
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ చాలా డల్గా సాగుతుంది. ఏమాత్రం హడావుడి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి మసాలా అంశాలు లేకుండా కూల్గా సాగుతుంది. ఇదే ఈ షోకి పెద్ద మైనస్గా చెప్పొచ్చు. ఎలాంటి గొడవలు, ఫైరింగ్ లు లేకపోతే ఆడియెన్స్ అటెన్షన్ ఉండదు. చూసేవారు ఆసక్తి చూపించరు. అందుకే ఈ షోకి రేటింగ్ తగ్గిపోతుంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన వర్కౌట్ కావడం లేదు. అంతేకాదు కంటెస్టెంట్లు కూడా అంతే డల్గా ఉన్నారు. ఎవరికి వాళ్లు సైలెంట్ అవుతున్నారు. కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడం తప్ప, హడావుడి, హంగామా చేయకపోవడంతో జనాలకు షోపై పెద్దగా ఆసక్తి కలగడం లేదు. ఇక శుక్రవారం(33వ) ఎపిసోడ్లోనూ అదే జరిగింది. ఎలాంటి గొడవలు లేకుండా చాలా సింపుల్గా సాగింది.
అయితే వచ్చే ఫైర్ స్టోర్మ్(వైల్డ్ కార్డ్) ముప్పు నుంచి తప్పించుకునేందుకు వరుసగా బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నారు. ఈ డేంజర్ జోన్ నుంచి ఇప్పటికే భరణి, దివ్యలు సేవ్ అయ్యారు. శుక్రవారం ఎపిసోడ్లో కూడా మరో టాస్క్ ఇచ్చారు. ఇందులో డేంజర్ జోన్లో ఉన్న వాళ్లు పాల్గొన్నారు. ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్ లో రీతూ చౌదరీ, సంజనా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ, తనూజ, కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో పూల్లో వాటర్ క్వాంటిటీని బట్టి విన్నర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎక్కువ నీళ్లున్న వారిని గేమ్ నుంచి తొలగిస్తారు. ప్రారంభంలో సుమన్ శెట్టి కాళ్లు లేపారనే కారణంతో సంచాలక్ ఫ్లోరా తీసేసింది. ఆ తర్వాత వాటర్ ఎక్కువ ఉన్న కారణంగా డీమాన్ పవన్, రీతూ చౌదరీలను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో ఫైనల్గా తనూజ విన్నర్గా నిలిచింది. డేంజర్ జోన్ నుంచి ఆమె సేవ్ అయ్యింది.
అయితే ఈ టాస్క్ లో తనని తొలగించడంపై సుమన్ శెట్టి ఫైర్ అయ్యారు. తన కాళ్లు బార్డర్ టచ్ కాలేదని, పైకి లేపలేదని వాదించారు. కాసేపు ఫైర్ అయ్యారు. తాను చిన్నగా ఉంటాను, పూల్ గొడలకు ఎలా టచ్ చేస్తానని నిలదీశాడు. అయినా సంచాలక్ ఫ్లోరా ఆయన్ని ఎలిమినేట్ చేసింది. అయితే సుమన్ శెట్టి అలా రియాక్ట్ కావడంపై ఇమ్మాన్యుయెల్ కామెడీ చేశారు. చిరుత పులి బయటకు వచ్చిందని, గర్జించిందని కామెడీ చేయడం విశేషం. కాసేపు నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. తనూజ డేంజర్ జోన్ నుంచి బయటపడితే అందరు విష్ చేశారు, రీతూ విష్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది తనూజ. తాను ఈ టాస్క్ లో ఎలిమినేట్ కావడంపై రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. చాలా బాధపడింది. ఆ బాధలోనే ఈ ఎపిసోడ్ మొత్తం కనిపించింది. మరోవైపు తనకు సపోర్ట్ చేసే విషయంలో దివ్య, తనూజల మధ్య వాదనలు జరిగాయి. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని దివ్య తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, దివ్య, కళ్యాణ్, తనూజ, భరణి పాల్గొన్నారు. వాళ్లంతా కళ్లకి గంతలు కట్టుకుని ఉండాలి. సంచాలక్ సంజనా ఒకరిని ఎంపిక చేసి, మిగిలిన వారి తలపైన ఉన్న లైట్స్ వేయాల్సి ఉంటుంది. ఎవరిదైతే వేయరో వాళ్లు ఆ లైట్ వేయనిది ఎవరో కనిపెట్టాలి. కరెక్ట్ గా గెస్ట్ చేస్తే లైట్ వేసిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు. గెస్ చేయకపోతే తనే ఎలిమినే కావాల్సి ఉంటుంది. మొదట రాము రాథోడ్ని దివ్య గెస్ చేసింది. దీంతో కెప్టెన్సీ రేస్ నుంచి రాము తప్పుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్.. భరణీని గెస్ట్ చేశాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. రాంగ్ గెస్ చేసిన కారణంగా దివ్య ఎలిమినేట్ అయ్యింది. ఈ టాస్క్ లో చివరగా తనూజ, కళ్యాణ్ నిలిచారు. వీరిలో ఒకరిని హౌజ్ మేట్స్ కెప్టెన్గా ఎంచుకోవాల్సి వచ్చింది. అంతా కలిసి చర్చించుకుని కళ్యాణ్ పేరుని ప్రస్తావించారు. దీంతో ఐదో వారం కెప్టెన్గా కళ్యాణ్ ఎంపికయ్యారు. తనూజకి మొండి చేయి చూపించారు.
దీంతో తనూజ చాలా ఫీల్ అయ్యింది. తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన చెందింది. తనకు నాన్న(భరణి) ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారని, ఇంకా ఎవరూ సపోర్ట్ చేయడం లేదని వాపోయింది. అయితే దీనికి సంబంధించిన లాజిక్ని భరణి, ఇమ్మాన్యుయెల్ చర్చించుకున్నారు. మనం ముందుగా తనూజని సేవ్ చేశాం. కానీ ఆమె డేంజర్ జోన్ నుంచి కళ్యాణ్ని సేవ్ చేసింది. చివరికి కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరే మిగిలారు, వాళ్లంతా కళ్యాణ్ని సపోర్ట్ చేశారు. తన కారణంగానే ఇప్పుడు అతను కెప్టెన్ అయ్యాడు. అదే ప్రారంభంలో తనూజ సపోర్ట్ చేయకపోతే కళ్యాణ్ ఈ రేస్లో ఉండేవాడు కాదు, డేంజర్ జోన్లో ఉండేవాడు. కానీ ఆమె నిర్ణయం వల్ల ఇప్పుడు తనకే పోటీగా వచ్చాడు కెప్టెన్ అయ్యాడని ఇమ్మూ, భరణి చెప్పడం విశేషం. తనూజ తెలివి తక్కువ తనాన్ని వాళ్లు బయటపెట్టారు. `నీ కోసం గేమ్ ఆడుతున్నావా? కళ్యాణ్ కోసం ఆడుతున్నావా` అంటూ ఇమ్మాన్యుయెల్, సంజనా ఆమెని నిలదీయడం విశేషం. మొత్తంగా ఈ ప్రాసెస్లో కళ్యాణ్ మాత్రం జాక్ పాట్ కొట్టాడని చెప్పొచ్చు. ఈ వారం సేవ్ కావడంతోపాటు వచ్చేవారం కూడా నామినేషన్ నుంచి తప్పించుకున్నాడని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం డేంజర్ జోన్(నామినేషన్)లో సంజనా, సుమన్ శెట్టి, శ్రీజ, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, ఫ్లోరా సైనీ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది శనివారం తేలనుంది.