
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లు కొట్టారు. `అఖండ`తో స్టార్ట్ చేసి, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్కి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మరో హిట్ ఖాయమని ఇప్పటికే ప్రకటించారు బాలయ్య. నెక్ట్స్ మూవీ కూడా సక్సెస్ కాబోతుందని తన కాన్ఫిడెన్స్ ని వెల్లడించారు.
ఇదిలా ఉంటే బాలయ్య తన సక్సెస్ సీక్రెట్ని బయటపెట్టాడు. తాను సినిమాల ఎంపికలో తప్పు చేసినట్టు తెలిపారు . `అఖండ`కి ముందు బాలయ్యకి వరుసగా పరాజయాలున్నాయి. `రూలర్`, `ఎన్టీఆర్` బయోపిక్, `పైసా వసూల్` చిత్రాలు పరాజయం చెందాయి. `గౌతమీపుత్ర శాతకర్ణి` బాగానే ఆడింది. అంతకు ముందు `డిక్టేటర్`, `లయన్` చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి. `లెజెండ్`కి ముందు ఐదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. `సింహ`కి ముందు 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో `లక్ష్మీ నరసింహ`, `చెన్నకేశవరెడ్డి` చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఏకంగా 13 పరాజయాలుగా చెప్పొచ్చు.
కానీ ఇప్పుడు ఓటమి లేకుండా దూసుకుపోతున్నారు బాలయ్య. తనతోటి హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలకు కూడా సాధ్యం కాని విధంగా ఆయన సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఆ రహస్యం బయటపెట్టారు. తాను పరాజయాల నుంచి తప్పు తెలుసుకున్నట్టు తెలిపారు. `నేను కొన్ని తప్పులు చేశాను. అప్పుడు తెలుసుకున్నాను సినిమా కథలో ఆత్మని పట్టుకోవాలని. సినిమా అంటే ఒక ఆత్మ, నన్ను అర్థం చేసుకుని, మిమ్మల్ని(అభిమానులు) అర్థం చేసుకుని వెళ్లాలి. నేను ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తాను. భోజనం చేస్తున్నా, వేరే పనిలో ఉన్నా కూడా మీ గురించే ఆలోచిస్తాను. మంచి సినిమా ఇవ్వాలి, మంచి సందేశం ఇవ్వాలి పయత్నిస్తుంటాను` అని తెలిపారు బాలయ్య. మంచి మంచి దర్శకులతో పనిచేయడం తన అదృష్టమని చెప్పారు. కథలోని సోల్ని పట్టుకుని సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నట్టు చెప్పారు బాలకృష్ణ.
ఈ సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి, హీరోలకు ఆయన సలహా ఇచ్చారు. సినిమాలు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. `బోయపాటి, నేను కలిస్తే మూడు నిమిషాల్లోనే పని అయిపోతుంది. లైన్ ఏంటనేది మాట్లాడుకుంటాం, అంతే యజ్ఞంలోకి దిగిపోతాం. అనుకున్న టైమ్కి పూర్తి చేస్తాం. ఇలా అనుకున్న టైమ్కి అందరు సినిమాలు పూర్తి చేయాలి. ఒక డెడికేషన్తో వర్క్ చేయాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని తెలిపారు బాలకృష్ణ. అదే సమయంలో ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలు, వాళ్లు మెచ్చే మూవీస్ చేయాలని తెలిపారు.
`సింహ`,`లెజెండ్`, `అఖండ` తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వస్తోన్న నాల్గో చిత్రం `అఖండ 2 తాండవం`. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్గా చేస్తుండగా, హర్షాలి తన కూతురిగా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య నుంచి వస్తోన్న ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.