఆశీర్వదించారట. వెంటనే ఎన్టీఆర్ పాదాలకు నమస్కరించి కోట వచ్చేశారు. దాంతో కోటకు అప్పటి వరకూ ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయిందట. పెద్దాయన క్షమించడంతో అభిమానులు కూడా శాంతించారు.
ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్ కు వెళ్తే.. కోట, బాలయ్య ఒకే హోటల్ లో దిగారుట . కోటా శ్రీనివాసరావు లిప్ట్ దగ్గర ఉండగా.. బాలయ్య అక్కడికి వచ్చారట. దాంతో నమస్కారం బాబు అని కోటా ఎదురువెళ్ళగా.. ఆయన కోపంతో కాండ్రించి ముఖం మీదే ఉమ్మేశారట. ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు, పెద్ద హీరో కావడంతో.. తానేమి అనలేకపోయారట కోటా.
అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సినిమాలు చేశామని. తనతో ఆయన క్లోజ్ గానే ఉంటారని బాలయ్యను గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోటా. ఇక కోటపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. దానికి కారణం కూడా మండలాధీశుడు సినిమానే. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తే.. అందులో పెద్దాయన పాత్ర కోటా చేయడం బాలయ్యకు కోపం తెప్పించింది.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కోట శ్రీనివాస్ రావు ఈ సినిమాలో నటించారు కాని.. ముందుగా తన పాత్ర ఏంటో చెప్పకుండా చివరి నిమిషయంలో చెప్పారట. అప్పటికే పెద్ద నటుడు కాదు కోట. దాంతో ఆ సినిమా నుంచి బయటకు రాలేక, కమిట్ మెంట్ ఇవ్వడంతో చేయాల్సి వచ్చిందని అసలు విషయాన్ని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోట శ్రీనివాసరావు.