
రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `ఆంధ్ర కింగ్ తాలూకా`. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాటలు సైతం మెప్పించాయి. దీంతో ఈ వారం రామ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? వినిపిస్తోన్న ఫస్ట్ టాక్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
రామ్ పోతినేని హీరోగా నటించిన `ఆంధ్ర కింగ్ తాలూకా` మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలందుకుందట. ఈ చిత్రానికి యు /ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇది రెండు గంటల నలభై నిమిషాల నిడివితో ఉంటుందని, యాడ్స్, పేర్లతో కలిసి ఈ డ్యూరేషన్ అని సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అదే సమయంలో మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ముందుగా స్టోరీ ఏంటనేది చూస్తే, ఇందులో రామ్ పోతినేని సాగర్ అనే అభిమానిగా కనిపిస్తాడట. ఆయన పాలిటెక్నిక్ చదివే కుర్రాడు. స్టార్ హీరో సూర్య కుమార్గా ఉపేంద్ర నటిస్తున్నారు. సూర్య కుమార్కి సాగర్ పెద్ద అభిమాని. ఆయనపై అభిమానంతో సాగర్ ఏం చేశాడు, హీరో ప్రభావంతో సాగర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? మహాలక్ష్మితో సాగర్ లవ్ స్టోరీ ఏంటి? తండ్రితో ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది? హీరో, అభిమాని మధ్య ఎమోషనల్ బాండింగ్ని ఆవిష్కరించేలా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది.
సినిమా ప్రారంభంలో సరదాగా సాగుతుందని, ఫన్తో ఆకట్టుకుంటుందని, ఆద్యంతం ఎంగేజింగ్గా ఉంటుందని టాక్. దీనికి తోడు పాటలు అలరిస్తాయని, కథకి పాటలే మెయిన్ బ్యాక్ బోన్గా నిలుస్తాయట. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, రొమాన్స్ అదిరిపోతుందని, అదే సమయంలో హీరో, తండ్రి మధ్య బాండింగ్ కూడా హార్ట్ టచ్చింగ్గా ఉంటుందట. ఉపేంద్ర సన్నివేశాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయని, మరో వైపు ఎమోషనల్గానూ ఉంటాయని, రామ్.. ఉపేంద్రని అభిమానించే సన్నివేశాలు ప్రారంభంలో సరదాగా, ఎంటర్టైనింగ్గా అనిపించినా, సెకండాఫ్లో ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయట. అభిమాని కోసం హీరో రావడమనే సీన్లు విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని అందులో రామ్ నటన వేరే లెవల్ అంటున్నారు. హీరో కోసం అభిమానులు పడే తపనని, పిచ్చిగా అభిమానించే సన్నివేశాలను రియలిస్టిక్గా కళ్లకి కట్టినట్టు చూపించారట. సగటు హీరో అభిమాని రిలేట్ అవుతారని అంటున్నారు. దీని గురించి రామ్ చెబుతూ కథ చెప్పినప్పుడు కన్నీళ్లు వచ్చాయి, ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారట. రేపు థియేటర్లలో ఆడియెన్స్ కూడా అదే ఫీలవుతారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి నిజంగానే అంత ఎమోషనల్గా ఉంటుందా? అనేది చూడాలి. సినీ ప్రియులను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి రూ.27కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. అంటే దాదాపు యాభై కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా అది పెద్ద లెక్క కాదు. మరి ఎలాంటి రిజల్ట్ ని చవిచూస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రామ్ కి హిట్ లేక ఆరేళ్లు అవుతుంది. చివరగా ఆయన `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన `రెడ్`, `ది వారియర్`, `స్కంధ`, `డబుల్ ఇస్మార్ట్` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో `ఆంధ్ర కింగ్ తాలూకా` మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఆయనకు హిట్ పడుతుందా? మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే హీరో, ఫ్యాన్ అభిమానంతో బాలీవుడ్లో `ఫ్యాన్` అనే మూవీ వచ్చింది. షారూఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రామ్ `ఆంధ్ర కింగ్ తాలూకా` పరిస్థితి ఏంటనేది చూడాలి.