
దసరా సీజన్ అయిపోయింది. ఈ దసరాకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లేకపోయినా డబ్బింగ్ చిత్రాలు సందడి చేశాయి. ధనుష్ `ఇడ్లీ కొట్టు`, రిషబ్ శెట్టి `కాంతారః చాప్టర్ 1` విడుదలయ్యాయి. `కాంతార 2` ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇక దసరా సీజన్ ముగిసింది. ఇప్పుడు దీపావళి సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ శనివారం నుంచే జనాలు దీపావళి పండగ మూడ్లోకి వెళ్లిపోతున్నారు. దీపావళి ఈ నెల 21 అనే విషయం తెలిసిందే. పండగ సెలవులు మూడు రోజులే అయినా, ఆ సందడి మాత్రం అప్పుడే స్టార్ కావడం విశేషం. ఈ సారి సినిమాల సందడి కూడా గట్టిగానే ఉండబోతుంది. బిగ్ స్టార్ మూవీస్ లేకపోయినా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి. ఈ దీపావళి స్పెషల్గా ఏకంగా ఏడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ముందుగానే ఆడియెన్స్ కి పండగని తీసుకురాబోతున్నాయి. వీటిలో నాలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉండగా, మూడు డబ్బింగ్ చిత్రాలున్నాయి.
ఈ సారి దీపావళి నవ్వులతో ప్రారంభం కాబోతుంది. దీపావళి పండగ స్పెషల్గా అక్టోబర్ 16న `మిత్ర మండలి` సినిమా విడుదలవుతుంది. ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా, ప్రియాంక ఎన్ఎం, వెన్నెల కిశోర్, సత్య, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విజయేందర్ రెడ్డి. బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈచిత్రం దీపావళి పండుగని ముందుగానే తీసుకురాబోతుంది. ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా, డైలాగ్ కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. ఇటీవల డైలాగ్ కామెడీతో వచ్చిన చిత్రాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇదిప్పుడు హిట్ ఫార్మూలా మారింది. దీంతో `మిత్రమండలి`పై అందరి చూపు ఉంది. ఆడియెన్స్ లో మంచి బజ్ నెలకొన్న ఈ చిత్రం ఏ మేరకు నవ్వులు పూయిస్తుందో చూడాలి.
`మిత్ర మండలి` విడుదలైన ఒక్క రోజు గ్యాప్తోనే అక్టోబర్ 17న `తెలుసు కదా` సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో `డీజే టిల్లు` ఫేమ్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించడం విశేషం. ఆయనకు జోడీగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ స్టైలిస్ట్, ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వప్రసాద్, ఆయన కూతురు కృతి ప్రసాద్ నిర్మాతలు. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. కాకపోతే మూవీపై బజ్ని తీసుకురాలేకపోయాయి. మరి ట్రైలర్ బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
అక్టోబర్ 17నే తమిళ డబ్బింగ్ మూవీ `డ్యూడ్` రిలీజ్ అవుతుంది. ఇందులో `డ్రాగన్` ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం విశేషం. `ప్రేమలు` ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ సినిమాకి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి బజ్ ఉంది. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలు `లవ్ టుడే`, `డ్రాగన్` తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఆయన్నుంచి వస్తోన్న `డ్యూడ్`పై ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రంతో ప్రదీప్ హ్యాట్రిక్ కొడతాడా అనేది చూడాలి.
ఈ రెండు సినిమాలకు ఒక్క రోజు గ్యాప్తో కిరణ్ అబ్బవరం `K-ర్యాంప్` విడుదల కాబోతుంది. `క` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కిరణ్. హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. మధ్యలో ఓ మూవీ డిజప్పాయింట్ చేసినా, ఆ ఇంపాక్ట్ కిరణ్ పై లేదు. ఇప్పుడు `K-ర్యాంప్`పై మాత్రం మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్ కంటెంట్ లో బోల్డ్ డైలాగ్లు, నేటి ట్రెండీకి తగ్గట్టుగా ఉండటంతో ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీ దీపావళి పండగ రేసులో జోరుమీదుందని చెప్పొచ్చు. నేడు ట్రైలర్ శనివారం రాబోతుంది. ఇక ఇందులో కిరణ్ అబ్బవరంకి జోడీగా హీరోయిన్ యుక్తి తరేజా నటించింది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఇందులో ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఉందని అర్థమవుతుంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన `K-ర్యాంప్` చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దీపావళి స్పెషల్గా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రంతో కిరణ్ మరో హిట్ని అందుకుంటాడా? అనేది చూడాలి.
వీటితోపాటు దీపావళి స్పెషల్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన `థామా` మూవీ ఉండటం విశేషం. హిందీలో తెరకెక్కిన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి పండుగని పురస్కరించుకుని అక్టోబర్ 21నే విడుదల కాబోతుంది. హిందీతోపాటు తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. మడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. వరుసగా సక్సెస్ జోరులో ఉన్న రష్మిక ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకుంటుందా? దీపావళి రేసులో విన్నర్గా నిలుస్తుందా అనేది చూడాలి.
వీటితోపాటు దీపావళి పండగకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు విక్రమ్ కొడుకు వస్తున్నారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన `బైసన్` మూవీ అక్టోబర్ 24న విడుదల కాబోతుంది. ఇది పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కింది. తెలుగులో దీన్ని జగదంబే ఫిల్మ్స్ పతాకంపై బాలాజీ విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రా అండ్ రస్టిక్ కంటెంట్తో ఈ చిత్రం రూపొందింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించడం విశేషం.
ఇదే రోజు తెలుగు మూవీ `ఎర్రచీర` కూడా విడుదల కాబోతుంది. ఇది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లోకి వస్తుంది. ఇందులో సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. బి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకాలపై ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్), సి.హెచ్. సుమన్ బాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇది ఈ నెల 24నే విడుదలవుతుంది. మరి ఈ చిత్రాల్లో ఎన్ని ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి? ఏది బాక్సాఫీసు వద్ద దీపావళి విన్నర్గా నిలుస్తాయనేది చూడాలి.